Pages

30, జనవరి 2021, శనివారం

'పెసరట్లు పలు విధములు...'

 'పెసరట్లు పలు విధములు...' అంటూ  మొదలు పెడితే జరిగేవి రెండు.. 

మొదటిది, చదివే వారి ముఖంలో చిరునవ్వైతే, 😄😄

రెండోది వారి నోట్లో ఊరే లాలాజలం. 😋😋😋😋

 ఏమని చెప్పుదునో పెసరట్టు గురించీ అనుకున్నా కానీ, ఇలా  మొదలు పెడుతూనే ఎన్నో కబుర్లు మేమున్నాం అంటూ గుర్తొచ్చేస్తున్నాయి.

 షాపు నుంచి తెచ్చుకున్న పెసల్లో రాళ్ళూ, రప్పలూ ఏరుకుని, ఓ సారి కడిగేసి, అటుపై నీళ్ళలో నానబోసేసి.. 

 బాగా నానాక ఓ చిన్న అల్లంముక్క జతచేసి జారుగా పిండి రుబ్బి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టు మహాయజ్ఞం లో మొదటి అంకం పూర్తయినట్టే. 

పెసరట్టు అంటూ అనుకున్నాక, కేవలం సాదా పెసరట్టుతో సరిపెట్టుకునే ప్రాణాలు కావు కదా మనవి.. 

అందుకని ఉల్లి పాయలు, అల్లం, పచ్చి మిర్చీ సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకుంటాం.

సరిగ్గా ఇదే సమయంలో 'ఆ చేత్తోనే కాస్త ఉప్మా కలియబెట్టెయ్య రాదూ' అని ఆత్మారాముడో, సీతో వినీ వినిపించనట్టు మూలుగుతారు.

 'అదెంత పని కనుకా' అనిపించి తీరుతుంది. 

పావుగంటలో ఉప్మా రెడీ అవ్వనే అవుతుంది. 

పెనం పొయ్యి మీదకి ఎక్కించి, బాగా వేడెక్కనిచ్చి కాసిన్ని నీళ్ళు జల్లి చూసుకుని, వేడి సరిపోతుంది అనిపించగానే ఉప్పు కలిపిన పెసరపిండితో అట్టు పోసేసి, 

అటుపై కొంచం జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలూ ఒకదాని తర్వాత ఒకటో, అన్నీ కలిపేసో మన ఓపికని బట్టి జల్లేస్తాం కదా.. ఇక్కడితో రెండో అంకం పరిసమాప్తం.

సగం కాలిన అట్టు చుట్టూనూ, మధ్యలోనూ నెయ్యో నూనో చల్లేసి, అట్టు సుతలు పైకి లేస్తున్నాయనగా ఓ గరిటెడు ఉప్మా అట్టు మధ్యలో పెట్టేసి, మన చెయ్యి తిరగడాన్ని బట్టి రెండు మడతలో, మూడు మడతలో వేసేసి 

అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉన్న ప్లేట్లోకి బదలాయించేశామంటే పెసరట్టు వంటకం పూర్తైపోయినట్టే.

పెనం, పిండీ సిద్ధంగా ఉన్నాయి.. మొదటి అట్టు వాసన ముక్కుకి తగలడంతోనే కనీసం నాలుగైదు అట్లన్నా కావాల్సిందే అని కడుపు ఆదేశాలు జారీ చేసేస్తుంది.. 

కాబట్టి అట్టు వెనుక అట్టు.. అట్టు పై అట్టు... అట్లా అట్ల వంటకం కొనసాగుతుందన్నమాట. 

దోస ని  పల్చగా, క్రిస్పీ గా తినడానికి ఇష్టపడే ప్రాణులు సైతం పెసరట్టు దగ్గరికి వచ్చేసరికి 'ఎలా ఉన్నా సరే' అనేస్తారు. 

అవును మరి, పెసరట్టు పల్చగా ఉన్నా, మందంగా ఉన్నా రుచే. 

ఉల్లి పచ్చి మిర్చి వగయిరాలతో పాటు వేయించిన జీడిపప్పు పలుకులు పెసరట్టు మీద జల్లి, కనీసం నాలుగు చట్నీలతో వడ్డిస్తే ఆ పెసరట్టు పేరు 'ఎమ్మెల్యే' పెసరట్టు.

 మందంగా వేసిన పెసరట్టుతో 'పెసరట్టు కూర' అని చేస్తారు. 

 పెసరట్టు ముక్కలని పోపులో వేసేసి, చింతపండు రసం కూడా పోస్తారు పైన.. ఏ ఇల్లాలో ఉదయం మిగిలిపోయిన పెసరట్లతో ఈ కూర సృష్టించి ఉంటుంది బహుశా.. కేవలం కూర కోసమని పెసరట్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు.

 మామూలుగా టిఫిను పుచ్చుకున్నాక కాఫీయో, టీవో సేవించడం రివాజు. 

అదే పెసరట్టు తిన్నాక అయితే, వీటికి బదులుగా పల్చటి మజ్జిగ పుచ్చుకుంటే (వీలయితే నిమ్మరసం పిండింది) రెండు మూడు గంటలన్నా గడవక ముందే కడుపు ఆకలితోకణకణ మంటుంది. 

తెలివైన ఇల్లాళ్ళు ఆదివారం పొద్దున్నే పెసరట్టుప్మా టిఫిన్ పని పెట్టుకుంటారు. 

 అప్పుడైతే ఎక్కువ వంటకాలు చెయ్యకుండానే మధ్యాహ్నం బోయినాలు కానిచ్చేయవచ్చు కదా.. మామూలు పెసరట్టు కన్నా, ఉప్మాతో కలిసిన పెసరట్టు కొంచం బరువుగానే అనిపిస్తుంది మరి. 

 అదేవిటో, పెసరట్టు కబుర్లు మాత్రం ఎన్ని చెప్పుకున్నా బరువుగా అస్సలు అనిపించవు.. 

 ఆ భరోసాతోనే ఈ కబుర్లు ముగిస్తున్నాను... 




అన్నదాత సుఖీభవా 

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****




29, జనవరి 2021, శుక్రవారం

నా మొదట సైకిల్

మనకి వంశ పారం పర్యం గా సంస్కృతి, సంప్రదాయం,ఆస్తి కాకుండా కొన్ని వస్తువులు కూడా వస్తాయి ... 

అలా నాకు నా 9 వ తరగతి లో వచ్చింది ఒక సైకిల్ 🚲🚲🚲🚲

కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , 

నా చేతికి ...క్షమించాలి .....కాలికి ....సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.

”అందుగలడిందులేడను సందేహము వలదు” 

లాగా మా బుల్లి ఊరి లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తూ వుండేదాన్ని.

ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.


రోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని మా అమ్మ మెత్తని చీర చెంగుతో మొహం తుడుచుకునే నేను.

మా అమ్మ మెత్తని చీరెలు చించి సైకిల్ తుడుచుకోవటం మొదలు పెట్టా.

ఐదు రూపాయలకి పొడవు గొట్టం ఉండే నూనె డబ్బా ఒకటి కొని దాన్లో కొబ్బరినూనె పోసి సైకిల్ చైన్లో,పెడల్స్ కి, బ్రేక్ వైర్స్ కి వేసుకోవడం.

