Pages

జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

ఉత్తరానికో టపా

 


పూజ్యనీయులైన ఉత్తరం గారి పాదపద్మాలకు నమస్కారం...!!!

ఉభకుశలోపరి...!!!


చాల రోజుల తరవాత మీకు ఇలా ఉత్తరం రాయడానికి గల ముక్ష కారణం ...


నిన్న పుస్త కాలు సద్దు తుంటే నా స్నేహితురాలు రాసిన ఉత్తరాలు చదివాను ...

20 సంవత్సరాల క్రితం రాసిన ఉత్తరాలు ఇప్పుడు చదువుతుంటే ...

ఒక్క సారి కాలం వెనకకి వెల్లిపోయింది ..

ఎంత బాగుందో ... ఎన్నో జ్ణాపకాలు ,అనుభూతులు ....

రోజులు మల్లి రావు కానీ ....చదివినంత సేపు నేను రోజులకు వెళ్లి వచ్చాను ...


సెల్ టవర్ల దెబ్బకి పిచ్చుకలు మాయమైపోయినట్టు,

సెల్ ఫోన్ల దెబ్బకు తమరు ఎటు వెళ్లిపోయారో జాడ తెలియక అల్లాడుతున్నాం...


మీరున్నప్పుడే బాగుంది ఇక్కడ...

రాసేటప్పుడు చేతికి అబద్ధాలు వచ్చేవి కాదు...

ఇప్పుడన్నీ ఫోన్లో మాటలే కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు ఆడేస్తున్నాం...


'ఎక్కడున్నావ్' అంటే అమలాపురం లో ఉన్నా హైదరాబాద్ ఉన్నా' అని సిగ్గులేకుండా బొంకేస్తున్నాం...

ఈ నెట్ వర్క్లు మనుషుల్ని దగ్గర చేస్తాయంటే నమ్మి మిమ్మల్ని వదిలేసుకున్నాం...

కానీ ఇప్పుడు పక్కపక్కనే ఉన్నా మాట్లాడుకోకుండా, మెడలు వంచి ఫోన్లో తప్ప ముఖాముఖి మనసిప్పి మాట్లాడుకోవడం దాదాపు మానేసామ్...


దయచేసి మళ్ళోకసారి రండి ఉత్తరం గారు...!!!


మీరు లేకపోవడం వల్ల...


బామ్మ-తాతయ్యల ముసలి ప్రాణాలకు ఓదార్పునిచ్చే కుశల సమాచారం కరువైపోయింది...

భార్యాభర్తల వియోగం, విరహాల్లో ఉండే మాధుర్యం మాయమైపోయింది...

బిడ్డల క్షేమం అక్షరాల్లో చూసుకుని ఆప్యాయంగా చెమర్చే తల్లితండ్రుల కన్నీటి తడి ఆవిరైపోయింది...

ఉత్తరం కోసం వీధివాకిలి వైపు ఎదురుచూసి, రాగానే గబగబా చదివేసి, గుండెలు నింపుకుని, తిరిగి జాబు రాయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి అడుగంటిపోయింది...


"అమ్మా... అన్నయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందే అని చెంగున గెంతి చెప్పే చెల్లాయిలకి కరువొచ్చింది...


"ఏమేవ్... అల్లుడు ఉత్తరం రాసాడు...అమ్మాయి నెల తప్పిందట" అని మురిసిపోయే కన్నవాళ్లు కనిపించడం లేదు...


మాటలు పెదాలనుండి తప్ప గుండెల్లో నుండి రావడం ఆగిపోయాయి...


ఈ ఉత్తరం కూడా నేను టైప్ చెయ్యడం వల్ల యధావిధిగా మనసులో ఉన్నదంతా చెప్పలేక, ఇంకా ఏదో ఆవేదన మిగిలిపోయి బాధపడుతున్నాను...!!!


సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఉత్తరాల ఉనికిని కోరుకునే మీ అభిమానిని...!!!

13, ఫిబ్రవరి 2025, గురువారం

తిరిగి రాని రోజులు --- తిరుగు లేని రోజులు

  భలే మంచి రోజులులే


మా స్కూలంటే నాకిష్టం (ఎవరి స్కూలంటే ఎవరికిష్టముండదులెండి). నేను ఐదో తరగతికి వస్తూండగా మా ఈ స్కూల్లో చేరాను. పాత స్కూలు మానెయ్యడం వెనుక ఒక కథ ఉందండోయ్!


అవి నా నాలుగో తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు..నేను దించిన తల ఎత్తకుండా బర బరా రాస్తూ తెల్ల కాగితం రంగు మార్చడానికి ప్రయత్నిస్తున్నా.ఇంతలో నా వీపు మీద ఎవరో గోకినట్టయింది. వెనక్కి తిరిగి చూస్తే సుబ్బలక్ష్మి దీనాతి దీనమైన మొహమేసుకుని కాస్త కూడా రంగు మారని దాని తెల్ల కాగితాన్ని చూపించి దాని కరాబు చేయడంలో నా సహాయం కోరింది. నేను ఆలోచిస్తే ప్రతి పరీక్షకు వెళ్ళే ముందు నాన్నా గారు చెప్పే మాటలు గుర్తొచ్చాయి, "నీకు తెలిసింది నువ్వు రాయి, ఒకర్ని అడక్కు, ఒకరికి చూపకు, రెండూ తప్పే!". దానితో సహాయ నిరాకరణ ప్రకటించా. అది మా ఇన్విజిలేటర్ (మా ప్రైవేట్ టీచర్ కూడా)కు పిర్యాదు చేసింది. ఆవిడ వచ్చి 'ఒకే ప్రైవేట్లో చదువుతున్నారు, ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోకపోతే ఎలా' అని నన్నే మందలించింది. నా పేపర్ తీసుకుని సుబ్బులు చేతికిచ్చింది. అది విజయగర్వంతో నా పేపర్ ముందెట్టుకుని జిరాక్స్ కంపెనీ వాళ్ళు సిగ్గుపడేలా జిరాక్స్ దించడం మొదలుపెట్టింది. ఆ అవమానానికి నా చిన్ని హృదయం బద్దలైంది. ముక్కలు తాపీగా ఏరుకుందామని అప్పటికి అక్కడ్నుంచి నిష్క్రమించి ఆ ఆవేదనంతా మా నాన్న ముందు వెళ్ళగక్కా. ఆయన అంతకన్నా ఆవేశపడి నన్ను తక్షణం స్కూలు మానిపించారు.


సరే కొత్త స్కూళ్ళ వేటలో పడి ఒకరోజు నన్ను ఒక స్కూలుకు తీసుకువెళ్ళారు.( మా ఊరి లో ఉన్నవే నాలుగు స్కూల్)లు) తొలి చూపులోనే విపరీతంగా నచ్చేసింది ఆ స్కూలు. పేద్ద ఆటస్థలం, ఆటస్థలానికి ఎడంపక్క చాలా పెద్ద తోట, కుడి పక్కన వరసగా తరగతి గదులు, వెనక మామిడి చెట్టు, దానికి వేలాడుతున్న మామిడి కాయలు, ముందు వైపు ఒక స్టేజ్, దాని వెనక ప్రార్థనా మందిరం, దాని వెనక చింత చెట్టు. ఇప్పటికీ నాకు చాలా గుర్తు, ఆ రోజు కొత్త స్కూలు చూడడానికి వెళ్ళబోతున్నానని నాకు ఎంతో ఇష్టమైన తెల్ల గౌను, దాని మీద నల్ల కోటు వేసుకున్నా.


