Pages

24, ఫిబ్రవరి 2021, బుధవారం

చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు

 చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు.

 పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.


వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని,
లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు.
కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు.

ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.



23, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఐదు నక్షత్రాలహోటల్ లో చద్దన్నం

మా చిన్నపటి  మా ఇంట్లో 'చద్దన్నాల గది' ఒకటి ఉండేది .  

అందులో రాచ్చిప్ప లో  చద్దన్నం  ఉండేది .

చద్దన్నాల గదిలో పిల్లల్ని వరసాగ్గా కూర్చోపెట్టి చద్దన్నాలు పెట్టేసేవాళ్ళ . 

అసలు చద్దన్నం తినడం ఒక కళ. 

ఈ చద్దన్నాన్ని సాధ్యమైనంత ఎక్కువ సేపు పెరుగులో కలపాలి. 

ఈ కలపడంలో పెరుగు మీగడ వేళ్ళకి  అంటుకుని వెన్నగా మారుతుంది. 

ముందుగా ఆ వెన్న పని పడితే, ఈలోగా పెరుగులో నానిన అన్నం తినడానికి అనువుగా ఉంటుంది.

అందులోకి ఏ మాగాయ టెంకో, ఆవకాయ పెచ్చో నంజుకుని తాపీగా తింటూ ఉంటే, 

చివరి ముద్దకి వచ్చేసరికి ఆవులింత వచ్చి, కళ్ళు మూతలు పడాలి,

అయినా బడికెళ్లడం తప్పదనుకో.

ఒక్కోసారి అమ్మే కలిపిచ్చేస్తుందనుకో.

శీతాకాలంలో గడ్డ పెరుగు భలేగా ఉంటుంది కానీ, వేసంకాలం వచ్చేసరికి కొంచం పులుపు తగులుతుంది. ఉప్పేసుకున్నా బాగోదు. 

వేసంకాలం తరవాణీ కి ఎక్కువ ప్రాధాన్య( గంజీ ఉప్పూ వేసి ఊరబెట్టి తరవాణీ చేస్తారు ఒక దెబ్బకు వేసి )

పెరుగు లేని రోజు ... గొంగూర పచ్చడి ,ఉల్లిపాయ , నువ్వల నూనె  లో తింటే ..

 స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు పనికి రావు .. అంత నిద్దర వస్తుంది 😴😴😴😴

వేసంకాలం చద్దన్నాల స్పెషలు మావిడిపళ్ళు. పళ్ళు ఎక్కడ ముగ్గేస్తారో తెలుసు కదా.. మనవే కావలసినవి ఏరుకుని తెచ్చుకోడం, చద్దన్నంతో పాటు తినేయడం. 

ఇంక, అమ్మ నోరు నొప్పెట్టేలా పిల్చే వరకూ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేం. ఆకలనిపించదు కదా. 

మిగిలిన రోజుల్లో చక్రకేళి అరిటిపళ్ళూ అవీ ఉంటాయి కానీ, మావిడిపండు రుచి దేనికీ రాదు మరి. 

అందులోనూ చద్దన్నంతో అయితే ఒకటి తిందామనుకుని రెండు తినేస్తాం. 

పైగా ఇంట్లో వాళ్ళు కూడా, "ఇప్పుడు కాకపొతే, ఇంకో నెలపోయాకా తిందావన్నా దొరకవూ" అంజెప్పేసి, తినగలిగినన్ని తినెయ్యమంటారు. 

ఇప్పుడు  ఇంట్లో 'చద్దన్నాల గది' ,రాచ్చిప్ప లేక పోయిన ... 

బాధ పడక్కరలేదు ..ఐదు నక్షత్రాలహోటల్ లో దొరుకుతోంది అంట ....



18, ఫిబ్రవరి 2021, గురువారం

ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి"

ఏడు గుర్రాల రథంలో సూర్య దేవుడు వస్తున్నాడు   

మాఘ మాసం శుక్ల పక్షం లో సూర్యుని ఉత్తరాయణ ప్రవేశం జరిగిన ఏడవ రోజు (సప్తమి) సూర్య జయంతి. 

ఇదే  రథ సప్తమి  

ఈ రోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు.

ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు,
వారం లోని ఏడు రోజులకు ప్రతీకలు. 


సూర్యుని రథ సారథి అరుణుడు.  
సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు.
అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు.
తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు.
ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.


రథ సప్తమి నాడు జిల్లేడు ఆకు, రేగు పండు తలపై పెట్టుకుని ఉదయాన్నే స్నానం చేస్తారు. 