విమానానికి  కూడా అంత సర్వీసింగ్ చేస్తారో లేదో మరి.✈✈✈✈😝😝


ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా ఓ గుడ్డ ముక్క తీసుకుని సైకిల్ తుడుచుకోవటం.

స్టీల్ రిమ్ముల మీద నా ఫేస్ కనపడేలా మెరిసిందా లేదా చూసుకోవటం ఇలా ఉండేది నా సైకిల్ బానిసత్వం.

ఇంట్లో వాళ్ళకి నా కొత్తొక వింత రోత పుట్టినా సైకిల్ వలన బయట పనులు త్వరగా చేస్తున్నాను కదా అని భరించేవాళ్ళు పాపం.

నెమ్మదిగా ఆ సైకిల్ అనే యంత్రం నా జీవితంలో ఓ ముఖ్యభాగం అయిపోయింది.

మొదట్లో వింతగా గొప్పగా ఉన్న నా సైకిల్ రాను రాను నాకు మచ్చికైన పెంపుడు జంతువులా తయారైంది.

నేను కూడా కొంచం  పొడవు పెరిగినట్లు ఉన్నాను. కాళ్ళు నేలపై ఆనేవి. 

కాలేజీ కి వచ్చాక దానికి కొన్ని హంగులు అద్ది (కొత్త బుట్ట ,బెల్ ) నాన్న ఇచ్చారు ... 


నా సైకిల్ ఎంత గట్టి ది అంటే ... 

ఒక సారి  మా లెక్కలు ప్రవేటు లో ... పక్క సైకిల్ వచ్చి నా సైకిల్ మీద పడింది ... 

నేను నా సైకిల్ పైకి తీసి దులిపి .. తొక్కు కుంటూ ఇంటికి వెళ్లి పోయాను .. 

మరనాడు నాకు తెలిసింది ...పాపం ఆ సైకిల్ ఊసలు విరిగి పోయాయి అని  ... 


నా చదువు పూర్తి అయ్యే వరకు నేను చాల జాగరత గా చూసుకున్న నా సైకిల్ 

నాకు ఉద్యోగం వచ్చాక ముందు తరాల వారికి ఇచ్చేసారు మా నాన్న గారు... 

ఇంతకూ ఇది ఇప్పడు ఎందుకు రాస్తున్నాను అనుకుంటున్నారా ... 


ఈ  రోజు నేను మళ్ళి కొత్త సైకిల్ కొనుక్కున్నాను ... 

కానీ ... చిన్నప్పటి సైకిల్ కి దినికి చాల తేడా ఉంది 


అప్పుడు సైకిల్ తొక్కితే చెమట పట్టేది . 

ఇప్పడు చెమట పట్టడం కోసం సైకిల్ తొక్కుతున్నాను ... అది ఒక గది లో 


ఏమి చేస్తాం కాలం మారింది 😟😟

                                      


ఆరోగ్యమే మహా భాగ్యం

లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****

27, జనవరి 2021, బుధవారం

మెట్ట వంకాయతో ...ముద్ద పచ్చడి

ఆకుపచ్చ రంగులో మిలమిలా మెరుస్తూ, గుండ్రంగా, గుండుచెంబుల్లా ఉండే వంకాయలకి మెట్ట వంకాయలు అని పేరు.  

వీటిని అల్లం, పచ్చిమిర్చి,  కొత్తిమీర కారంతో కూర చేసుకోవచ్చు.

 అలాగే కాల్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు. 

 ముద్ద పచ్చడి,బండ పచ్చడి, పులుసు పచ్చడి, పచ్చి పులుసు.. 

ఇలా కొద్దిపాటి మార్పులతో రకరకాల పచ్చళ్ళు చేసుకునే వీలు కూడా ఉంది. 

 జుట్టున్నమ్మ ఏకొప్పు చుట్టినా అందమే అన్నట్టుగా,!!!!!!!!!!!!!!

 అసలంటూ నవనవలాడే వంకాయలు దొరకాలే కానీ ఏ పచ్చడి చేసుకున్నా రుచే. 

మా చిన్నప్పుడు పెరట్లో నీళ్ళపొయ్యి మీద ఇంటిల్లిపాదికీ స్నానాలకి వేడి నీళ్లు కాచడం రోజూ ఓ మహా యజ్ఞం. 

పొద్దున్నే తోటకి వెళ్లిన నాన్న వస్తూ వస్తూ కూరలు తెచ్చేవాళ్ళు. 

వాటిలో ఈ వంకాయలు కనక ఉంటే, వాటిని పొయ్యిలో కాల్చే డ్యూటీ కూడా నీళ్లు కాచే వాళ్లదే. 

నీళ్ళపొయ్యి స్థానంలో గ్యాస్ స్టవ్ వచ్చినా, 

రోలు-రోకలి బండల్ని మిక్సీ రీప్లేస్ చేసినా

 మెట్ట వంకాయలు దొరికినప్పుడల్లా పచ్చడి చేసుకోవాల్సిందే. 

ముందుగా వంకాయలకి కాస్త నూనె పట్టించి, చిన్న బర్నర్ల ని లో ఫ్లేమ్ లో పెట్టి సమంగా కాల్చుకోవాలి. 

వంకాయ ఎంత వైనంగా కాలితే పచ్చడి అంత రుచిగా వస్తుందన్న మాట. 

వంకాయతో చేసే ఏ పచ్చడికైనా కాల్చడం కామనే.  

కాల్చిన వంకాయల్ని చల్లార్చి, 

మాడిన పైపొరని జాగ్రత్త తీసి,

 ముచికలు కోసేసి, గుజ్జుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

 కాలిన నుసి పొరపాటున గుజ్జులో కలిసిపోకుండా చూసుకోడంతో పాటు,

 వంకాయలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నా పొట్టలో పురుగూ పుట్రా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, గుజ్జుని కొంచం జాగ్రత్తగా మెదిపి పరిశీలించుకోవడం అవసరం. 

 గుజ్జు మీద కాస్త పసుపు చల్లి, చెంచా సాయంతో మెత్తగా చేసుకోవాలి. 

ఈ  గుజ్జుని ఓ పక్కన పెట్టుకుని, ఏ రకం పచ్చడి చేసుకోవాలి అన్నది అప్పుడు తీరికగా ఆలోచించుకోవచ్చు. 

నేను ఇప్పుడు  ముద్ద పచ్చడి చేస్తూ నాను...పైన  చేసి పెట్టుకున్న గుజ్జుకి 

చక్కగా పోపు ===శనగ పప్పు , పొట్టు మినపప్పు , పచ్చిమిరపకాయలు ముఖ్యముగా గుమ్మడి వడియాలు  పెట్టుకుని . 

వారం వర్ధం ఏమి లేని రోజు  ఉల్లిపాయలు  చక్కగా వేయించి కలుపుకుంటే .....

ఆ రుచి అద్భుతః 😋😋😋😋😋

  చిన్నప్పుడు చేసే రోటి పచ్చడి ఎలా ఉండేదంటే కాల్చి, తొక్కతీసిన వంకాయలు రోట్లో వేసి బండతో నూరేవారు. 

  రుచిలో ప్రధానమైన తేడా ఇక్కడే వస్తుంది. 