అలా మా స్కూల్లోకొచ్చి పడ్డా. ఆడుతూ పాడుతూ ఆరో తరగతికొచ్చా, అప్పట్లో మాకు ప్రతి శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ఉండేది అంటే స్కూలు పిల్లలంతా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళం, చింత చెట్టు కింద. ఒక చింత చెట్టు కింద అంతమంది ఎలా కూర్చునే వాళ్ళు, అదేమైనా పుష్పక విమానమా అని సందేహమొచ్చిందా? వచ్చే ఉంటుందిలెండి, మా చింత చెట్టు అంత పెద్దది కాదు కాని మా స్కూలు పిల్లల సంఖ్య చాలా తక్కువ.


ఆ శుక్రవారపు సమావేశాల్లో విద్యార్థులంతా ఒక్కో విధంగా తమ తమ ప్రతిభలను పైకి తీసి తక్కిన విద్యార్థుల మీదకు వదులుతూ ఉంటారు. ఒక్కోసారి బాలమురళి, ఎం.ఎస్.సుబ్బలక్ష్మి చెట్టు మీద చేరిన పిట్టల్ని బెదరగొడుతుంటే, ఇంకోసారి మైకేల్ జాక్సన్, ఎల్.విజయలక్ష్మి అక్కడ ప్రత్యక్షమౌతూ ఉంటారు. మేము సాధారణంగా చెవులకు దూదులు, కళ్ళకు గంతలు సందర్భానుసారంగా పెట్టుకుని వెళ్ళి క్లాస్ లో టీచర్ డిస్టర్బ్ చేయగా మధ్యలో ఆగిపోయిన మా చర్చలను కొనసాగించేవాళ్ళం.


ఒకనాటి సాయంకాలం అలాగే అందరం చెట్టు కింద కూర్చుని ఎప్పటిలా మామూలుగా గడ్డి పీక్కుంటూ, దేశకాలమాన పరిస్థితులను గూర్చి చర్చిస్తూ ఉన్నాం. అప్పుడు మాకు తెలియదు ఆ రోజు మేము చూడబోతున్నది ఒక మహత్తరమైన కార్యక్రమమని. 'న భూతో న భవిష్యతి ' అన్నది ఈ మధ్య అన్నిటికీ వాడేస్తున్నారు కానీ, సరిగ్గా ఆ కార్యక్రమానికి అతికినట్టు సరిపోతుంది.

ఇలాంటి సమావేశాల్లో మా విద్యార్థులంతా తమ తమ ప్రతిభలను విచ్చలవిడిగా ప్రదర్శించుకుంటారు అని చెప్పాను కదా, ఆ సాయంకాలపు వేళ మాకు చూపబోతున్న ప్రతిభ 'వ్యాపార ప్రకటనలు నటించి చూపుట '. అవాక్కయ్యారా? సినిమా వాళ్ళలాగే మా విధానం కూడా 'కాదేదీ ప్రదర్శనకనర్హం'.


ముందుగా అశ్విని హెయిర్ ఆయిల్ ప్రకటన..


'అశ్విని అశ్విని అశ్విని ...శిరోజాల సంరక్షిణి

దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతవర్షిణి అశ్విని '

ఆ ప్రకటన చిన్నప్పుడు వచ్చేది..మీలో చాలా మంది చూసే ఉంటారు..

'రాలే జుట్టును అరికట్టునులే..' అన్నప్పుడు ఒకావిడ పాదాల పొడవు జుట్టేసుకుని గిర్రని బొంగరంలా తిరుగుతుంది...


ఈ ప్రకటన పూర్తయ్యేసరికి మాలో చాలా మందికి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యింది. ఇంతకీ సంగతేంటంటే..ఈ ప్రకటనలో నటించిన నివేదితది బాబ్ కట్. అది కనపడకుండా తనకు విగ్గు పెట్టారు. గిర్రని తిరిగినపుడు ఆ విగ్ కాస్తా కింద పడింది. తన్మయత్వంలో అది గ్రహించకుండా తను 'అశ్విని..అశ్విని...' అని పాడుతూనే పోయింది.


ఆ నవ్వుల నుండి కోలుకోకముందే ఇంకో ప్రకటన మొదలయ్యింది


అది ఫెవికాల్ యాడ్, ఒక ఫెవికాల్ డబ్బా తీసుకొచ్చి స్టేజ్ మీద మాకెదురుగా పెట్టారు, మళ్ళీ ఈ ప్రకటన మరోటి, మరోటి అనుకోకుండా. ఒక దళసరిగా ఉన్న తాడును ఇటో కొసా అటో కొసా పట్టుకున్నారు కొంతమంది. ఆ తాడు తెగి లేదు కాని తెగినది ఫెవికాల్ తో అంటించారు అని చెప్పడానికన్నట్టుగా ఒక ప్రదేశం లో ఒక చిన్న ముడి వేసి ఫెవికాల్ అని రాసి ఉన్న కాగితం అంటించారు. అంతా బాగానే ఉంది కాని తాడును ఒక వైపు లాగుతున్నవాళ్ళలో 'అభినవభీమ ' గా పేరుపొందిన శివప్రసాద్ కూడా ఉన్నాడు. వాడు ఒక వైపు లాగుతున్నాడనేసరికి మాకందరికీ ఆందోళన మొదలయ్యింది. అందులోనూ ఇరువైపుల సమాన బలం ఉండేలా చేయాలని నిర్వాహకులు ఒకరిద్దర్ని తప్పించి స్కూలు మొత్తాన్ని మరోవైపు నిల్చోపెట్టారు.

వాళ్ళు నటించడం మొదలుపెట్టారు..


"గట్టిగా లాగు హైస్సా

బలంగా లాగు హైస్సా

జోరుగా లాగు హైస్సా'



ఒక అరనిముషం నటించేసరికి నటన అన్న సంగతి మర్చిపోయి జీవంచడం మొదలుపెట్టాడు ప్రసాద్ . మేమేమీ తక్కువ తినలేదన్నట్టు అటు వైపు వాళ్ళు కూడా వాళ్ళ బలం కొద్దీ లాగారు. ఊహించినదే జరిగింది. తాడు సరిగ్గా కాగితం పెట్టిన చోటే తెగింది. అటు పడ్డ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇటు వైపు మొదట నిల్చున్నది మన బాల బకాసుర్ కదా వాడు మీద పడేసరికి వెనక నిల్చున్న నలుగురు కోమాలోకి వెళ్ళినంత పనయ్యింది.

దానితో ఆ మహత్తర కార్యక్రమానికి తెర పడింది.


కథ కంచికి .....మేము ఇంటికి ......
ఇక్కడితో సమాప్తం .......

17, డిసెంబర్ 2024, మంగళవారం

గడచిన కాలం..గోడకు సున్నం


కాలం…చానా చిత్రమైనది.....
నన్ను సరిగ్గా ఉపయోగించుకోవడం నీ వల్ల కాదోయి అని ఎప్పుడూ మనకు సవాలు విసురుతుంది.
ఈ సవాలులో చాలా మందిది ఎప్పుడూ ఓటమే......
జీవితంలో ఏ సమయం ఎలా గడపాలో అలా గడపము…
అదే సమయం గడచిపోయిన తరవాత దాని గురించి భాధపడతాము.

చిన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకోవాలని చాలా ఆశగా ఉండేది.
నా స్నేహితుడి మామయ్య ఎక్కడ నుండో వానికి కారు బొమ్మలు తెచ్చాడు.
ఆ కార్లు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగితే..జుయ్య్య్ మని ముందరికి దూసుకెళ్ళేది.
ఆ కార్లను వాడు తప్ప ఎవ్వరినీ తాకనిచ్చే వాడు కాదు. అది చూసినప్పట్టి నుండి నాకు ఆ కార్లు కావాలని విపరీతమైన ఆశ, కానీ తల్లి తండ్రులతో కొనివ్వమని అడగాలని తెలియదు.కానీ లోపల వాటితో ఆడుకోవాలన్న ఆశ మాత్రం ఉండేది.  ఎవరైనా కారు బొమ్మలతో ఆడుకొంటూంటే చాలా అసూయగా ఉండేది. నా వయసు పెరిగే కొద్దీ ఆ కోరిక నాలోనే సమాధి అయిపోయింది.