చిక్కుడు కాయలతో రథాలు చేసి, పరవాణ్ణం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానునికి నివేదిస్తారు. 

  

    సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కశ్యపాత్మజం 

    శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తాత్పర్యం: ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించిన, మిక్కిలి తేజోవంతుడు, కశ్యప మహాముని పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించిన సూర్య దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను.

ప్రత్యక్షదేవుడు అయిన సూర్యుడు కశ్యప మహర్షి-అదితి ల పుత్రుడు.

అందువలన ఆదిత్యుడు అని కశ్యపాత్మజుడు లేదా కాశ్యపేయం అని అంటారు.  

తెలుగు వారికి చిరపరిచితమైన ప్రముఖ సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో గల "అరసవిల్లి". 

ఇక్కడ శ్రీ సూర్య నారాయణ మూర్తి ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా వెలిశాడు. 
ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు "రామలింగ స్వామి" గా వెలసిన పరమ శివుడు.
ఈ క్షేత్ర వర్ణన ఈ శ్లోకంలో చూడండి.


        హర్షవల్లీ పురీవాసం చాయోషా పద్మినీయుతం

        సూర్యనారాయణ దేవం నౌమి సర్వార్థదాయకం 


ఒకప్పటి "హర్షవల్లి" ఈ నాడు "అరసవిల్లి" గా పిలువబడుతున్నది. 

ఈ అరసవిల్లి దేవాలయం విశిష్టత  ఏమిటంటే ఆలయ నిర్మాణం జరిగిన తీరు అపూర్వం. 

ఎందుకంటే ప్రతి ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు మాత్రం ప్రభాత సూర్యుని తొలి కిరణాలు ఆలయ గోపురం నుండి ధ్వజ స్థంభం మీదుగా వచ్చి నేరుగా స్వామివారి పాదాలను తాకుతాయి. 

వేరే రోజులలో ఇటువంటి ఘటన జరగదు. ఈ వింత చూడటానికి భక్తులు తండోపతండాలుగా అరసవిల్లి దేవాలయాన్ని ప్రాతః కాలమే దర్శిస్తారు. 
సూర్య నారాయణ స్వామి వారికి భక్తులు 'వెండి కన్ను', 'బంగారు కన్ను' సమర్పిస్తారు. 

అలా చేస్తే చర్మ మరియు నేత్ర సంబంధమైన జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుతారని నమ్మకం. 

అరసవిల్లి దేవాలయం గోడలపై అగస్త్య మహర్షి శ్రీ రామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం మరియు గ్రహస్తుతిని తెలిపే నవగ్రహ స్తోత్రం భక్తులకు అనువుగా వ్రాయబడ్డాయి.
నవగ్రహ స్తోత్రం లో కూడా సూర్య దేవుని వర్ణన వుంది.

            జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం

            తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం 

రథ సప్తమి మొదలుకుని సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరుగుతూ వసంత ఋతువుకు దారి తీసి మనకు మరో ఉగాది  నిస్తుంది..



లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****


                            

15, ఫిబ్రవరి 2021, సోమవారం

పుస్తక విలాపం


జూన్ లో అట్టలు వేసి , పసుపుతో ఓం రాసి చక్కగా సింగారించి ఎంతో  జాగ్రత్తగా చూసుకుంటారు .. 

మొదటిలో ముత్యాల కోవ లాంటి రాత .. 

నవంబర్ వచ్చేసరికి   అట్టలు  చిరిగి పోయి .. అర్ధం కాని బ్రహ్మ రాత... 

మొదట పేజీలు అన్ని పాఠాలు .. 

చివరి పేజీలు అన్ని చుక్కల ముగ్గులు ... 

మధ్య పేజీలు అన్ని దానాలు .. 

మార్చి  వచ్చేసరికి   ... మీ రాత మీకే అర్ధం కాకా నన్ను తిట్టుకోవడం .. 

సంవత్సరం చివర గుప్పెడు బఠానీలతో  ముగింపు ... 

జూన్ లో భీముడి లా  ఉన్న నేను .. 

మార్చి కి కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలా అయ్యిపోయాను ....





14, ఫిబ్రవరి 2021, ఆదివారం

దాశరథీ కరుణాపయోనిధీ

దాశరథీ కరుణాపయోనిధీ అని శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైన మన  కంచెర్ల గోపన్న తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. 

దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు.

ఆనందభైరవి రాగాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాగ్గేయకారుడు ఆయన.

 కీర్తనలు రాసి దానికి సంగీత స్వర రచన చేసి ఆలపించిన ఘనత ఆయనదే..  