మనం ఈ చెంచాలు అవీ వాడి ఎంత జాగ్రత్తగా చేసినా ఆ బండ తాలూకు రుచి రాదుగాక రాదు. 

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రోళ్లలో వాడే పచ్చడి బండలు ఎర్ర చందనపు దుంగల నుంచి చేసేవాళ్ళు. 

  పైగా రోకలికి ఉన్నట్టుగా బండకి పొన్ను ఉండదు కాబట్టి, వద్దన్నా కాస్త ఎర్ర చందనం ఈ పచ్చళ్లలో కలుస్తూ ఉంటుంది. 

నాటి పచ్చళ్ళ రుచి తెలియని వాళ్లకి నేటి పచ్చడి రుచి మేటిగానే ఉంటుంది. 

తెలిసిన వాళ్ళు కూడా చేసేదేమీ ఉండదు,

 చిన్న నిట్టూర్పుతో సరిపెట్టేసుకోడం తప్ప!!!!!!!!!!!!!!!

ఇంతకు  ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అనుకుంటున్నారా .. 

ఈ  రోజే ఊరు నుంచి నాన్నగారు  మెట్ట వంకాయలు పంపారు 

నేను ముద్ద పచ్చడి చేసుకుంటు ఇలా మీతో కూడా పంచుకుంటున్నాను !!!!!!!!!!

మీకు కూడా దొరికితే కొంచం చేసుకుని రుచి చూడండి ...ముఖ్యముగా గుమ్మడి వడియాలు పోపు  పెట్టుకోవడం మరచి పోకండి . 





అన్నదాత సుఖీభవా 

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****




26, జనవరి 2021, మంగళవారం

చిన్ననాటి గణతంత్ర దినోత్సవ౦

మేము గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నా౦ చక్కగా. ....

మగపిల్లలు పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి  నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి.

రంగు  రంగుల జెండా కాయితాలు  కత్తిరించి  పురికొస తాడుని బడి బయట ఆ 

చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి,

 ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి ఉడికించిన మైదా తాడుకి పులమాలి.............

 జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి అతికించాలి 

 హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది..

 మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా  అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే.

 ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే. 

వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది కొందరికి !!!!!!!

అక్కడితో మగ పిల్లల పని ఐపోతుంది  


సరే, ఇప్పుడింక మా  పని మొదలవుతుంది. 

మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటాం కదా 

 టీచర్స్ దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు. 

ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా. 


అప్పుడేమో మేష్టారు, 

మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో  చెప్పేసి, 

పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని, 

ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే 

జెండా పండగ సగం అయిపోయినట్టే. 

ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి. 

మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ.

 కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. 

"అబ్బే మా నాన్నగారు అస్సలు 

కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే"


ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో 

నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి, 

మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు,

జెండా ఎగరెయ్యడానికి. . 

ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి,

 జెండా ఎగరేసేస్తారు. 

మేము పాటలు పాడేస్తా౦. 

ఈలోగా మేష్టారు కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో 

తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు. 

ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు. 


అది మొదలు పెద్ద మనుషులు 

గణతంత్ర దినోత్సవ౦   గురంచి చాల చెపుతారు .. 

 

హమ్మయ్య! చిన్న 

చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేస్తారు.... ఎప్పటిలాగే మేష్టారు గారు

 "పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని చెప్పి 

అక్కడితో జెండా పండగ ముగిసింది 



          గణతంత్ర దినోత్సవ౦ శుభాకాంక్షలు 


25, జనవరి 2021, సోమవారం

కృష్టుని మేలు కొలుపులు

 

1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన  వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల  కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది  శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము  నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు  గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార  గోపాలబాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహ లోచన మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


8. వామన రూపమున భూదాన మడిగిన పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన కశ్యప నందనా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది పొడచూతువుగాని మేలుకో || కృష్ణ తెల్లవారవచ్చేను ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


12. దామోదరా యని దేవతలందరు దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ నాదరించిన దేవ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ దర్భశయన వేగ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి వందన మొసగెద మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు మురళీనాదవినోద మేలుకో || కృష్ణా  తెల్లవారవచ్చేను||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు వనమాలికాధర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార కంససంహరణా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె గోపాల బాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


         


హరా కృష్ణ హరా కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

                                           



అతిరథ మహారథులు..అంటే..ఎవరు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.


1) రథి..ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు ---------------------వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు--------------.వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు)....7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు ---------------వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు)...86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు ----------------వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) ...ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, -----------------వీరంతా..మహామహారథులు.




                                                          🙏🙏🙏🙏🙏


                                      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 

" బద్ధకం..."

 "నాక్కొంచం బద్ధకం..." ఏదో ఒక సందర్భంలో ఈ మాట  అనని వాళ్ళు ఎవరూ ఉండరేమో కదా.. 

నావరకైతే మరీ తరచూ కాదు కానీ, అప్పుడప్పుడన్నా ఉపయోగిస్తూ ఉంటాను. 

బద్ధకం గొప్పదనం ఏమిటంటే ఇది మన దిన చర్యతో పాటే మొదలవుతుంది. 

చక్కగా ఉదయాన్నే లేవాలనుకుంటామా? మెలకువ రాగానే "

ఒక్క పది నిమిషాలు పడుకుని అప్పుడు లేద్దాం.....😴😴😴.....

ఈలోగా ప్రపంచం ఏమీ తలక్రిందులు అయిపోదు కదా.." అని అ శరీరవాణి చెబుతుంది. 

ఎప్పుడూ ఎవరి మాటా వినని వాళ్ళు కూడా ఈ మాటలు బుద్ధిగా వింటారు.

అది మొదలు మనం చేయాల్సిన ప్రతి పనినీ కాసేపైనా వాయిదా వేసేస్తూ ఉంటాం, 

కేవలం బద్ధకం వల్ల.

 అలా అని ఆ పని చేయడం ఏమన్నా తప్పుతుందా? ఆంటే అదీ లేదు.!!!!!!!

ఎందుకంటే అది మన జన్మ హక్కు. 

బద్ధకించినందుకు గాను ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉంటామా..

అయినా కూడా బద్దకించడం మానం. అలా అలవాటైపోతుందన్న మాట.😞😞

ఉదాహరణకి, చిన్నప్పుడు బళ్ళో మేష్టారు, ఇంట్లో పెద్దోళ్ళు

 "ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేసుకోండి.." అని మన చెవుల్లో బంగ్లాలు కట్టుకుని మరీ చెప్పినా మనం విన్నామా? లేదు..📚📚📚

 పరీక్షలప్పుడు బుద్ధిగా నైటౌట్లు చేసి, మనం టెన్షన్ పడి, వాళ్ళని టెన్షన్ పెట్టి, కాలక్రమేనా వాళ్ళని ఇలాంటి టెన్షన్లకి అలవాటు చేసి మన చదువు పూర్తి చేశాం. 

"మేమిలా అస్సలు చెయ్యలేదు" అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అత్యంత బుద్ధిమంతులైనా అవ్వాలి లేక అతిపెద్ద అబద్ధాలకోరులైనా అవ్వాలి. 

ఇప్పుడు మళ్ళీ పిల్లలకి హితబోధలు చేయడానికి మనం అస్సలు మొహమాట పడం, అది వేరే విషయం.