ఈ మధ్యే మా పాపకి బొమ్మలు తేవడానికి ఒక షాపింగ్ మాల్ వెళ్ళాను.ఎన్ని రకాల బొమ్మలో…అన్నీ ఆటోమేటెడే …. ఆడేటివి ..పాడేటివి..పరిగెత్తేవి..గెంతేవి..ఎగిరేవి…చిత్రమైన చేష్టలు చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత…ఎప్పుడో సమాధైపోయిన ఆ కారు కోరిక మళ్ళీ గుర్తొచ్చింది. 

ఏమి లాభం…ఇప్పటికే ఒక జీవితకాలం లేటైపోయింది. ఇప్పుడు అలాంటి కార్లు వెయ్యి కొనగల్ను..కానీ అదే ఆనందం పొందుతానన్న నమ్మకం నాకు లేదు. ఏ వయసులో కోరిక ఆ వయసులో తీరిపోతేనే అనందం. ఎవరికైనా ఇది చాలా చిన్న విషయంగా సిల్లీగా అనిపించవచ్చు…కానీ చాలా దుఃఖం వేసింది. కోరికున్నప్పుడు కార్లు లేవు….కార్లున్నప్పుడు కోరిక లేదు. 

అలాగే ఇంకా ఎవేవో కోరికలుండేటివి..వర్షంలో నీటి గుంటలలో దూకాలని..ఇసుకలో పొర్లాడాలని..తూనిగల్ని పట్టుకోవాని..మా ఇంట్లో ఉన్న నీటి తొట్టే లో మునకెలెయ్యాలని…. ఇప్పుడు నేను గుంటల్లో దూక గలనా? ఇసుకలో పొర్లగలనా? అలా చేస్తే..బ్యాక్టీర్యా చే ఇన్ఫెక్షన్ వస్తుంది …జబ్బు చేస్తుంది అన్నంతగా విఙ్ఞానం సంపాదించాను మరి, ఎలా చెయ్యగలను? ఒక వేళ చేస్తే..నన్నో మెంటల్ కేసుగా ముద్రెయ్యటం ఖాయం.

   ఏది ఏమైనా…కాలాన్ని సద్వినియోగపరచుకుని..సదా ఆనందంగా ఉండే వారు ధన్య జీవులు.




12, డిసెంబర్ 2024, గురువారం

మామిడి తాండ్ర - భీషణ ప్రతిజ్ఞ

 ఆ వేసవి మధ్యాహ్నం నేను, మా అన్నయ్య డాబా మెట్ల మీద కూర్చుని ఉన్నాం. మా ఎదురుంగా నోరూరించే నూజివీడు రసాలు నాలుగు. మా ఇద్దరి మొహాలు ఎర్రగా ఉన్నాయి. అవి పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న మా మనస్సులను ప్రతిబింబిస్తున్నాయి. దానికి కారణం క్రితం రోజు సాయంత్రం డాబా మీద మాకు జరిగిన అవమానమే..

ఓ పద్దెనిమిది గంటలు వెనక్కి వెళ్తే..


సెలవులకని మా పక్కింటి పండు గాడింటికి వాళ్ళ బాబాయి వాళ్ళు ఏల రావలె?

వచ్చితిరిపో ఉత్త చేతులతో రాక మామిడి తాండ్రను ఏల తేవలె?

తెచ్చితిరిపో వాడు డాబా పైకి వచ్చి మేము చూస్తుండగా, మాకు పెట్టకుండా ఏల తినవలె?

తినెనుపో మమ్మల్ని చూసి ఊరూరుట్ట అని ఏల అనవలె?


                 అహో ఇది భరించలేని అవమానం, అది తట్టుకోలేని మా చిన్ని హృదయాలు ఏ నిముషంలో ఐనా బద్దలయ్యే అగ్ని పర్వతాల్లా కుతకుతమంటున్నాయి..అప్పుడే ప్రతిజ్ఞ చేసుకున్నాము..ఎలా ఐనా మామిడి తాండ్రను తయారు చేసి, పండు గాడి తాండ్ర అయిపోయే దాకా ఆగి, అప్పుడు మా తాండ్రను తీసి వాడ్ని ఊరిస్తూ తినాలని..


              ఆ రోజు రాత్రి నూటముప్పయ్యోసారి నాన్నగారికి మరుసటిరోజు పొద్దున్న మామిడిపండ్లు తేవాలని గుర్తు చేసి పడుకున్నాం. ఆ రాత్రంతా తాండ్రను గురించిన కలలే!! మేము కష్టపడి చేసిన తాండ్రను పండు గాడు దొంగతనంగా తినేసినట్టు నాకు కల వస్తే, వాడి తాండ్రను మేము దొంగలించి తెచ్చినట్టు అన్నయ్యకు కల వచ్చింది. పొద్దున్న కోడి కూయక ముందే నిద్ర లేచి నాన్నగారిని లేపి అప్పటికి బజారు తెరవరని ఆయన చెబుతున్నా వినకుండా సంచీ చేతికిచ్చి ఆయన్ను పంపించి, నాన్నారు కోసం ఎదురు చూస్తూ వీధి గుమ్మానికి చెరో వైపు కూర్చున్నాం.


                              మనం ఎదురు చూస్తున్నప్పుడే కాలం పగబట్టిన దానిలా మరింత మెల్లిగా సాగుతుంది. అప్పటికీ అన్నయ్య లోపలికి వెళ్ళి మా గడియారంలో చిన్న ముల్లును రెండంకెలు ముందుకు జరిపాడు కూడా. అయిన ఫలితం లేకపోయింది. మా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నాన్న గారు రెండు సంచులతో వీధిలోకి అడుగుపెట్టారు.. మేము పరిగేట్టుకుని వెళ్ళి ఆయన్ను అక్కడే ఆపి, సంచీలు దించి, మాకు కావలసినవి అందులో ఉన్నాయని రూఢి చేసుకున్నాక ఇంటికి రానిచ్చాం. ఇంటికి రాగానే పండ్ల మీదకు పడబోయేసరికి అమ్మ ఆపి, భోజనం చేసాకే ఏదైనా అని, మా ఉత్సాహానికి బ్రేకులు వేసింది. పైకి తన్నుకొస్తున్న కోపంతో కూడిన కన్నీళ్ళను లోపలికి నెట్టి, పండ్లకేసి ఆశగా చూస్తూ, వంట ఎప్పుడౌతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వంట అయీ అవ్వడంతోనే కంచాలు తెచ్చేసుకుని అమ్మ ఏది పెడితే అది గబగబా తినేసి ఒలంపిక్స్ లో గెలుచుకున్న బంగారు పతకం పట్టుకున్నంత అపురూపంగా మామిడి పండ్లను పట్టుకుని మెట్ల మీదకు చేరాము..


