Pages

30, మార్చి 2021, మంగళవారం

ఐ క్నో -ఐ క్నో ( హాస్య కథ)

  (సేకరణ )

గోకవరం సుబ్బారావు ( గో.సు)

 అరుగుమీద ప్రయివేట్లు చెప్తున్న సూన్నాణ మాష్టారి దగ్గరకు  వచ్చి, 

" మాష్టారు! చిన్న సందేహం.

మొన్న పి. యు.టి అంటే put అన్నారు. మరి c.u.t కుట్ అవ్వాలికదా! కట్ అంటున్నారేంటండి?  అని చాలా తెలివిగా ప్రశ్నించానని సంబరపడ్డాడు.


"నీ తలకాయ్! ఇంగ్లీషు వాడు 

ఇలాగే చెప్పేడిచాడు 

నీ వెధవ తెలివి ఉపయోగించి

ఆ ఇంగ్లీషు పరిక్ష చెడదొప్పుకోకు.

మీ నాన్న మా వాడికి నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్పి 

అమెరికా కాకపోయినా , బంగ్లాదేశ్ ఐనా పంపమన్నాడు.

నా పరువు తియ్యకు"..అని తిడుతూ బుర్రబాదుకున్నాడు.

 

బుర్ర గోక్కున్న గో.సు  

మళ్ళీ తన పుస్తకంలో ఐదుపైసల నాణెంలాంటి మొహాన్ని దూర్చాడు.


కాసేపయ్యకా, "మాష్టారండి!

కె ఎన్ ఓ డబ్ల్యు (know)

"క్నో " కదండి! మరి రోజా 

నో అంటోందండి.

 

"సైలెంట్రా   ! సైలెంటు.

నేను సైలెంటు గానే ఉన్నానండి. అల్లరి చేయడం లేదండి". 


"ఒరేయ్! సైలంట్ అన్నది నీ కె.ఎన్. ఓ.డబ్యూ లో 

"కె " నాయన.!"

 నీరసం వచ్చేసింది సూన్నాణ మాష్టారికి.


"ఓహో! అని  అక్షరం అక్షరం  కూడ బలుక్కుని

చదవడం మొదలెట్టాడు.

క్నో కాదు! నో.

క్నాలెడ్జి కాదు! నాలెడ్జి!

 చదవడం మొదలు పెట్టగానే,   'లాఫ్' అనే పదం రాగానే అదెలా చదవాలో తెలియక

నాలికని ఎలా తిప్పాలో తెలియక, లా... అంటుంటే,

పక్కన కూర్చున్న మాష్టారి కూతురు

రోజ "లాఫ్" రా ! మొద్దు అంది. 


"ఎఫ్ లేదు కదే!"  అని మళ్ళీ బుర్ర గోక్కున్నాడు అర్ధం 

గాక.


"ఈ ఇంగ్లీషు ఎవడు కనపెట్టాడబ్బా! అంతా పితలాటకం లా ఉంది.

స్కాటు మాస్టారు వేసే ఏనుగు మెలిక లా.." జుత్తు పీక్కున్నాడు.


గో.సు నాన్న ఆ ఊరి పంచాయితి బోర్డు ప్రెసిడెంట్.

రాజకీయాలతో ఏదైనా సాధించేయవచ్చనే వంద ఆలోచనలు,   వందెకరాలు గల బ్రతక నేర్చిన మోతుబరి.

కొడుకు. గో.సు టెన్తె లో కి వచ్చాడు 

అప్పటి వరకు వాడ్ని అడ్డపెట్టే ధైర్యం ఎవ్వరికి లేక పోవడం వల్ల 

క్లాసులన్నీ  కుక్కదూకుళ్ళు చేసుకుంటూ  'పది' కి వచ్చి పడ్డాడు.


అప్పటి వరకు మాష్టర్లని మేనేజ్ చేసిన ఆంజినేయులికి  టౌన్లౌ టెన్త్ పరిక్ష పెట్టడం

అతనికి నచ్చలేదు.


చాలా హై లెవెల్లో,  మినిష్టర్

లెవెల్లో ట్రైచేసాడు 

సెంటర్ తన పల్లెటూర్లో పెట్టిద్దామని. 


" సూడు! ఆంజినేలు! 

ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఎవ్వారం కాదు.