నావరకు నేను కొన్ని విషయాల్లో అస్సలు బద్ధకించను.

 కాఫీ, టిఫిన్, బోయినం.. ఇలాటి విషయాల్లో అన్నమాట. ☕🍛🍛🍕

మన బద్ధకం కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయితే ఇంక మన గొప్పదనం ఏముంది??????

 కాబట్టి, ఆఫీసు పనిలో కూడా మనం బద్ధకిస్తూనే ఉంటాం. 

అది మన హక్కు$$$$$

 అయినా చెప్పిన పని వెంటనే చేసేస్తే, ఆ వెనుకే మరో పని వెతుక్కుంటూ వచ్చేయదూ?? ????????

అయితే ఇలా బద్దకించి పని వాయిదా వేయగలిగే అదృష్టం అందరికీ ఉండదు.

బద్ధకం కేవలం మనుషులకి మాత్రమే కాదు@@@@@@@

 జంతువులకీ, వస్తువులకీ కూడా సహజమే. 

ముఖ్యంగా పెంపుడు జంతువులకి ఉండే బద్ధకం వాటిని పెంచే వాళ్ళకే తెలుస్తుంది. 

వస్తువుల విషయానికి వస్తే, కొంచం వయసైపోయిన టీవీ ఆన్ చేయగానే దృశ్యం చూపించకుండా కాస్త నెమ్మదిగా ఆ పని చేస్తుంది. 

పాత కారు, ఫ్రిజ్జు.. ఏదైనా సరే.. ఇదే పరిస్థితి దాదాపుగా. 

ఈ పోస్ట్  రాద్దామని నేను మూడు రోజులుగా బద్దకించి వాయిదా వేస్తున్నాను. ....




**అందుకే అన్నారు 
జీవితం లో భయాన్ని మించిన శత్రువు
బద్ధకాన్ని మించిన అపకారి 
ఎవరూ ఉండరు అని**



                                  లోక సమస్త సుఖినో భవంతు

                                  **** మీ ఉషగిరిధర్ ****


24, జనవరి 2021, ఆదివారం

మార్నింగ్ వాక్ తెచ్చిపెట్టిన తంటాలు

ఈ రోజు ఆదివారం కదా అని పొద్దున్నే సరదాగా మా వీధిలో ఉన్న వనస్థలి (park) కి వెళ్లాను...

వెళ్ళిన దానిని నా వాకింగ్  నేను చేసుకోకుండా 

అక్కడ ఎవరో  కొందరు కూర్చుని ఏదో వ్యాయామం చేస్తుంటే చూద్దామని దగ్గరికి వెళ్ళా....

 ఈమధ్య మా వనస్థలి లో  కొన్ని వ్యాయామ పరికరాలు కొత్తగా పెట్టారట ..

 వాళ్ళందరూ వాటిని చేస్తున్నారు అని నాకు అర్థం అయింది .

కొంచెం దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్ళాను ...

అక్కడ వాళ్లు కింద కూర్చుని ఒక పెద్ద చక్రం లాంటిది దాన్ని చేత్తో తిప్పుతున్నారు....చూడడానికి మన ఇంట్లో రొలు లా ఉంది

 ఇంకొంచెం ముందుకు వెళితే కొంతమంది పెద్ద కర్ర లాంటి దాన్ని చేత్తో తిప్పుతున్నారు

చూడడానికి మన మజ్జిగ కవ్వ లా ఉంది...

అన్నీ నాకు తెలిసిన వస్తువు లేకదాన్ని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను

 ఇంటికి వచ్చి అత్యుత్సాహంతో  మిక్సీ మీద ఒక కవర్ కప్పి ...తులసి కోట దగ్గర ఉన్న రోలు ని వంటింట్లోకి తీసుకువచ్చి శుభ్రంగా కడిగాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు   రోటిలో నూరాను.....

హ్యాండ్ బ్లెండర్  అట్టపెట్టెలో పెట్టేసి మజ్జిగ కవ్వంతో వెన్న తీశాను....

అందరినీ చూసి ఏదో ఉత్సాహంతో చేసాను కానీ కొద్దిసేపటికే భుజంనొప్పి మొదలైంది....😢😢😢😢

 పైకి చెప్తే ఏమంటారో అని భయంతో కుక్కిన పేనులా భుజానికి ముందు రాసుకున్నాను

మాట్లాడకుండా మిక్సీ మీద కవర్ తీసేసి కవ్వం అటక మీద పెట్టేసాను

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది నా పరిస్థితి..


                    లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****

22, జనవరి 2021, శుక్రవారం

వంకాయ తో వెంకాయమ్మ గారి ముచ్చట్లు

వంకాయ : వెంకాయమ్మ గారు ఎలా ఉన్నారు 

వెంకాయమ్మ గారు :ఆ వంకాయ రా రా  ... నేను బాగున్నాను . నువ్వు ఎలా ఉన్నావు .

వంకాయ :ఏదో ఇలా ఉన్నాను అండి ..

వెంకాయమ్మ గారు : అది ఏమిటి అలా అంటావు ... ఎన్ని తరాలు మారిన .. ఎన్ని  కొత్త రకాలు వచ్చిన నీకు ఆదరణ ఏమాత్రం తగ్గ లేదు కదా ....

వంకాయ : ఏమి ఆధరణ లేండి ... మీ రోజులలో ఐతే చక్కగా 

చిన్న వంకాయల తో : వంకాయ కారం పెట్టి కూర, వంకాయ కొత్తి మీరి కారం కూర, వంకాయ వేపుడు ,వంకాయ బజ్జి (అమలాపురం లో చాల ఫేమస్ )

తెల్ల వంకాయల తో : వంకాయ జీడి పప్పు  ముద్ద  కూర,వంకాయ  చిక్కుడుకాయ ముద్ద  కూర,వంకాయ  పనస గింజలు ముద్ద  కూర,వంకాయ  శనగలు ముద్ద  కూర ...

పెద్ద వంకాయ తో : వంకాయ  ముద్ద పచ్చడి ,వంకాయ  పెరుగు పచ్చడి 

ఇలా ఎన్నో రకాలు  వండేవారు .... 

 కానీ ఇప్పటివాళ్లు ఇంత ఉల్లి ముద్దో, మషాలా ముద్దో నా పొట్ట లో కూరి ... 

ఏమిటో రక రకాలు వండుతున్నారు ... పోనీ పిల్లలు కదా అని అనుకుందామా అంటే .. 

కంచంలో కూర అంతా తినేసి ..ఈ వంకాయ లో ఏమి ఉంది బలం ..అని వెలిపోతున్నారు.

ఆ ఆఖరి మాట వింటుంటే గుండెలో చివుక్కు మంటోంది .. 

వెంకాయమ్మ గారు :పోనిలే చిన్న పిల్లలు  వాళ్లే తెలుసు కుంటారు

 మషాలా వద్దు ...ముద్ద కూర ముద్దు అని 

నువ్వు ఏమి బాధపడకు 

వంకాయ : మీ మాట చలవ ...అలా జరిగితే ఎంత బాగుంటుందో .. 

నేను వెళ్లి వస్తాను .. పక్క వీధిలో శర్మ గారు వాళ్ల అమ్మాయి పెళ్లికి వచ్చాను 

అని వంకాయ వెళ్ళిపోఇంది .!!!!!!!!!!!!!!!!!!!!!