‘ అంతా రామమయం, పలుకే బంగారుమాయనా, నను బ్రోవమని చెప్పవే,  ఇక్ష్వాకు కుల  తిలకా..గరుడ గమన రారా... అదిగో భద్రాద్రి .. వంటి  గేయాలు అత్యంత ప్రాచుర్యమయ్యాయి. 

‘దాశరథి శతకం’ పేరుతో 103 కీర్తనలు రచించారు. 

59 రచనల్లో ఉత్పలమాల, 44 రచనల్లో చంపకమాల వినియోగించారు. 

జానకీపతి శతకం ,  సంస్కృతంలో శ్రీమద్రామాయణ కథా చూర్ణము రచించారు

దాశరధి శతకము లో ని ఒక పద్యం మీ కోసం

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!


“క్షీరసాగర శయనం’ అనే త్యాగరాజ కీర్తనలో త్యాగరాజు రామదాసును గురించి ప్రస్తావించడం విశేషం..

రామదాసు కీర్తనలలో 9 కీర్తనలు నవరత్నాలు గా ప్రాచుర్యం పొందాయి

రామదాసు జయంతి సందర్భంగా అవి మీకోసం....,,👇

http://bhadrachalaramadasu.com/navaratna-keerthanas/



 అందరికీ శ్రీరాముని కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ

 జై శ్రీరామ్  జై శ్రీరామ్.   జై శ్రీరామ్

10, ఫిబ్రవరి 2021, బుధవారం

బాల్యం ఖాతాలోంచి ఒక చెక్కు రాసి...

***********************************************
కాలం మారవచ్చు..

కలలు మారవచ్చు ..

మన అనుకున్న వాళ్లు మారవచ్చు...

కానీ మనం ఎప్పటికి  మరువలేని మార్పు జ్ఞాపకం...

అలాంటి జ్ఞాపకం ప్రతి మనిషికి ఒక వరం,

ఒక ఆనందం, ఒక అనుభవం..........

ఒక మిత్రుడు ,ఒక శత్రువు, 

ఒక అద్భుతం ,ఒక ప్రయాణం....

ఇలా జ్ఞాపకాలు మనకి ఎన్నో గుర్తు చేస్తూ ఉంటాయి...


మరి అలాంటి కొన్ని జ్ఞాపకాలు మనకి ఆనందాన్ని ఇచ్చి, 

మళ్ళీ మన చిన్న నాటికి తీసుకెళ్లే వాటిని గుర్తు చేస్తూఉంటాయి ...

చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేవి మనం ఆడిన ఆటలు, వాటికి అయిన గాయాలు.

నాలుగు స్తంభాలాట, ఏడుపెంకులాట, దాగుడు మూతలు,

దొంగ పోలీస్ ,వైకుంఠపాళి ఇలా అనేకమైన ఆటలు...అమ్మమ్మ నానమ్మల ఏడు రాజుల కథలు..


వీటిని గుర్తు చేసుకోగానే అలా ప్రతి ఒక్కరి పెదవిపై ఒక చిరునవ్వు ,

అణువు ..అణువులో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది.


ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వాటినుంచి నేర్చుకుంటూ 

అందరికి పంచుకుంటూ ...ఆనందంగా  ముందుకు సాగుదాం.

“బేంక్ లో నిలవ ఉన్న డబ్బు లా చిన్న నాటి  జ్ఞాపకాలు !!!! ”

కళ్ళముందు ఆనందం కరిగిపోయినప్పుడల్లా .. 

ఓ చెక్కు రాసి  బాల్యం ఖాతా లోంచి ..

తీయనైన  జ్ఞాపకాలు సొమ్ము చేసుకుని వెల్లివిరిసిన ఉత్సాహం తో ..

నిరాశను తరిమి కొట్టి..పరిస్థితులను ఎదుర్కొంధాం  .


         లోక సమస్త సుఖినో భవంతు

        **** మీ ఉషగిరిధర్ ****

8, ఫిబ్రవరి 2021, సోమవారం

సామజవరగమన.. అంటే ??

శ్రీ గురుభ్యోనమః 

“సామజవరగమనా” అనే పదం వినగానే.., 
కొంతమందికి త్యాగరాయ కీర్తన గుర్తొస్తుంది..
కొంతమందికి “శారద” అని గట్టిగా అరిచే “శంకరశాస్త్రి” గారు గుర్తొస్తారు..

కానీ అసలు “సామజవరగమనా” అంటే ఏంటో తెలుసా....


'సామజ' అనగా "ఏనుగు" అని.. 
'వరగమనా' అనగా "చక్కని నడక" అని అర్థం... 