ఇద్యాశాకా మంత్రి 

కత్తిపూడి కనకం సేత రికమెండేసన్ సేయించినా, పని జరగదు.ఎందుకంటే అన్నీ అయ్యాకా నా దగ్గరకు వచ్చేవు మరి.

మీ ఓణ్ణి ఈ ఏటికి ఇలా కానిచ్చేయమను. ప్యాసయ్యడా! టౌను కాలేజీ మనదే! ఆడికో సీటేయించేత్తాను.

అవలేదనుకో వచ్చే ఏడు 

నాదీ గారంటీ!" ...అని బొజ్జతడుముకుంటూ.

 లంకపుగాకు గుప్పు గుప్పు మని ఊదుకుంటూ కారెక్కేసాడు.


ఆంజినేయులికి బెంగ వచ్చింది. తర్వాత  కోపంవచ్చింది , కాసేపయ్యకా బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది.


" మాష్టారు! తమరు ఓపిగ్గా మాఓడ్ని తిట్టో కొట్టో పరిచ్చ పాసు సేయించాల!.

ఆడ్ని ఫారిన్ పంపాలని మా సెడ్డ ఇది! " అన్నాడు. కాలు మీద కాలేసుకుని ఊపుతూ.

సూన్నాణ మాష్టారికి భయం వేసింది. వాడికి చదువు చెప్తే తనకున్నది మర్చి పోతానేమోనని కంగారొచ్చొంది.


తన రిటార్మెంట్ డబ్బులకి నామినేషన్ ఇచ్చానా లేదా జ్ఞాపకం రాలేదు.


తడబడుతు..."మీ వ్యవసాయం,  వ్యాపారాలన్ని చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి.

ఒఖ్ఖగాని ఒఖ్ఖ నలుసు కదా! 

ఏం పంపుతారండి ఫారిన్.

అక్కడ ఇక్కడ లాగ ఆదుకోడానికి మీరుండరు కదా!

అదీగాక, తిండానికి ఆవకాయ, కొబ్బరి లౌజు, రాసుకోడానికి

ఆవదం దొరకువుటండి! ఆయ్'" 

అని ఏదో రకంగా పెను ప్రమాదం నుంచి తప్పుకోడానికి ప్రయత్నించాడు.


"అబ్బెబ్బే! మా ఓడు ఏదో రకంగా పదో క్లాసు పాసై 

ఈ ఊరు దాటి ఫారిన్ ఎల్లాల!

నిఖ్ఖచ్చిగా చెప్పి జేబులో చెయ్యిపెట్టాడు. 

మాష్టారు తనకి ఆంజినేయులు డబ్బులు ఇవ్వబోతున్నాడేమో నని,

"అబ్బెబ్బె, తరోత ఇద్దురుగాని!

అంటూంటే,

ముక్కుపొడుం డబ్బా మాష్టారి

చేతిలో పెడుతూ హాచ్! అని తుమ్మాడు.

"పాఠాలు సెప్పాలి!  మా సుబ్బుగాడికి

తప్పదు!  అని విచిత్రంగా  నవ్వి. అవకాశం ఇవ్వకుండా డుబ్ డుబ్ మంటూ బుల్లెట్ లాగించేసాడు. 


మాష్టారికి తింగర వాటం వచ్చేసింది.

'సుబ్బిగాడి చదువు నా చావుకొచ్చిందనుకుంటా' . గాలివానకి అల్లల్లాడిపోతున్న 

ఎండు కొబ్బరాకులా  ఊగుతూ  ఉసూరుమంటూ

ఇంటి దారి పట్టాడు ఆ బక్క ప్రాణి. 

అలా రోజూ మాష్టారింట్లో నే మకాం పెట్టిన గో.సు గాడికి ముప్పొద్దులా 

తిండి కూడా మేప లేక అల్లల్లాడి పోతున్నాడు.

సూణ్ణాణ మాష్టారు.

**

పరిక్షలు మొదలయ్యాయి.

మాష్టారికి గుండెల్లో వంద బుల్లెట్లు పరిగెడుతున్నాయి. గో.సు ని 

సానబెట్టగా  అత్తీసరు మార్కులు వచ్చే వరకు ఫర్వాలేదని పించేడు. ఒక్క ఇంగ్లీషు పరిక్ష రోజున మాత్రం,

మాష్టారి టెన్షన్ తగ్గడానికి పది

మాత్రల్లేసుకుని వాడితో సెంటర్ కి వెళ్ళాడు.