ఈ లోపు విధి లొంచి వెంకయ్య గారు ... 

చేతిలో  ఒక  సంచీలో  వంకాయ  లు తెస్తూ  ... 

వెంకాయమ్మ ఏమి వండావు ఇవాళ అని అడిగారు !!

వంకాయ కూర అన్నారు వెంకాయమ్మ గారు.

అలా వెంకయ్య గారు,వెంకాయమ్మ గారు ....

వంకాయ కూర తో భోజనం ముగించారు ....



                         లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****

21, జనవరి 2021, గురువారం

ఎక్కాల పుస్తకం

 

మీకు ఈ  రోజు ఒక కథ చెపుతాను 

కథ అంటే పెద్దబాలశిక్ష  అంత పెద్దది కాదు 

ఎక్కాల పుస్తకం  అంత  చిన్నదే !!!!!

'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు. 

ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం.

 ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది. 

చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. 😢😢😢

చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది. 

అమ్మ  బాలశిక్ష నేర్పించి, నాన్న బళ్ళో చెరిపించారు . 

 మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ. 

తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది. 

అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?

అమ్మ వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి. 

మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది.

 ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు. 

తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను. 

దిగితేనే కదా లోతు తెలిసేది!!!!

ఒక రెండు రెండు...
రెండ్రెళ్ళు నాలుగు..
 మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు. 

ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు.

 ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యమన్నారు'  ఎక్కడివరకు వచ్చిందో అడిగి, 

ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.

సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు. 

తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు. 

పన్నెండైదులు అరవై  వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది. 

నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.

అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు. 

ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది.. 

'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం. 

ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..

నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి  

ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల గాలి లో విదిలించేవారు....

 తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి. 

రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు. 

ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.

రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి. 

ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. 😢😢😢😢

పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. !!!!!!!!!!!

నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. 13❌13 = ?

పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి.. 

నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.

దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది. 

సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది. 

చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే దానిని . పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, 14❌13 = ? 

పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను.  16❌13 = ?

గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.

కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక.

 అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు.

అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది.

 మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. 

తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?


                                                లోక సమస్త సుఖినో భవంతు

                                                  **** మీ ఉషగిరిధర్ ****


20, జనవరి 2021, బుధవారం

కుంటి "స "....మెలిక "శ"

చిన్నపుడు  చేతి రాత బాగుంటే తల రాత బాగుంటుంది అనేది అమ్మ  ... 

అది నా బాలశిక్ష చదువు సాగుతున్న రోజులు. 

అమ్మ ప్రశ్న నోటితో అడుగుతుంది. జవాబు నేను పలక మీద రాయాలి. 

"శ్రీరాముడి భార్య పేరు ఏమిటి?" నేను 'శీత' అని రాశాను, హుషారుగా. 

"వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది?" తెలిసిన ప్రశ్నే కావడంతో నాలో హుషారు ద్విగుణీకృతం అయ్యింది. 'సీతాకాలం' అని రాసేశా. 

"ఏ చంటి .. మెలిక శ కీ, కుంటి స కీ తేడా తెలియకపోతే ఎలాగ నీకూ?" చెవి మెలేస్తూ అమ్మ అడిగిన ప్రశ్న ఇది. 

నేను రాసిన పది జవాబుల్లోనూ ఈ రెండే తప్పులు. 


అదిగో అప్పుడు విన్నాను ఈ మెలిక శ, కుంటి స గురించి.

 'మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. 

ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 

'కుంటేమిటీ?' అనుకున్నాను కానీ, పైకనలేదు. 

మొత్తానికి ఈరెండు అక్షరాలతో వచ్చే పదాలు మళ్ళీ మళ్ళీ రాయించీ రాయించీ ఏ అక్షరం ఎక్కడ వాడాలో బాగా అర్ధమయ్యేలా చెప్పింది అమ్మ. 

చాలామంది పిల్లలు హైస్కూలుకి వచ్చేసినా ఈ 'శ' 'స' లతో కుస్తీలు పడుతూనే ఉంటారన్న సంగతి నేను హైస్కూల్లో ప్రవేశిస్తేనే కానీ తెలియలేదు. 

అక్కడ మా మేష్టారు మెలిక, కుంటి అనకుండా 'సీత స' 'శకుంతల శ' అని చెప్పారు. 

ఇదేదో చాలా బాగుందనిపించింది నాకు. 

చక్కగా సీతనీ, శకుంతలనీ గుర్తు పెట్టుకుంటే చాలు. 

పైగా అవేమీ మరిచిపోగలిగే పేర్లు కాదు, రామాయణం, శాకుంతలం అప్పటికే చాలాసార్లు విని ఉండడం వల్ల. 

కాకపొతే ఒక కొత్త సమస్య వచ్చింది. 

కొందరు మేష్టర్లు మెలిక శ - అదే శకుంతల శ - ని 'ష' అని పలికేవాళ్ళు. 

ఉదాహరణకి, శాంతి ని షాంతి అని. 

కాలేజీలో కూడా ఈ శ, స లు వదలలేదు. ఓసారి అనుకోకుండా, ఒక  నోట్సు చూసి, ఈ శ, స లని సరిచేయడం కోసం "ఇక్కడ సీత స కాదు, శకుంతల శ ఉండాలి" అన్నాను.

సంభాషణ భాష గురించి కాక, కాలేజీలో సీత గురించీ, శకుంతల గురించీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా?

 వాళ్లు మా సీనియర్స్..

ఎదో వాళ్లకి సమయ స్ఫూర్తి తో నచ్చచెప్పి అక్కడ నుండి తపించుకున్నాను ......


ఇప్పుడు  కాగితం మీద రాసే పని ఉండడం లేదు. అందులోనూ తెలుగు రాసే పని అసలే లేదు. 


నా చేతిరాత ఎలా ఉందో ఏమిటో...😞😞😞

                                                   


                                             లోక సమస్త సుఖినో భవంతు

                                           **** మీ ఉషగిరిధర్ ****

19, జనవరి 2021, మంగళవారం

ఆదివారం దింపు ... భూషణం కొట్టి ఇచ్చిన బొండం

ఆ రోజు ఆదివారం ...నాన్న పోద్దిన్నే అమ్మ తో ఈరోజు దింపు ఉంది ..నలుగురు భోజనానికి ఉంటారు అని చెప్పి తోటలోకి వెళ్లారు . 

అది స్థంభం పక్కన ఉన్న నేను విని ... పరిగెత్తుకు వెల్లి మా అన్న తో . తమ్ముడు తో చెప్పాను . 

మా ముగ్గురికి దింపు  అంటే బలే సరదా .. గబగబా చద్దన్నం తినేసి తోట లోకి పరుగు అందుకున్నాము .

నేను భూషణం ఉన్న చెట్లు దగ్గరకి వెళ్ళాను (మా మామ్మ  భూషిగాడు అనే వారు .. పెద్ద వాలు కదా .. నేను చిన్న  పిల్లని  అలా అన కూడదు అని అమ్మ చెప్పింది) 

భూషణం  తన నడుము చుట్టూ పెట్టుకున్న పెద్ద బెల్టుకి తగిలించిన బంధం తీసుకుని జాగ్రత్తగా తన రెండు కాళ్ళకీ వేసుకున్నాడు. 