"సామజవరగమన" అంటే ఏనుగు లా గంభీరంగా, హుందాగా  నడిచేవారు అని అర్థం..
 మరి అసలైన "సామజవరగమన" ఎవరు ??

అసలైన "సామజవరగమన.." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు... 
వాల్మీకి తన రామాయణంలో 'అరణ్యవాసం'లో 
ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను" డంటారు... 
అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని...
ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో 'సామజవరగమన' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.._

 "సామజవరగమన" కీర్తన, దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం.._


సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥ సామజ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।
స్వీకృత యాదవకులమురళీ !
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥ సామజ॥


ఈ కీర్తనలోని ప్రతి పదం శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది..._ 


ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

              
                      ఇదీ 'సామజవరగమన'కు సంబంధించిన అసలు భావం !

మా గురువు గారు శ్రీమతి గిరిజ కుమారి గారు ఆలపించిన త్యాగరాయ కీర్తన             "సామజవరగమన"  మీకోసం 





 🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

               జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 

3, ఫిబ్రవరి 2021, బుధవారం

చెప్పేవాడికి వినేవాడు లోకువ

'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అనేది చాలా పాత సామెత. 

ఎవరో 'వినే' వాడే వినీ, వినీ బోల్డంత అనుభవం సంపాదించి ఆ అనుభవంతో సృష్టించి ఉంటాడీ సామెత.

మనందరమూ ఏదో ఒక సందర్భంలో వినేవాళ్ళమూ, చెప్పేవాళ్ళమూ కూడా.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.
'వినేవాడు' పాత్ర కన్నా 'చెప్పేవాడు' పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో.!!!!!!!!

 మనం చెప్పేదంతా వినేవాడు దొరకాలే కానీ ఒళ్ళు మర్చిపోతాం కదూ మనం?

వినడం అనేది చిన్నప్పుడే మొదలుపెట్టాం మనం.

ఇంట్లో పెద్దవాళ్ళు, బళ్ళో మేష్టార్లు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ... ఇలా అందరూ మనకి చెప్పేవాళ్ళే. 

ఏం చెప్పేవాళ్ళు??????????

"అల్లరి చెయ్యకూడదు.. బుద్ధిగా చదువుకోవాలి.. ఫస్టున పాసవ్వాలి.." ఇలా అన్నీ మనకి నచ్చని విషయాలే. అయినా ఎదురు చెప్పకుండా వినాల్సిందే.

అలా వినడం అలవాటైపోవడం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మనం పెద్దైపోయాక పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పినా వినగలగడం. 

ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పి ఒప్పించడం మన తరమా??????????

బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగలుగుతున్నామో చూడండి. 

టీవీ యాంకర్ మాట్లాడే సంకర భాష మొదలు రాజకీయనాయకుడు నీతులు, బూతులు కలిపి ఇచ్చే ప్రసంగం వరకూ ప్రతిదీ వినేస్తున్నాం. 

నిజజీవితంలో ఆదాయంపన్ను ఎగ్గొట్టే సిని తారలు సినిమాల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా తెగ బారెడు డైలాగులు చెబుతున్నా కిమ్మనకుండా వింటున్నాం. 

ఇలా ఎన్నెన్ని వింటున్నామో లెక్కలేసుకుంటే మనకే బోల్డంత ఆశ్చర్యం కలుగుతుంది.😲😲😲

ఈ జీవకోటిలో మన మాట వినే ప్రాణి ఏదైనా కనిపిస్తే... మనంత అదృష్టం ఇంకెవరికైనా ఉంటుందా? 

మనం చెప్పడం మొదలు పెట్టామంటే ఎవరైనా మనకి పోటీకి రాగలరా? ఏం? మనమేమీ చెప్పలేమా? 

ఆకలినీ, నిద్రనీ మరిచి, మధ్యలో మంచినీళ్ళు తాగడానికి కూడా బ్రేక్ తీసుకోకుండా అలా చెబుతూనే ఉండిపోగలం. 

వినేవాడు దొరకాలే కానీ ఎంతసేపైనా, ఎన్ని విషయాలైనా చెప్పగలం.

అవునూ.. ఒకవేళ వినడానికి ఎవరైనా దొరికితే మనం ఏమేం చెప్పగలం? 

నిజానికి ఏమేం చెప్పలేం???????? అని అడగాలి. 

మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్పొచ్చు. ఎంత ప్రిన్సిపుల్డో, ఎన్నెన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామో చెప్పొచ్చు. 

సమాజం పట్ల మన బాధ్యత లాంటి బరువైన విషయాలూ చెప్పేయొచ్చు.