                             అవే ఇప్పుడు మా కళ్ళ ముందున్నాయి. ఆ రసాలను చూస్తూనే అమాంతంగా నోట్లో వేసుకుని గుటుక్కుమనిపించాలని బలంగా అనిపిస్తున్నా మా ప్రతిజ్ఞను ఒకరికి ఒకరం గుర్తు చేసుకుంటూ బలవంతం మీద నిగ్రహించుకున్నాం. మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కావలసినవి ఏంటి? అవి దొరికాక తాండ్రను ఎలా చేయాలి..అవి మా ముందున్న ప్రశ్నలు..కాని మా అన్నయ్య ఉన్నాడే!! తనకు తెలియంది లేదు (అని అనుకునేదాన్ని అప్పట్లో). ఏది చెప్పినా అది నిజం, అదే నిజం, అది మాత్రమే నిజం అనుకునేలా చెప్తాడు. అప్పట్లో వచ్చే బూస్ట్ ఏడ్ చూపించి సునీల్ గవాస్కర్ కొడుకు సచిన్ టెండుల్కర్ అని చెప్పాడు. అదే నిజమని చాలా కాలం నమ్మాను కూడా. అది పక్కన పెడితే కర్తవ్యం తెలియక కంగారు పడుతున్న నా భుజం మీద చెయ్యి వేసి, 'పిచ్చిదానా ఎంటీవోడంతటి అన్నయ్య నీకుండగా నీకేల బెంగ ' అన్నట్లు ఒక నవ్వు నవ్వి, 'నాకు తాండ్ర ఎలా చేయాలో తెల్సు. ఏముంది ముందు మామిడి పండ్ల రసం తీసి, దాన్లో ఒక కేజీ ఓ పది కేజీలో పంచదార పోసి మిక్సీలో పావుగంట తిప్పి కంచంలో ఆరబోసి ఎండలో నాలుగు రోజులు పెడితే నోట్లో వెన్నలా కరిగిపోయే తాండ్ర రెడీ' అని నాకు ధైర్యం చెప్పాడు.


                      మరుసటి రోజు అమ్మానాన్న బైటకి వెళ్ళేదాక గోతి కాడ నక్కల్లా ఎదురుచూసి, వాళ్ళు వెళ్ళడమేమిటి మా ప్రయోగం మొదలుపెట్టాం. మిక్సీ చేసాక పళ్ళెంలో ఆ రసాన్ని పోసి, దాని వైపు ఆశగా చూస్తూ 'మామిడి వంటి పండుయు..' అని అశువుగా కవిత్వం చెప్పబోతూంటే 'తాండ్ర వంటి స్వీటుయు..' అని అన్నయ్య అందుకున్నాడు. ఆ పళ్ళాన్ని మేడ మీద ఎండబెట్టి దాన్నే చూస్తూ కూర్చున్నాం. మాలో ఏ ఒక్కరు మంచి నీళ్ళ కోసమో, మరో దాని కోసమో కిందకు దిగినా తక్కిన వాళ్ళు వెంట వెళ్ళాల్సిందే, ఈలోగా ఇంకొకరు ఎక్కడ దాన్ని గుటకాయం స్వాహః చేస్తారేమో అన్న భయంతో. రాత్రుళ్ళు మాకు మాత్రమే తెలిసిన రహస్య ప్రదేశాల్లో దాస్తూ, పొద్దున్న రెప్ప వేయకుండా కాపలాలు కాస్తూ నాలుగు రోజులు గడిపాం. నాలుగో రోజు 'ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి..' అని పాడుకుంటూ మా స్వహస్తాలతో చేసుకున్న ఆ అమృతాన్ని మా మధ్యలో ఉంచుకుని ఒకొక్క ముక్క నోట్లో వేసుకున్నాం. వెంటనే ఒకరి మొహంలోకి ఒకరం చూసుకున్నాం, మా మొహాల్లో రంగులు మారాయి. కాజాలో మాగాయి ముక్క పెట్టుకుని దాన్ని సాస్ లో ముంచుకుని తింటే ఎలా ఉంటుందో దాని కన్నా అధ్వానంగా ఉంది మా వంటకం. ఎంతైనా మేము చేసుకున్నది కదా, పారెయ్యడానికి చేతులు రాక మరో రెండు ముక్కలు నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాం. ఊహు! వల్ల కాలేదు. గుడ్ల నీరు కక్కుకుంటూ మా అమృతాన్ని, మా పంచదార గుళికను, మా వజ్రాల తునకను కాలువలో జారవిడిచాం. ఆ తర్వాత కరువు తీరా ఏడ్చి, అమ్మ రాకముందే మొహాలు కడుకున్ని కూర్చున్నాం. ఆ రాత్రి ఒకటే వాంతులు. 'ఏం తిన్నార్రా' అని అమ్మ అడిగితే నోరు మెదిపితేనా. ఎలా చెప్తాం! తేలు కుట్టిన దొంగలం కదా!!




30, మే 2022, సోమవారం

శుభలేకొచ్చింది...

 

"అయ్యగారు సుభరేకంపారండి..." 

డొక్కు సైకిల్ని డొంకవార జారేసి, చెప్పులు అక్కడే విప్పేసి, లోపలికొచ్చి శుభలేఖ నా చేతికిచ్చిన అతన్ని ఆగమని చేత్తోనే సైగచేసి లోపలికి పరిగెత్తా. 

డబ్బాలో ఉన్న చిల్లర డబ్బుల్లోనుంచి ఓ నాణెం పట్టుకొచ్చి అతని చేతిలో వేశాను, ఎటూ అమ్మకి చెప్పినా డబ్బులిమ్మనే చెబుతుంది కదా అని.."సిత్తం" అనేసి వెళ్ళిపోయాడు.

ఘుమఘుమ లాడిపోతున్న శుభలేఖ చదువుదామని తీసేలోగా అమ్మ వచ్చేసింది,

"ఎవరిదీ శుభలేఖా?" అంటూ. వివరం చెప్పాను.
"డబ్బులిచ్చి పంపావా?" అని అడిగి, 

"నేనూ వెళ్తానమ్మా" అని ప్రయాణం అయిపోయాను. 

"ఊ..ఊ... మొదలైంది చీమకి పెళ్లి ప్రయాణం,
" అంటూనే "పైకి చదవరా శుభలేఖ నేనూ వింటాను.." అని అడిగింది,
కళాపి జల్లుతూ......


"యెంత మంచి వాసన వస్తోందో అమ్మా శుభలేఖ.. నాలుగు పక్కలా పసుపు బొట్టుతో పాటు, ప్రత్యేకం సెంటు కూడా రాశారు" అని నేను ఆశ్చర్యాలు పోతున్నానో లేదో...

"నీ మొహం... ఆ పసుపులోనే కాస్త సెంటు కూడా కలిపి ఉంటారు.. ప్రత్యేకం రాయడం ఎందుకూ?" అని అడిగింది. 

అమ్మ చెప్పింది విన్నాక, శుభలేఖని పరీక్షిస్తే నిజమే అని తేలింది..
పోన్లే.. ఓ కొత్త విషయం తెలిసింది..

రేప్పొద్దున్న నా పెళ్ళప్పుడు పనికొస్తుంది కదా అనుకున్నాను మనసులో.. ఆ మాటే పైకంటే క్షణం ఆలస్యం లేకుండా జరిగిపోతుంది పెళ్లి, ఏ చీపురు కట్టతోనో.

"అయిందా వాసన చూడ్డం? అక్షరాలు కూడబలుక్కుంటున్నావా?? ఎంతసేపూ చదవడం..." అంది అమ్మ కొంచం ధాటీగా.


పెళ్లి ఆలోచనల్లోనుంచి బయట పడి
"కూడబలుక్కోడం ఎందుకమ్మా? నాకు చదవడం వచ్చు కదా.."

అంటూనే శుభలేఖ చదవడం మొదలు పెట్టాను...
శ్రీరస్తు... శుభమస్తు.. అవిఘ్నమస్తు.. శ్లో.. ఇంతలో ఓ ఆలోచన వచ్చింది.. 