మరో పట్టీ తీసుకుని దానిని తన నడుము చుట్టూ తిప్పుకుని, కొబ్బరిచెట్టు చుట్టూ తిప్పి ముడేశాడు. బెల్ట్ కి కత్తి ఉంది. 

పట్టీ నెమ్మది నెమ్మదిగా పైకి జరుపుకుంటూ, బంధం వేసుకున్న కాళ్ళతో మెల్ల మెల్లగా చెట్టు పైపైకి ఎక్కుతున్నాడు.నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి, చెట్టు చివర ఆగాడు భూషణం.

 అబ్బా... మెడ నొప్పెడుతోంది. కానీ చూడకపోతే ఎలా, ఒకవేళ భూషణం గబుక్కున జారుతున్నాడనుకో గట్టిగా అరిచి జాగ్రత్త చెప్పొద్దూ. 

ఇంకో నలుగురు దింపు వాళ్ళు కూడా చెట్ల మీద ఉన్నారు కానీ, నేనెప్పుడూ భూషణం వెనకాలే తిరుగుతాను.

 కొబ్బరి తోటలో దింపు తీయిస్తున్నామంటే నాన్నలతో పాటు నేనూ ఉండాల్సిందే. 

దింపు వాళ్ళు తిరిగి నిచ్చెన మీదకి వచ్చే వరకూ ఆగి, అప్పుడు వెళ్ళాలి చెట్టు కిందకి. 

ఒక్కో చేత్తో ఒక్క కాయకన్నా ఎక్కువ పట్టుకోలేం.

 నాన్నయితే రెండేసీ, మూడేసీ పట్టుకుంటారనుకో.....

కానీ ఒక్కో కాయా ఎంత బరువుంటుందో.

 ఆ ముచిక చుట్టూ బిగించి పట్టుకోవడంలో అరిచేతులు ఎర్రగా అయిపోతాయి కూడాను.

 వాటిని తీసుకు వచ్చి మండువాలో వెయ్యాలి.

కాయలొకటేనా? అడ్డుగా ఉన్నఎండు కొబ్బరాకులు, డొలకలు ఇంకా దెయ్యపు తొట్లూ కూడా కత్తితో కొట్టేస్తారు కదా. 

అవన్నీ కూడా కింద పడతాయి. 

జాగ్రత్తగా కొబ్బరికాయలో రాశి, డొలకలొకటి, ఆకులొకటి, ఇలా వేరువేరుగా రాశులు పొయ్యాలి. 

మనం ఒక్కళ్ళమే కాదులే. 

దింపు తీస్తున్నారంటే ఇద్దరో ముగ్గురో అప్పటికప్పుడు వచ్చేసి, పని సాయం చేసేసి వెళ్తూ వెళ్తూ డొలకలో, ఒకటో రెండో కాయలో నాన్నని  అడిగి పట్టుకెడతారు. 

ఆకులు మనం మోయ్యలేం. డొలకలేమో కొంచం మట్టిగా ఉంటాయి. అందుకని కాయలైతే కొంచం బరువైనా పని సులువన్నమాట. 

భూషణానికి నేనంటే ముద్దు.

 అలా ఎండల్లో నేను కాయలు మొయ్యడం తనకి నచ్చేది కాదు. నేను ఎర్రగా అయిపోయిన చేతులు మధ్యమధ్యలో ఊదుకుంటుంటే చూసి, "మీరలా కూకోండి అమ్మాయిగారు .. శానామందున్నారు కదా" అనేవాడు ప్రేమగా. 

కానీ కాయలు మొయ్యకపోతే తోటలో ఉండడానికి ఉండదు, 

ఇంట్లోకి వెళ్లి చదువుకోవాలి. 

అప్పుడు భూషణం వాళ్ళూ చెప్పే కబుర్లు వినడానికి ఉండదు.

 ఇంట్లోకి వినిపించవు కదా మరి. 

ఇంకో కారణం కూడా ఉంది కానీ, అది తర్వాత చెబుతాను.

 భూషణం వాళ్ళూ రోజూ ఎక్కడో అక్కడికి దింపుకి వెళ్తారు. దింపు అయ్యాక పడ్డ కాయల్ని బట్టి వందకిన్ని అని కాయలో, డబ్బులో తీసుకుంటారు. 

దింపుకెళ్ళిన ఊళ్లలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో భూషణం చెబుతూంటే వినాలంతే.

 తను నాన్న కన్నా పెద్దవాడు కబుర్లు మొదలు పెట్టాడంటే మాత్రం నా అంత చిన్న పిల్ల అయిపోతాడు . 

ఏ ఊళ్ళో ఎవరికి ఎన్నెన్ని కాయలు పడ్డాయో, ఎవరి కొబ్బరికాయల రాశిలోకి ఎంత పెద్ద పామొచ్చిందో చెప్పేవాడు

 "ఈ భూషణం కబుర్ల పోగు. పని తెవల్చడు" అని  నాన్న తిట్టుకునే వాళ్ళు కానీ, పైకేమీ అనేవాళ్ళు కాదు. దింపు వాళ్ళందరికీ భూషణమే పెద్ద మరి. 

మామూలు చెట్లు ఎవరన్నా ఎక్కేవాళ్ళు కానీ, ముచ్చెట్లు మాత్రం భూషణానికే వదిలేసేవాళ్ళు. 

మామూలు కొబ్బరి చెట్టు కన్నా రెట్టింపు పొడుగుండే ముచ్చెట్లు కొబ్బరి చెట్లలో ముసలివన్నమాట. 

అలా ఎక్కుతూ ఎక్కుతూ నలకలా అయి, మాయమై పోయేవాడు భూషణం. ముచ్చెట్టు ఎక్కితే పైనుంచి తన గొంతు కూడా వినిపించేది కాదు. 

ముచ్చెట్లే కాదు, 'నా చెట్టు' కూడా భూషణమే ఎక్కేవాడు. !!

నా చెట్టు అంటే నేను పాతిన మొక్క పెరిగి పెద్దై, చెట్టయ్యిందని కాదు. 

ఆ చెట్టు బొండాలు చాలా బాగుంటాయి. మిగిలిన బొండాల కన్నా ఆ బొండాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం. 

ఈ రహస్యం తెలుసు భూషణానికి. ఇంకో రహస్యం కూడా ఉంది మా ఇద్దరికీ. తనా చెట్టు ఎక్కుతుంటే నేను "భూషణం, బొండము తియ్యవూ" అని అడగాలి. 

 నేనిలా అడగ్గానే "పిల్లలికి  నాలుగు బొండాలు తియ్యరా" అన్న నాన్న ఆర్డరూ, నాన్న తోటలో ఏమూల ఉన్నా వినిపించేవి. 

అప్పటికే కాయలు చేరేసీ, చేరేసీ అలిసిపోయే వాళ్ళం , 

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, తాగడానికి రెడీ అయిపోయే వాళ్ళం మేము ముగ్గురం  .

 తనే చెలిగి, కొట్టి ఇచ్చేవాడు భూషణం. 