వినేవాడు అవకాశం ఇవ్వాలే గానీ అతగాడు ఎంత అల్పుడో జ్ఞానోదయం చేసేయొచ్చు. 

మనం చెప్పేవన్నీ మనం పాటించి తీరాలన్న రూలేదీ అస్సలు లేదు కాబట్టి ఎలాంటి సందేహాలకీ తావు లేదు. ...మరి వినడానికి ఎవరూ దొరక్కపోతే?? 

ఇది కూడా ఓ సందేహమేనా? ఇలా ఓ బ్లాగ్ లో ఒక పోస్ట్  రాసేయడమే!!

వండే వాడికి తినే వాడు లోకువ!!!!

కూర్చున్న వాడికి నించున్న వాడు లోకువ!!!!!

   😃😃😃  రాసేవాడికి చదివే వాడు లోకువ 😃😃😃

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏

 ఎందరో మహానుభావులు అందరికి వందనములు  
ఈ  మధురమైన కీర్తన తెలియని మానవుడు !
అనేవాడు ఉండడే మో ? బహుశ : ! 

తెలుగు వాగ్గేయకార త్రయంలో ధాతు , మాతువులకు ప్రాధాన్యత నిచ్చి ,
రచన చేయడంలో దిట్ట ,స్వర రాగ బ్రహ్మ "త్యాగ రాజు."

అలాంటి !కమనీయమైన కవిత !పరిపూర్ణమైన భక్తి ! సరస సంగీతం !ఈ మూడూ త్రివేణి గా తన గాన సుధా మధు రసాన్ని,ప్రవహింప చేశాడు "నాదబ్రహ్మ త్యాగయ్య."  

ఎన్నో భక్తిపరమైన కృతులను రచించి, దాక్షిణాత్య కర్నాటక సంగీతానికి తెలుగును సంగీత భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య. 

స్వర సాహిత్య సమ్మేళనం అద్భుతంగా సృష్టించిన ఆయన.
తమిళదేశంలో పుట్టి పెరిగినా త్యాగయ్య తెలుగువాడు. 

ఆయన పలికినది తెలుగు పలుకు. "పలుకువేమి నా దైవమా రామ!" - అంటూ, అచ్చ తెలుగులో ఆత్మనివేదన చేసుకున్న త్యాగయ్య తెలుగుకు సంగీత సుభగత్వం సమకూర్చిన మహనీయుడు.

నాట, వరాళి, గౌళ, అరభి, శ్రీరాగాలలో గల పంచరత్నాలు-నాటికీ, నేటికీ, రేపటికీ ఇది పంచరత్నాలే.   

తెలుగు భాషా సుమ సుగంధాలు జగద్వ్యాప్తం కావడానికి నాదసుధారస ధారలు కురిపించిన శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు తెలుగు వారి పుణ్యఫలాలుగా చెప్పుకోవచ్చు.

ఆయన భక్తిరసం జగదానందకారుకుడు, జానకీప్రాణనాయకుడు, కరుణారససింధువైన రామచంద్రునిలో ఐక్యమైంది.   ఆ రోజు... ఈ రోజు ...పుష్య బహుళ పంచమి...(2/2/2021)

నాటి నుండి నేటి వరకూ అజరామరంగా ఆయన రచించి ఆలపించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు దశదిశలా, వాడవాడలా మారుమోగుతూనే వున్నాయి. 

ప్రత్యేకంగా ఆరాధనోత్సవాలలో తిరువాయూరులోని ఆయన సమాధి వద్ద గాత్ర, వివిధ వాద్య సంగీత విద్వాంసులు కీర్తిస్తూ... స్తుతిస్తూ... ఆయన పంచరత్నాలను ఆలపిస్తూ, పంచరత్నసేవతో ఘనంగా నివాళులర్పిస్తూ నే వున్నారు. 

సూర్యచంద్రులు వున్నంతవరకూ ఆయన కీర్తనలు వినిపిస్తూనే వున్నాయి... వుంటాయి కూడా. 

సంగీతాకాశంలో నిండు జాబిల్లిలా ప్రకాశించిన త్యాగయ్య ఆ సంగీతం వినబడినంతకాలం చిరంజీవియే!🙏🙏

    


పల్లవి

ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥

అనుపల్లవి

చందురు వర్ణుని అందచందమును హృదయార

విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥

సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు

మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥

సరగుస బాదములకు స్వాంతమను

సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥

పతితపావనుడనే పరాత్పరు గురించి

బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,

సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥

హరి గుణమణులగు సరములు గళమున

శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో

గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥

హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా

గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా

పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥

ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు

రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ ॥రెందరో॥


     



            🙏🙏🙏ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