ఈ శ్లోకానికి అర్ధం చెప్పేసి అమ్మని మెప్పిస్తే?? చూడ్డానికి సులువుగానే ఉంది... అర్ధమవుతోంది కూడాను...ఇదేదో బాగానే ఉందనుకుంటూ శ్లోకం పైకి చదవడం మొదలుపెట్టాను.. 

"శ్రీరామ పత్నీ... జనకస్య పుత్రీ... అంటే... శ్రీరాముని యొక్క భార్య .. జనకుని యొక్క కుమార్తె... రైటే కదా అమ్మా?" ..."రైటే..రైటే ... మీ బళ్ళో చేప్పేరేవిట్రా?" ...

"లేదమ్మా.. నాకే అలా తోచింది... తర్వాత చదువుతా ఉండు.."

"సీతాంగనా... సుందర కోమలాంగీ.... అంటే అందమైన సీత అనే కదా అర్ధం?" ..."అవును...

 పెళ్లి ఎప్పుడో చెబితే, మీ నాన్నగారికి గుర్తు చేద్దాం అని నిన్ను శుభలేఖ చదవమన్నాను.. 

 కాస్త ఆ ముహూర్తం ఒక్కటీ ముందు చెప్పెయ్ ..." ..."ఉండమ్మా... వరసగా చదువుతున్నాను కదా...

 " ఈ అర్ధం చెప్పడం నాకు భలే సరదాగా ఉంది నిజానికి... 

 వేసంకాలం సెలవుల్లో 'గణపతి' పుస్తకం చదివానేమో ..

 స్కూలు మేష్టారు ఉద్యోగం చేసే రోజుల్లో కథా నాయకుడు గణపతి

 "శ్రీ రఘురామ.. చారు తులసీ దళధామ" పద్యానికి తాత్పర్యం చెబుతూ "వనవాసంలో శ్రీరాముడు చారు కాచుకొనెను.. 

 కర్వేపాకు దొరక్క పోవడంతో ఆయొక్క చారుని తులసీ దళాలతో కాచుకొనెను" అని చెప్పడం గుర్తొచ్చింది..


మళ్ళీ శుభలేఖలోకి వస్తూ "భూగర్భ జాతా... భువనైక మాతా.... అమ్మా.. భూగర్భ జాత అంటే సీతే కదా... భూమిలో దొరికింది కదా నాగలి దున్నుతూ ఉంటే?"

 అని నా పురాణ జ్ఞానం ప్రదర్శించేసరికి, అమ్మ బోల్డంత మురిసిపోయి, కళాపి చల్లిన వాకిట్లో  ముగ్గేయడం మొదలు పెట్టింది.. 

 "భువనైకజాత జాత అంటే ఏమిటో తెలియడం లేదు కానీ, సీతే అయి ఉంటుంది కదా అమ్మా..." అమ్మకి సహనం కొంచం తగ్గినట్టుంది.. 

 "అవతల బోల్డంత పని ఉంది.. తర్వాత ఏమిటో తొరగా చదువు న..." అంది, మరీ విసుక్కోకుండా, అలాగని మరీ ముద్దుచేసేయకుండా.. తర్వాత లైను తెలిసినట్టే ఉంది కానీ తెలియడం లేదు..


"వధూ వరాభ్యం వరదా భవంతు... అమ్మా... వధూ వరాభ్యం అంటే వధూ వరులు కదా..." నా ఉత్సాహం తగ్గడం అమ్మ కనిపెట్టేసింది... "

 అవును.. తర్వాత మాటకి కూడా అర్ధం చెప్పేసి, మిగిలిన శుభలేఖ చదువు..." ....ఏవిటి చదవడం?? "వరదా భవంతు అంటే... 

అమ్మా.. మరీ..." ఏమన్నా మాట సాయం అందుతుందేమో అని చూశా.. అబ్బే.. నాకు అమ్మ కదూ..

 "ఊ మరి? చెప్పూ" ... "అంటే.. వధూవరులిద్దరూ వరదల్లో కొట్టుకుపోకుండా ఉందురుగాక అని అయి ఉంటుంది" అన్నాను కొంచం అనుమానంగా... 

 అమ్మ అక్కడ నిలబడలేక, కొబ్బరి చెట్టుకి ఆనుకుని ఒకటే నవ్వడం... 

 "ఇంకా నయం.. వరదల్లో కొట్టుకుపోదురు గాక.. అన్నావు కాదు" అంటూ...

పెళ్లి శుభలేఖలో ఈ పద్యం చూసినప్పుడల్లా గుర్తొచ్చే జ్ఞాపకం ఇది..

1, నవంబర్ 2021, సోమవారం

తిప్పుడు పొట్లం

అప్పుడు నాకు తొమ్మిది/పదేళ్ళు.
ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా దీపావళి హడావిడి మొదలయ్యింది.
అప్పటి పరిస్థితి ఏమిటంటే మతాబులు, కాకర పువ్వొత్తులు కాల్చడం మరీ చిన్నతనం, టపాకాయలు కాల్చడం మరీ పెద్దతనం.
ఏం చెయ్యాలి మరి? అసలే దీపావళి అంటే నెల్లాళ్ళ ముందు నుంచే మతాబా గొట్టాలు చేసే పని మొదలైపోతుంది ఇంట్లో. మరో పక్క టపాకాయల హడావిడి.
మతాబా మందూ, సూరే కారం, మన్నూ మశానం.. మొత్తం కలిపి చిత్ర విచిత్రమైన వాసనలు.


నేనంత ఉత్సాహంగా ఉండకపోడం తాతయ్య దృష్టిలో పడింది.
ఒళ్లో కూర్చో పెట్టుకుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పి నా బాధేమిటో కూపీ లాగారు.
"ఓస్.. ఇంతేనా.. నీకీ సంవత్సరం తిప్పుడు పొట్లం చేయిస్తాను కదా.." నాకేమో మిఠాయి పొట్లం తెలుసు కానీ తిప్పుడు పొట్లం ఏమిటో తెలీదు.
కనీసం ఆ పేరు కూడా వినలేదు. మా ఊళ్ళో నా ఈడు పిల్లలెవరూ అప్పటి వరకూ ఎవరూ తిప్పుడు పొట్లం కాల్చలేదని తెలిసి బోల్డంత గర్వ పడ్డాను.
ఇక అది మొదలు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అని ఎదురు చూడడమే..


తాతయ్య చిన్నప్పుడు ఇంట్లో పిల్లలంతా తిప్పుడు పొట్లం తిప్పుకునే వాళ్లుట..
కావాల్సిన సరంజామా అంతా వాళ్ళే సమకూర్చుకునే వాళ్లుట..
"ఏమేం కావాలో చెబుతాను.. తెచ్చుకుని ఒక చోట పెట్టుకో" అని తాతయ్య చెప్పడం ఆలస్యం, మరుక్షణం నేను వేట మొదలు పెట్టాను.
తాతయ్య అభయ హస్తం ఉంది కాబట్టి నాన్న భయం లేదు.
ముందుగా డొక్క పొట్టు తెచ్చి ఎండబెట్టాలి.
కొబ్బరి పీచుతో డొక్క తాళ్ళు పేనే లక్ష్మమ్మ గారి ఇంటి చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేసి తడి తడిగా ఉన్న డొక్క పొట్టు సంపాదించా.