దూరంగా చెట్టుక్రింద నెత్తిమీద గుడ్డేసుకుని కూర్చున్నాడు.


గో.సు ముఖం నిండా వీభూది.

బొట్లు పులుముకున్నాడు. చేతికి తాయత్తులు కట్టుకున్నాడు. డాలు లాంటి అట్ట, కత్తిలాంటి పెన్నుతో 

మాష్టారికి వాడు యుధ్ధానికి వెళ్తున్నట్టు కనిపించింది.

వీడు ఏం చీల్చి చెండాడుతాడో ఆ ఆంగ్ల పేపర్ని అని భయపడ్డాడు.

*

రిజల్ట్స్ వచ్చేరోజున వంద లంఖణాలు చేసిన వాడిలా ఉన్నారు మాష్టారు.

వంద కొబ్బరికాయలు 

ఐనవిల్లి గుళ్ళో మొక్కు కున్నారు.

ఎట్టకేలకు గో.సు కరక్టుగా 35 శాతంతో గట్టెక్కాడు.

కూతురు రోజా స్కూల్ ఫస్టు వచ్చిన ఆనందం కన్న గో.సు 

గాడు ప్యాసవ్వడం గొప్ప ఆనందం వచ్చిందాయనకు.

ఇంటర్లో జాయిన్ అయిన

గో.సు అంతకన్నా ముందుకి వెళ్ళ లేక చతికిల పడిపోయాడు. 

కానీ రాజకీయాల్లో మంచి పట్టు సంపాదించాడు.

**

ఒకరోజు రిటైరై పోయి పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న మాష్టారు 

ఆ వార్త చూసి   స్పృహతప్పిపడిపోయారు.

భార్య కంగారు పడుతూ

ముఖం మీద నీళ్ళు జల్లి 

లేపింది.

"ఏవైందండి!  

నోట మాట రాక, అలా ఉండి పోయాడు. కాసేపయ్యాకా తేరుకుని.

మన గో.సు గాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారుట. 

అంటూ...

ఐ క్నో ! ఐ క్నో. 

అంటూ వెర్రిగా నవ్వాడు.

పెళ్ళం అతనికి పిచ్చి పట్టిందేమోనని కంగారు పడుతోంది ఇప్పటికి.

25, మార్చి 2021, గురువారం

పార్వతీశం ప్రయాణం (2021)-- 1


పార్వతీశం ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో ...

అదే అండి మన నరసింహశాస్త్రి  గారి పార్వతీశం... 

మన వాడు .. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి .. 

వచ్చి  80 సంవత్సరాలు దాటినా మన తెలుగు వారి మనసులో ఉన్న వ్యక్తి ..


నాకు ఒక ఆలోచన వచ్చిందీ ..

ఒక సారి చదువు కోసం ఇంగ్లాండు వెళ్లి వచ్చిన పార్వతీశం ... 

ఇప్పటి రోజులలో మళ్లీ ప్రయాణం కడితే ఎలా ఉంటుందా అని?

ఇంకెందుకూ అల్లస్సం చదవండి ... 

                              ************

"మొగలితుర్రు కాపురస్థుడు  అయిన  వేమూరు పార్వతీశం చాల సంవత్సరాల తరవాత మళ్లి ఒక సారి ఇంగ్లాండు వెళ్లి వద్దాము అని ఆలోచన వచ్చింది .. "

ఈ సారి  ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రయాణం మొదలు పెడతాడు ....


ఒక సారి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి .. 

ఇంతక ముందు చేసిన తప్పులు ఏమీ మళ్లి జరగ కుండా చూసుకోవాలి అని అనుకుని 

ఫ్లైట్ టికెట్స్ అవి  కొనుక్కుని .. 

కావలిసి సామానులు లిస్ట్ ఒకటి సిద్ధం చేసుకుంటాడు!

సామానులు కొనడానికి బజారుకి వెళతాడు ..

ముందుగా .. 

దంత దావనానికి  .. బ్రెష్ , పేస్ట్ . 