నీళ్లన్నీ తాగాక, బొండాన్ని రెండు ముక్కలు చేసిచ్చేవాడు, మీగడ తినడానికి వీలుగా.

 "ఇంకోటి కొట్టమంటారా?" తనెంత మెల్లిగా అడిగినా,  నాన్నకో వినపడిపోయేది. 

"అక్కర్లేదు. వాళ్ళు ఇంక  అన్నం తినరు .. మిగిలినవి నూతిలో పడేయ్.. రేపు కొట్టిద్దాం" 

అనేసేవాళ్ళు. 

అక్కడితో దింపు వదిలేసి మేము ఇంట్లోకి పరిగెత్తే  వాళ్ళం , మా  పని అయిపోయినట్టే కదా మరి. 

 బొండం కొట్టిస్తూ భూషణం ఎప్పుడూ ఒకటే మాట అడిగేవాడు.... "పెద్దోరయ్యాక నన్ను గుర్తెట్టుకుంటారా ?" .....అని 

ఇప్పుడు భూషణం లేడు ...  కానీ ఊరు వెల్లినప్పుడు నాన్న  ఆ కొబ్బరి చెట్ట బొండాలు కొట్టిస్తారు.. వాటి రుచి మాత్రం ఏమి మారలేదు .






                                లోక సమస్త సుఖినో భవంతు

                                   **** మీ ఉషగిరిధర్ ****

16, జనవరి 2021, శనివారం

ముగిశాయి సంక్రాంతి సంబరాలు

 పసుపు పులిమిన గడపల పవిత్రత

సన్నాయి గీతాలు తెచ్చిన ప్రశాంతత

రంగవల్లుల తో వచ్చిన రమణీయత 

ధూప దీపాల వలన వచ్చిన సుందరత

తోరణాల తో వచ్చిన  స్వచ్ఛత తో  వెలిగిన మా లోగిలి


పట్టుచీరలు, కొత్తనగల పరిచయాలతో

వంటింట్లో యుద్ధ సరాగలతో

తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో

కలలు పండుతాయన్న ఆకాంక్షలతో

అందరి కష్టాలు తీరుతాయన్న ఆశలతో


అందుకు సాక్షిగా పండిన మానోళ్ళతో

మా ఇంట ముగిశాయి సంక్రాంతి  సంబరాలు 


                                        లోక సమస్త సుఖినో భవంతు

                                              ** మీ ఉషగిరిధర్ **

14, జనవరి 2021, గురువారం

సంక్రాంతి శుభాకాంక్షలు

మార్గశిరం ముగిసింది 

పుష్యమి  పురుడు పోసుకుంది

ధనుర్మాసం ధాన్యలక్ష్మిని ఇచ్చింది.

పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంది

సంక్రాంతి సూర్యుడు గమనం మార్చి గోరువెచ్చని కిరణాలతో

తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని అనుభూతిని అందిస్తున్నాడు!


అందుకే అన్నారు.

మకర సంక్రమణం

మధురానుభూతుల సమ్మేళనం అని !


అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు



                        సర్వేజనాః సుఖినోభవంతు

                            **** మీ ఉషగిరిధర్ ****

13, జనవరి 2021, బుధవారం

భోగి శుభాకాంక్షలు



అగ్ని దేవుని ప్రార్థన జేసి భోగి మంట రాజేసిన  పెద్దలకు  
రంగవల్లులు, గొబ్బెమ్మలు  పెట్టిన అక్కాచెలెళ్లుకు 
బోగి దండలతో , గాలి పటాలతో  సందడి చేసిన అన్నదమ్ములకు 


శ్రీమద్రమణ గోవిందో హరంటూ వచ్చిన  హరిదాసులుకు 
అయ్యవారికి దండం బెట్టంటు వచ్చిన  గంగిరెద్దులోళ్లూకు

కొత్త ధాన్యపు బస్తాల బండ్లతో ఇళ్ల్లకు చేర్చిన రైతులకు 

"వానల్లు కురియలి 
వరి చెను పండాలి 
మా దాసు దంచాలి 
మా అమ్మ వండాలి 
మా కడుపు నిండాలి ...బుడుగో బుడుగు "
అని పాటలు పాడిన పిల్లలకి  

అందరికి  భోగి  శుభాకాంక్షలు 






                                            లోక సమస్త సుఖినో భవంతు
                                            ***** మీ ఉషగిరిధర్ *****

12, జనవరి 2021, మంగళవారం

జగ్గన్న తోటకు పోదామా రుద్రులు వస్తున్నారు ...


కోనసీమ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి తోట ... 

అలాంటి కొబ్బరి తోటలో మన దేశ ప్రధాని మెచ్చిన ఒక తీర్థం  ...

అదే  అండి జగ్గన్నతోట ప్రభల తీర్థం.

సంక్రాంతి వస్తోంది కదా ఇంక మా కోనసీమ లో సందడి మాములుగా ఉండదు 

బోగి మంటలు  --- పిండి వంటలు 

ముగ్గులు --- గోబిల్లు 

వీటితో పాటు  జగ్గన్నతోట ప్రభల తీర్థం.కనుమనాడు ఈ ప్రభల తీర్థం జరుగుతుంది .

ఇక్కడ తోటే గుడి ..  ప్రభలే రుద్రులు .

ఏకాదశ రుద్రులు 11 ప్రభలు గా దర్శనం ఇస్తారు . 

1. గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

2. గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

3. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

4. ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

5. వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

6. పెదపూడి – మేనకేశ్వరస్వామి

7. ముక్కామల – రాఘవేశ్వర స్వామి

8. మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

9. నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

10. పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

11. పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి


కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాల ప్రజలు  ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు

ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు. 




యావత్ కోనసీమ వాసులందరికీ జగ్గన్నతోట ప్రభల తీర్థం ముందుగానే ఆహ్వానం పలుకుతోంది....

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........

                                 సర్వేజనాః సుఖినోభవంతు

                                **** మీ ఉషగిరిధర్ ****



 

 




ఏకాదశ రుద్రులు


ఏకాదశ రుద్రులు:
శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. 

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః"

అని రుద్రనమకంలో చెప్పబడినది. 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి. 

1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3.త్ర్యంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి 

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనంతెలుసుకుందాము.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 

3. త్ర్యంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను.  రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): 
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
 
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.


                                    లోక సమస్త సుఖినో భవంతు
                                        **** మీ ఉషగిరిధర్ ****

11, జనవరి 2021, సోమవారం

గృహంలో అలక

గృహంలో అలక
=============

ఏమిటి అలక గృహం  అనకుండా గృహంలో అలక అంటున్నాను అనుకుంటున్నారా..నిజమేనండి....
గత 10 నెలల నుంచి మా గృహంలో అన్ని అలక పూనాయి

లంచ్ బాక్స్ ====  అలిగి అటక ఎక్కింది
ఐరన్ బాక్స్ ====   అలిగి మూల కూర్చుంది
వాచ్              ====   అలిగి తిరగడమే మానేసింది⌚
షూస్             ==== అలిగి దుమ్ము దుప్పటి కప్పుకుని మూల కూర్చున్నాయి.
పెర్ఫ్యూమ్, ఫేస్ క్రీమ్స్   ==== అలిగి ఎక్కడికో వెలిపోయాయి

ఇలా కోన్ని వాడక అలిగితే...
 కోన్ని వాడకం ఎక్కువై అలిగాయి...