నెక్స్ట్ ఐటెం చితుకులు.
 అర్ధమయ్యేలా చెప్పాలంటే తాటికాయల గుత్తి లో కాయలు రాలిపోయాక మిగిలి ఉండే ఖాళీ గుత్తులన్న మాట.
తాటి తోపు చుట్టూ తిరిగి ఎన్ని సంపాదించానంటే.. అవి చూసి అమ్మ బోల్డంత సంతోష పడింది.. తిప్పుడు పోట్లానికి పోను మిగిలిన వాటితో ఒక నెల్లాళ్ళ పాటు వేడి నీళ్ళు కాచుకోవచ్చని. తగుమాత్రం చితుకులని ఎండ బెట్టి, కాల్చి బొగ్గులు చేసి, ఆ బొగ్గులని మరీ మెత్తగా కాకుండా పొడి కొట్టి పక్కన పెట్టేసరికి నా శరీర చాయ కృష్ణ వర్ణానికి మారింది.

తిప్పుడు పొట్లం చేయడానికి కావాల్సిన మరో ముఖ్యమైన వస్తువు ఉప్పు. 
అదెలాగో ఇంట్లో పెద్ద జాడీ నిండా సమృద్ధిగా ఉంటుంది.
 "ఇదిగో.. రేప్పొద్దున్న మీరు ఏడాదికి కొన్న ఉప్పు అప్పుడే అయిపోయిందా అంటారు.. తాతా మనవళ్ళు వేరే ఉప్పు కొనుక్కోండి.. ఇంట్లోది ఇవ్వను" అని బామ్మ పేచీ పెట్టింది. 
 అలాంటివి పట్టించుకుంటే తాతయ్య గొప్పదనం ఏముంది?  పాత నేత చీర కనీసం సగం ముక్కైనా కావాలి.. బామ్మని అడుగుదాం అనుకున్నాను కానీ.. "నా దగ్గర ఉందిరా.." అని అమ్మ ఇచ్చేసింది. ఒక తాటాకు కావాలిట.. తాతయ్య భూషణం చేత తెప్పించారు.


తెల్లారితే దీపావళి..
అయినా ఇల్లలకగానే పండుగ కాదు కదా..
తిప్పుడు పొట్లం అలకడానికి పేడ, మట్టి కావాలనేసరికి, కొమ్ముల గేదె దగ్గరికి కొంచం భయం భయంగా వెళ్లి పేడ తెచ్చేశా.
తిప్పుడు పొట్లం ఎలా ఉంటుందో, ఎలా కాల్చాలో నా ఊహకి అస్సలు అందడం లేదు..
 తాతయ్యని అడిగినా "చేసి ఇస్తాను కదా.." అంటున్నారు తప్ప ఇంకేమీ చెప్పడం లేదు.
 ఇంక నేను చేసేదేముంది? తాతయ్య తిప్పుడు పొట్లం ఎలా చేస్తారో చూడడం తప్ప.


ముందుగా చీర ముక్కని అడ్డంగా మడతలు వేసి నిలువుగా పరిచారా.. దానిమీద ఎండబెట్టిన డొక్క పొట్టు, చితుకుల పొడి, ఉప్పు అన్నీ కలిపి సమంగా పరిచారు, తాతయ్య నాన్న కలిసి. ఇప్పుడు చీర ముక్కని రిబ్బన్ చుట్టినట్టుగా చుట్టుకుంటూ వెళ్ళారు, డొక్క పొట్టూ అవీ ఒలికి పోకుండా.. మొత్తం చుట్టేశాక పురికొస తాడుతో గట్టిగా కట్టేశారు.
అప్పుడు తాతయ్య అమ్మని కేకేసి ఆ మూట చుట్టూ రెండు సార్లు అలకమన్నారు.. "నాకు తెలుసండీ మావయ్య గారూ.. మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం" అని వినయంగా చెప్పింది అమ్మ. మొత్తానికి ఒక పేడముద్ద లా తయారైన ఆ వస్తువు ని చూడగానే సగం ఆసక్తి పోయింది నాకు.


"అప్పుడే అయిపోలేదురా.. ఇంకా బోల్డంత పని ఉంది.. దీన్ని బాగా ఎండ బెట్టు.." చెప్పారు తాతయ్య. వీధిలో మంచం వేసి మతాబాలు, చిచ్చు బుడ్లు, జువ్వలు వాటన్నింటితో పాటూ పొట్లాన్ని కూడా ఎండ బెట్టాను. "బాగుంది తిప్పుడు పొట్లం.. మిగిలిన వాటికి దిష్టి తగలకుండా.." తాతయ్య వినకుండా బామ్మ వెక్కిరించింది. దీపావళి రోజు మధ్యాహ్నానికి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయింది ఆ తిప్పుడు పొట్లం. సాయంత్రం అవుతుండగా భూషణం వచ్చాడు. ఎండిన తాటాకులో కమ్మ మాత్రం ఉంచి, ఆకుని విడగొట్టేశాడు. ఆ కమ్మని ఒక ఉట్టిలా తయారు చేసి అందులో పొట్లాన్ని పెట్టి కదలకుండా కట్టేశాడు.


అది మొదలు నేను దివిటీలు కొట్టేస్తాననడం.. బామ్మేమో కాసేపు ఆగమనడం.. దివిటీలు కొట్టాక కూడా తిప్పుడు పొట్లం కాల్చడానికి తాతయ్య ఒప్పుకోలేదు.. "చీకటి పడ్డాక అయితే బాగుంటుంది" అనడంతో ఇష్టం లేకపోయినా మతాబాలూ అవీ కాల్చాను కాసేపు. చీకటి పడ్డాక తిప్పుడు పొట్లం లో పైన నిప్పు వేసి, ఓ రెండు తిప్పులు తిప్పి చూపించి పొట్లాన్ని నా చేతికి ఇచ్చారు తాతయ్య. తాటి కమ్మ పట్టుకుని వడిసెల తిప్పినట్టు గిరగిరా తిప్పితే పొట్లం లోపల నిప్పు రాజుకుని ఉప్పు కళ్ళు ఠాప్ ఠాప్ మని పేలడం.. బొగ్గు పొడి, కొబ్బరి పొట్టూ కలిసి మెరుపుల్లా బయటకి రావడం. ఎంత స్పీడుగా తిప్పితే అన్ని మెరుపులు.


మొదట్లో చాలా ఉత్సాహం గా ఉంది కానీ, రాను రానూ చెయ్యి నొప్పెట్టడం మొదలెట్టింది.. మెరుపులు బయటికి రావడం మినహా ఏ ప్రత్యేకతా లేదు తిప్పుడు పొట్లంలో.. ఎంత సేపు తిప్పినా ఎప్పటికీ అవ్వడం లేదన్న విసుగు.. అక్కడికీ 'కాసేపు మీరు కూడా తిప్పండి.. ఎంత బాగుందో' అని ఇంట్లో వాళ్ళని ఊరించా.. అబ్బే.. వింటేనా.. ఇలా కాదని "మిగిలింది రేపు మిగులు దీపావళి కి తిప్పుతా తాతయ్యా.." అన్నాను.. అలా కుదరదుట.. ఒకసారి వెలిగిస్తే పూర్తవ్వాల్సిందేట..


చేతులు మార్చుకుంటూ, స్పీడు బాగా తగ్గించి తిప్పుతుంటే చూసి కాసేపటికి తాతయ్య జాలి పడ్డారు.. "ఇంక చాల్లే.. పక్కన పడేయ్.." అనడంతో ప్రాణం లేచొచ్చింది. "ఇంతోటి సంబరానికి నా ఉప్పు జాడీ ఖాళీ చేసేశావా " అన్న బామ్మ మాటలు విన్నట్టు నటించా..

ఇంకా దీపావళి  కి నాలుగు రోజులు ఉంది కనుక కుదిరితే ట్రై చేయండి మీరు కూడా .... 

చేతులు నొప్పి పేడతాయి జాగ్రత్త సుమీ 



18, అక్టోబర్ 2021, సోమవారం

అమ్మకి కోపం వస్తే..

                     ఇంట్లో అందరికీ మనమీద కోపం రావడం ఒక ఎత్తైతే, అమ్మకి కోపం రావడం మరో ఎత్తు. ఇంకెవరి కోపాన్నీ పెద్దగా పట్టించుకోక పోయినా పర్లేదు కానీ, అమ్మతో అలా కుదరదు. బోయినం మాట అటుంచి, మంచి నీళ్ళు కూడా సరిగా ముట్టవు.  నాన్నకి కోపం వస్తే నాలుగు దెబ్బలు వేస్తారు. ఆ వెంటనే కోపం మర్చిపోతారు.  కానీ అమ్మ అలా కాదు, ఏమీ అనదు కానీ అస్సలు మాటాడదు. మనం వెనక వెనకే తిరిగినా సరే అస్సలు మన వంక చూడనన్నా చూడదు. 


            అసలు అమ్మకి కోపం ఎందుకు వస్తుంది? మనం ఏదో ఒక పిచ్చి పని చేస్తేనే కదా?? 'వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపంరా..' అన్నాడు కదా ఓ సినిమా కవి.  మనం తెలిసో తెలియకో చేసే పిచ్చి పనులు అమ్మకి మన మీద పిచ్చి కోపం రప్పిస్తాయన్న మాట.  నాలుగు కొట్టాలనిపించినా గబుక్కున చేతులు రావు కదా, అందుకని ఏవీ అనకుండా ఊరుకుంటుంది. 


            ఒకసారి నేను  అమ్మతో పేరంటానికి వెళ్లాను. ఆ పేరంటానికి రాజ్యంగారమ్మాయి కొత్త చీర కట్టుకుని వచ్చింది. అందరూ ఆ చీరని ఒకటే మెచ్చుకోవడం. ఇంతలో నేను చేసిన ఓ పొరపాటు వల్ల ఆ చీరమీద మరక పడింది.చిన్న మరకే అయిన కొత్త చీర కదా, పైగా ఆ అమ్మాయి మొదటిసారి చీర కట్టుకుంది కూడాను, పేరంటానికి వచ్చిన అందరూ 'అయ్యో పాపం' అనడవే. ఏం చెయ్యాలో తెలీక నేను ఇంటికెళ్ళిపోయాను. తర్వాత కాసేపటికి అమ్మొచ్చింది. ఏవీ మాటాడలేదు.. ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు రోజులు. 


         అది మొదలు అమ్మకి చాలా సార్లే కోపం వచ్చింది నా మీద. ఎక్కువగా అల్లరి చేసినప్పుడూ, ఆటల్లో దెబ్బలు తిని వచ్చినప్పుడూ, బళ్ళో మేష్టారు నామీద కోప్పడ్డప్పుడూ, బామ్మ గట్టిగా గసిరినప్పుడూ, పరీక్షల్లో మంచి మార్కులు రానప్పుడూ ఇలా.. ఒక్కోసారి అమ్మకి నామీద ఎందుకు కోపం వచ్చిందో కూడా తెలిసేది కాదు. కోపం వచ్చినదని మాత్రం తన ముఖం చూడగానే తెలిసిపోయేది.. కారణం తర్వాతెప్పుడో తెలిసేది. నేను అల్లరేక్కువ చేస్తున్నానో, ఇంకోటనో ఎవరన్నా అమ్మకి చెప్పినా అమ్మకి నామీదే కోపం వచ్చేసేది మరి. 


           నేను బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగా నవ్వుతూ ఎదుర్రాకుండా ముఖం గంటు పెట్టుకుని తన పన్లు తను చేసుకుంటోందంటే అమ్మకి  నామీద కోపం వచ్చేసినట్టే. ఇంక నేనెంత వెంటబడి మాటాడినా విననట్టు నటిస్తుంది. నాకేవీ పనులు చెప్పదు. నేను చెయ్యబోయినా చెయ్యనివ్వదు. మొదట్లో అమ్మకి కోపం వస్తే నాకు భయం, బాధా వచ్చేసేవి కానీ, రాన్రాను అమ్మ కోపం పోగెట్టే ఉపాయం తెలిసిపోయింది. ఏవీలేదు, అమ్మకి కోపం రాగానే అన్నం ఎప్పుడూ తినేంత కాకుండా కొంచమే తినడం. 


             మొత్తం మానేస్తే నాన్న తంతారు కానీ, ఆకల్లేదు అని కొంచం తిని ఊరుకుంటే ఏవీ అనలేరు కదా. ఈ ఉపాయం మాత్రం బ్రహ్మాండంగా పనిచేసింది. ఓ పూటో రోజో చూసి అమ్మ వెంటనే మాటాడేసేది.  తర్వాతేవో మంచి మాటలు చెప్పేది. నేను బుద్ధిగా వినేదానిని. మళ్ళీ కథ మామూలే. 

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ముసురేసింది ....

          "దేవుడా దేవుడా గాట్టి వర్షం కురిపించు.." పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే ఆకాశంలో  మబ్బులు కనిపిస్తే నేను దేవుణ్ణి కోరుకునే చిన్న కోరిక ఇది. 

             బాగా వర్షం వస్తే బడికి  వెళ్ళక్కర్లేదు కదా మరి. మా బళ్ళో ఉండే రెండు గదుల్లోనూ ఒకటి బంగాళా పెంకులది,  రెండోది తాటాకుతో కప్పింది. వానొచ్చిందంటే నీళ్లన్నీ మామీదే. అందుకని పెద్ద  వర్షమొస్తే బడికి సెలవన్న మాట. అసలు బళ్ళో కూర్చోడం మాటెలా ఉన్నా, మేష్టార్లు బడికి  రావాలన్నా వీలు పడదు.  బురద రోడ్ల మీద సైకిలు దొర్లించుకుంటూ రావడం చాలా కష్టం మరి.  



         బడికి సెలవిచ్చేస్తే ఎంచక్కా ఎంత బాగుంటుందో. మామూలుగా ఆదివారం నాడు  సెలవిస్తారనుకో. అయినా కానీ ఇలా మధ్య మధ్యలో సెలవులోస్తే భలేగా ఉంటుంది.  మనం  చద్దన్నం తినేసి బడికి బయలుదేరే లోపే ఎవరో ఒకరు "ఇవాళ బళ్ళేదు" అని చెప్పేస్తారు  కదా. 

       అప్పుడు పుస్తకాల సంచీని అమ్మకీ, నాన్నకీ కనిపించకుండా దాచేయాలి. ఎదురుకుండా  సంచీ కనిపిస్తుంటే "చదువుకో" అని ప్రాణాలు తోడెయ్యరూ, అందుకన్న మాట.  పాఠాలన్నీ  వచ్చేశాయ్ అన్నా వినిపించుకోకుండా, "మళ్ళీ చదువుకో" అనో "ఎక్కాలు నేర్చుకో" అనో  ఆర్డర్లేస్తారు. 


         బయట బాగా వర్షం పడుతోందనుకో, మూల గదిలోకి వెళ్లి కిటికీ దగ్గరకి తలొచ్చేలా  పెద్ద మంచం మీద పడుకోవాలి.  అప్పుడైతే వర్షం ఎలా కురుస్తోందో బాగా చూడొచ్చు.  

ఒక్కోసారి ఊరంతా చీకటిగా అయిపోయి, ఉరుములూ అవీ వస్తూ, లావు లావు ధారలుగా వర్షం  కురుస్తుంది చూడు, అలాంటప్పుడైతే భయమేస్తుంది కానీ, మామూలు వర్షమైతేనా ఎంతసేపైనా  అలా చూస్తూ ఉండిపోవచ్చు. మధ్య మధ్యలో వచ్చే మెరుపులు భలేగా ఉంటాయి. చూరు మీద నుంచి  నీళ్ళు ధారలు ధారలుగా పడ్డప్పుడు కింద నేలంతా చిల్లులు పడి చిన్న చిన్న చెరువుల్లా  అయిపోతుంది. అప్పుడు కనక వర్షం తగ్గిందంటే ఆ నీళ్ళలో పడవలు ఆడుకోవచ్చు. 