వాటిలో  వాషింగ్ మెషిన్ , సోఫా,టీవీ   ...
వంటిల్లు అయితే మరీ  అలిగింది బాగా ఎక్కువగా వాడుతున్నాను అని 

ఇన్ని అలకల మధ్య నాకు అలక వచ్చినా అలగ లేక పోతున్నాను....😟😟😟

ఈ అలకలు అన్ని ఎప్పటికి తీరే్నో...

ఇది చదివి మీరు అలగ కండి ప్లీజ్ ...😝😝😝



                                            లోక సమస్త సుఖినో భవంతు
                                        ******* మీ ఉషగిరిధర్ ***********


7, జనవరి 2021, గురువారం

పండగకి వలస వచ్చిన పిండివంటలు

పండగకి   వలస వచ్చిన పిండివంటలు 


మరలో బియ్యం పిండి పట్టించి

దుకాణం  లో నూనె  కట్టించి

నువ్వులు బాగా  దట్టించి

నాన్న  తో గుండ్రంగా చుట్టించి

అమ్మ ఎర్ర గా వేయించిన జంతికలు....

మినుగులు వేయించి

దుకాణం  లో బెల్లం  కట్టించి 

నెయ్యి బాగా  దట్టించి

అమ్మ గుండ్రంగా చేసిన సునుండలు...

బండెక్కి నాతో పాటు వలస వచ్చాయి.

నాలుగు రోజులు నా పంటికింద నలిగాయి....

నాలుగు నెలలు నా కంట్లో మెదిలాయి

పెద్ద డబ్బాలో తియ్యదనం , చిన్న సంచీలో కమ్మదనం

వలస వచ్చిన జ్ఞాపకాలు ఎంతో తీయ్యగా, కమ్మగా ఉన్నాయి..




(పండగ వస్తోంది మీ జ్ఞాపకాలు కూడా పంచుకోండి  కింద కామెంట్స్ లో )

                            లోక సమస్త సుఖినో భవంతు
                     ****** మీ ఉషగిరిధర్ ***********

6, జనవరి 2021, బుధవారం

ఎన్ని రోజులు అయిందో...

ఎన్ని రోజులు అయిందో..

పుట్టిన ఊరు వెళ్లి..🚍
ఆఫీసుకు వెళ్లి...💻
సినిమాకెళ్ళి..🎥
ఇంటికి పెళ్లి కార్డు వచ్చి..💒
పట్టు చీర కట్టి...
 నగలు పెట్టి...
బంతి భోజనం తిని..🍴
పానీపూరి తిని...
ట్రాఫిక్ సిగ్నల్ చూసి...🚦
అమ్మలతో కలిసి భుజాన బస్తా బాగులతో బడికెళ్తున్న 
పిల్లల్ని చూసి..🏫
కిటకిటలాడే బస్సుల్లో 
ఫుట్ బోర్డు పట్టుకు వేలాడే కుర్రకారును తిట్టి..🚌🚌
రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఆలకించి..📢
ఆకశాన రివ్వున ఎగిరెళ్లే విమానాన్ని చూసి అబ్బురపడి..✈
అంతెందుకు తనివితీరా తుమ్మి
బాధ తీరేలా దగ్గి..
*ఎన్ని రోజులు అయిందో......😞😞😞

కరోనా ఎంత పని చేసావే..
సంఘజీవిని ఒంటరిని చేసావు
గత పది నెలలుగా 
ఎక్కడ విన్నా 
నీ మాటే..
నీ కాటే..
పాజిటివ్..నెగిటివ్..
టెస్టులు..రెస్టులు..
క్వారెంటైన్లు..ఐసొలేషన్లు..
ఆంబులెన్సు మోతలు..
పోలీసు లాఠీల వాతలు..
అంటరానితనం అలవాటై..
జీవితమే గ్రహపాటై..
సాటి మనిషిని కలవడమే పొరపాటై..
ఇల్లే ఖైదై..బ్రతుకు చేదై..
ఎంత పని చేసావే.. కరోనా

సరేలే..
ఎన్నాళ్లులే నీ విలయం..
నీ ఆయువు మూడదా..
జగతిన మళ్లీ 
తొలి పొద్దు పొడవదా..


                                            లోక సమస్త సుఖినో భవంతు
                                    ********* మీ ఉషగిరిధర్ ***********

4, జనవరి 2021, సోమవారం

సులోచనాలు ....నేత్ర భూషనాలు





కొందరు  చూడడానికి వాడతారు
కొందరు చదవడానికి వాడతారు 
కొందరు అందానికి వాడతారు

కొందరు తల మీద పెట్టుకుంటే 
కొందరు ముక్కు మీద పెట్టుకుంటారు 
కొందరు ముక్కు చివర పెట్టుకుంటారు

కొందరు అవసరానికి కొంటే ..
కొందరు హాబీ కొంటారు---- మన ఆంధ్రుల అభిమాన అత్తగారు సూర్యకాంతం గారికి ఈ హాబీ ఉందిట.

 సులోచనాలు ఉంటే బాగా తెలివైన వాళ్ళని
 బాగా చదువుతారు అని కొందరి అభిప్రాయం.------ అందులో నేను ఒక దానిని

ఆ ఉద్దేశం తోనే  చిన్న తనంలో ఒకరోజు మా నాన్నగారిని సులోచనాలు కావాలి అని అడిగాను "రోగం  కొని తెచ్చుకోవడం ఏంటి దరిద్రం " అని అక్షతలు  వేయించుకోవడం తప్ప   సులోచనధారణ  భాగ్యం మాత్రం కలగలేదు..  
ఇప్పుడు  సాఫ్ట్వేర్ ఉద్యోగం పుణ్యమా అని సులోచనధారణ  భాగ్యం కలిగింది.....😎😎😎😎

రెండు రెళ్ళు నాలుగు అంటే మనకున్న రెండు కళ్ళకు రెండు అద్ధాలు జత పడితే నాలుగు కళ్ళు అన్నమాట...ఈ చతురాక్షులంటే నాకు చిన్నప్పటి నుంచి భలే సరదా... మరి మీకు....


 



లోక సమస్త సుఖినో భవంతు
********** మీ ఉషగిరిధర్ ***********

3, జనవరి 2021, ఆదివారం

అర్ధమా..... భావమా

 మనిషి నవ్వుతూ ఉన్నాడు అంటే కష్టాలు లేవు అని కాదు దాని అర్థం..

కష్టాలు తట్టుకునే శక్తి ఉంది అని దాని భావం


నీకు నచ్చినది దక్కలేదు అంటే నువ్వు దురదృష్టవంతుడవని కాదు దాని అర్థం..

దాని కంటే గోప్పది నీకు దక్కుతందని దాని భావం


పెద్దలు మందలిస్తె నువ్వు అంటే కోపం అని కాదు దాని అర్థం..

నిన్ను ఉన్నత  స్థితిలో చూడదలచారని దాని భావం


మౌనం గా ఉన్నారు అంటే ఎదిరించే శక్తి లేదు అని  కాదు అర్థం..

శాంతి ని కోరుతున్నారు అని భావం...

                                                        జై శ్రీరామ్

                                              ***మీ ఉషగిరిధర్***