             చెరువంటే గుర్తొచ్చింది. మూల గదిలో కూర్చున్నామంటే తోట   లో  వర్షం కురవడం  చూడొచ్చు. అసలే తోట నిండా నీళ్ళా? ఆ నీళ్ళలో మళ్ళీ బోల్డు బోల్డు నీళ్లన్న మాట.  ఒక్కోసారి తోట పొంగిపోతుందేమో అని భయమేస్తుంది కానీ, అలా వర్షం కురవడం మాత్రం  ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. బాగా దూరంగా చూస్తే అక్కడ  వర్షం కూడా మంచులాగే కనిపిస్తుంది.

 

         వానొచ్చిందంటే తోట తిరిగే నీరుకట్లూ,  బురదపాములూ మండువాలోకి  వచ్చేస్తాయి. కర్రుంది కదా అని వాటిని చంపెయ్యకూడదు.తాచుపామైతేనే చంపాలి. కానీ హమ్మో.. తాచుపాముని చంపడం అంత సులువేంటి? నాన్నైతే ఒక్క  దెబ్బకి చంపేస్తారనుకో. కాకపొతే ఈ బుడత పాముల్ని చూసి 'పాము' 'పాము' అని అరిచి కాసేపు బామ్మని ఖంగారు  పెట్టొచ్చు. 


       ఎంత చద్దన్నం తిని ఊరికే కూర్చున్నా టైంకి  ఆకలెయ్యక మానదు కదా.

 అలా  అని "తినడానికి ఏవన్నా పెట్టు" అని అమ్మని పీక్కు తినకూడదు. తనకి చెయ్యి ఖాళీ  అయ్యాక తనే పెడుతుంది. పొద్దున్నైతే ఒకటే హడావిడిగా ఉంటుంది కానీ, మధ్యాన్నం  బోజనాలైపోయాక అమ్మక్కొంచం ఖాళీ దొరుకుతుంది కదా.. 

             అప్పుడు ఏ వేరుశనగ గుళ్ళో వేయించి  పెడుతుంది. కొంచం బెల్లమ్ముక్క కూడా తనే ఇస్తుందిలే, మళ్ళీ పైత్యం చేయకుండా. 


             బామ్మైతే వర్షం వచ్చినప్పుడల్లా తన చిన్నప్పటి ఫ్రెండ్సులకి ఎవరెవరికి  వర్షాల్లో ఏమేం దొరికాయో కథలు కథలుగా చెప్పేస్తుంది. వర్షం తగ్గిపోయాక బురదగా  ఉంటుంది కదా. బామ్మ ఫ్రెండ్సులు ఆ బురదలో కర్రతో తవ్వే ఆట ఆడుతుంటే ఒకళ్ళకి గొలుసూ,  మరొకళ్ళకి ఉంగరమూ (రెండూ నిజం బంగారమే) దొరికాయిట. వాళ్లకి అదృష్టం ఉందిట. నేను  వెతుకుదామనుకున్నా తను పడనివ్వలేదు. ఎప్పుడూ ఉండే గొడవే జొరం వస్తుందని. అయినా ఎవరూ  చూడకుండా నేను వెతికాననుకో. కానీ నాకు అదృష్టం లేదు.


      మామూలప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంటే అస్సలు తినలేమా.. అదే వర్షం  వచ్చినప్పుడైతే వేడన్నం ఊదుకుంటూ తింటే ఉంటుందీ..  అది అరిటాకులో .అదే రాత్రప్పుడైతే పెరుగన్నం  అవుతుండగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కడుపులో వేడి వేడిగా ఉంటుంది కదా మరి.  అప్పుడు నిండా రగ్గు కప్పేసుకుని గాట్టిగా కళ్ళు మూసేసుకుంటే వర్షం చప్పుడు,మధ్యలో  తోట లొంచి కప్పల బెకబెకలు వినిపించీ అలా అలా నిద్రలోకెళ్లిపోతాం. 

తెల్లారిందంటే మళ్ళీ  బళ్ళోకెళ్ళాల్సిందే. ....................... 

ఎంత మనం రోజూ దండం పెట్టుకుంటే మాత్రం, 

వానదేవుడు మనూళ్ళోనే  రోజూ వర్షం కురిపించెయ్యడు కదా. 

మిగిలిన ఊళ్లలో కూడా మనలాంటి పిల్లలుంటారు కదా మరి!!!!!!!!!! 




9, ఆగస్టు 2021, సోమవారం

శనగలమాసం


"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే

వడలేసినా సరే.." 

అమ్మా, నేను  పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే

రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను. 

శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి. 

"మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి. 

వెనకటికి నీలాంటిదే 

చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అందిట 

" అమ్మ  ఏమో అనేదే కానీ నాన్న  నన్ను రక్షించేశారు "

అది  సరిగ్గానే చెప్పింది  లేవే.. నువ్వు 

చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."


అమ్మా మాట తిరగెయ్యబోయింది...

కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది. 

పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు.

మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా. 

అమ్మ, నేను కూడా తయారైపోయం . 

అసలు శ్రావణ మాసం వస్తుందనగానే

నాకు ఉన్న రెండు పట్టు పరికినిలు రవణమ్మకి 

వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి. 

పేరంటానికి పట్టు పరికినిలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం. 


పేరంటం అంటే అమ్మా ఎంత బాగా తయారవుతుందో. 

అప్పటికే ముస్తాబులై  వచ్చిన స్నేహితురాళ్ళు 

"ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.." 

అని తొందర పెట్టగానే.....

అమ్మా, నేను  పేరంటానికి బయలుదేరతాము అన్న మాట .


  శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా 

ఉంటాయి ఊళ్ళో. 

ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి. 

ఇంటినిండా వద్దంటే శనగలు. 

సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...

నెలంతా ఇవే వంటకాలు మాకు. 

 అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం 

పేరంటానికి పొద్దున్న నుంచీ  హడావిడి. 

మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా, 

మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు. 


మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు.. 

మరి మా తమ్ముడు కి  ఎలా   దొరికిందంటే.. 

బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే

 ఇంటికి రావడం అమ్మకీ, నాకు  కష్టం కదా

 అందుకని మా తమ్ముడు ప్రతి పేరంటానికీ వచ్చి  

శనగలు ఇంటికి చేరేసే వాడన్న మాట.


 మా తమ్ముడు అలా  పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు. 

"వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ, 

వాడెప్పుడు  పట్టించుకునే వాడు  కాదు.  

అమ్మ తమ్ముడిని  వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది.

 ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా

 మధ్యలో వచ్చి తన  అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది. 

 అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట. 


పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో. 

శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను,తమ్ముడు కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో 

వేసుకుని (అన్నీ తీసేసుకుంటే అమ్మకి అనుమానంవస్తుంది)

దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు

 కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాళ్ళం . 

అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది.

 ఒక్కోసారి  శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది.

 "పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.


 అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే.. 

కొత్తగా చేయించుకున్న నగల మొదలు,

 టీవీలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు. 

పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి.  

ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం 

ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. 


 ఇప్పుడెక్కడా అలాంటి సందడి  కనిపించడం లేదు.. 

కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..