స్నానం కి .. సబ్బులు , ఒక టవల్ 

ఒక నాలుగు జతల బట్టలు .. 

కరోనా సమయం కదా .. మల్లి అక్కడ మాస్క్ లు కొనడం ఎందుకు అని 

ఒక నాలుగు నారింజ పండు రంగు మాస్క్ లు ... 

దువ్వెన కొందాం అని అనుకుని ... 

దాని అవసరం పెద్దగా లేదు అని విరమించుకున్నారు .

( వయసు పై బడింది కదా బట్ట తల వచ్చిందీ ) 

కరోనా సమయం లో అక్కడ భోజనం ఇబ్బంది అవుతుందేమో అని 

ఒక ప్రియా ఆవకాయ ,
 MTR సాంబారు పొడి కొనుకుని . 

దూర ప్రయాణం కదా సెల్ ఛార్జింగ్ ఐపోయిన ఉంటుంది అని ఒక పవర్ బ్యాంకు కొనుకుంటారు  .

ఇంకా ఏమీ ఐనా కావాలి అంటే అమెజాన్ లో ఆర్డర్ చేయచ్చు అని ఇంటికి చేరుకుంటారు  .

ఇంటికి వచ్చి మడత కుర్చీ లో కూర్చుని ఉండగా ... ఒక అనుమానం వచ్చింది.....


                                

                                                                         ( ఇంకా ఉంది)

                          **** మీ ఉషగిరిధర్ ****

24, మార్చి 2021, బుధవారం

గాడిద గుడ్డు

 'గాడిద గుడ్డు..' అంటూ ఉంటారు.

 అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా! మరి ఎందుకలా అంటారు ? చదవండి . 

అనగనగ ఒక అగ్రహారంలో జోగులు ఉండేవాడు 

జోగులుకి చదువు అబ్బలేదు.
ఆరుశాస్త్రాలలో ఉద్దండులయిన పండితులు ఉన్న అగ్రహారంలో,
ఇరవై ఏళ్ళు వచ్చిన తాను ఒక్కడే, ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది .

దూర దేశానికి వెళ్లయినా సరే........
పిలక్కి తాడు కట్టుకుని అయినా సరే.....
( నిద్ర మానుకుని కష్టపడటం అనేందుకు ఈ ఉపమానమ్... నిద్ర పొతే, తూలి , పిలక్కి ఉన్న తాడు వెనక్కి లాగడంతో మెలకువ వస్తుంది కదా...)

 మహా పండితుడయ్యి తిరిగి రావాలని సంకల్పించాడు .

దూర దేశానికి వెళ్లి, ఒక సత్రంలో బస చేసి, తోటి ప్రయాణికుడిని
' అయ్యా! నన్ను ఆరు మాసాల్లో పండితుడిని చెయ్యగల గురువు కావాలి,' అని అడి గాడు .

'ఓ లేకేం, నేను విద్య నేర్పిన శిష్యులు అంతా ఇప్పుడు రాజాస్థానాల్లో కొలువు చెస్తున్నారు. మరి, గురుదక్షిణ ఏమి ఇస్తావ్ ?' అని అడిగాడు ఆ గురువు.

' నా బంగారు మురుగులు ఇస్తాను. గురువర్యా!
వెంటనే నాకు విద్య నేర్పండి,' అంటూ సాష్టాంగ పడ్డాడు జొగులు.

'నీకు శబ్దాలూ, సంధులూ వచ్చునా?'

'వాటిల్తోనే అసలు చిక్కండీ . సంధులూ- సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా?'

'అసలు వాటితో అవసరం లేకుండా పండితుడిని చెయ్యడమే నా ప్రత్యెకత.

శత శ్లోకేన పండితః ' అన్నారు పెద్దలు.
అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితుడు అవుతాడని శాస్త్రమ్...


"గురువుగారు, మరీ వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం .
కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా?" దీనంగా అడిగాడు జోగులు .


" తగ్గకేమి? చతుః శ్లోకేన పండితః " , అన్నారు శాకటాయనుల వారు.
అంటే, నోటికి నాలుగు శ్లోకాలు వచ్చిన వాడు కూడా పండితుడే,"


"అయితే, నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు,"
అంటూ మురిసిపోయి, విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు .


నాలుగు నెలల తర్వాత గురువుగారు 'పండితుడివయి పోయావు, ఇక నీకు తిరుగు లేదు పో,' అంటూ సెలవిచ్చారు.
వెంటనే జోగులు తన వేలికున్న బంగారు ఉంగరం అమ్మి, కాశ్మీరు శాలువా భుజాల నిండుగా కప్పుకుని, కళ్ళు ఎగరేస్తూ, దర్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు .


దారిలో అతడికి ఒక చచ్చిన గాడిద కనిపించింది .
'అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ .. ' అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది . 

వెంటనే ఒక తాడు తీసుకుని, గాడిద మెడకు కట్టి, ఈడ్చుకుని వెల్లసాగాడు . 

అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడ సాగాడు .


వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది . "సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్..." 

అంటే, శరీరం అంతటిలో తలే ముఖ్యమయినది .

 కనుక, రంపం లాంటి కొమ్మ తీసుకుని, గాడిద తల నరికి దాన్ని తీసుకు పోసాగాడు . 

కాసేపటికి అది కూడా బరువు అనిపించింది .


అప్పుడు మూడవ శ్లోకం గుర్తుకు వచ్చింది . 

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ...' 

అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమయినవి. 

వెంటనే, సన్నటి వెదురు బద్దతో గాడిద కన్ను గుడ్డు పెకిలించి, అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు . దారిలో ఒక పలివెల అనే దేశం వచ్చింది . ఆ దేశపు రాజు పండిత ప్రియుడు అని విని, రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు .

అప్పుడు జోగులుకి నాలుగోవ శ్లోకం గుర్తుకు వచ్చింది . 

' రిక్తహస్తేన నో పెయాట్ రాజానం దైవతం గురుమ్... ', 

రాజును, దైవాన్ని, గురువును, వట్టి చేతులతో దర్శించకూడదు . 

ఏదో వొకటి ఇవ్వాలి, అనుకుని, రాజు వద్దకు వెళ్లి, తన చేతిలో ఉన్న గాడిద గుడ్డును ఇచ్చాడు .


ఆ వింత వస్తువును చూసి, బెదిరిన రాజు జోగులుకి బాగా దేహశుద్ధి చెయ్యమని, నౌకర్లకు ఆజ్ఞాపించాడు . 

తాను ఇంత శ్రమ పడి నేర్చిన పాండిత్యం, గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లుమన్నాడు జోగులు .

అదండీ సంగతి, గాడిద గుడ్డంటే , గాడిద కన్ను గుడ్డు అన్నమాట .




18, మార్చి 2021, గురువారం

బామ్మ గారా మజాకా!

ఒక చిన్న టౌన్ లో వున్న కోర్ట్ లో ,

ఒక కేసు విచారణ సందర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి , 

" మామ్మ గారు నేనెవరో మీకు తెలుసా ?" అని అడిగాడు దర్పంగా నల్ల కోటు సర్దుకుంటూ...

ఆవిడ వెంటనే ," అయ్యో ,తెలియక పోవడమేంటీ..?

బాగా తెలుసును..

పెద్దపిచ్చయ్యగరి రెండో అబ్బాయి గోవిందానివి కదూ......

నీ చిన్నప్పటి నుండీ నిన్నూ ,మీ కుటుంబాన్నీ ఎరుగుదును నాయనా..! నిజంచెప్పాలంటే 
చిన్నప్పుడు నిన్ను ఎందుకూ పనికిరావు అనుకునేదాన్ని . 

అబధ్ధాలాడేవాడివి,జనాన్ని మోసం చేసేవాడివి ,

ఆఖరుకి నీ భార్యని కూడా మోసం చేసావ్ ..పైసాకా పనికిరాకపోయినా , 

గొప్పలు పోయేవాడివి .నాకు బాగా తెలుసు ను కదా !"  అంది.

P.P. గారు హడిలి పోయి ,బిక్క చచ్చి పోయారు. ఏం మాట్లాడాలో తెలియక , డిఫెన్సు లాయరు గారిని చూపించి , " వారు తెలుసా ..? "అని అడిగాడు.

బామ్మగారు ఠక్కున , "మాబాగా తెలుసును..జేబులు కత్తిరించే వీరదాసు కొడుకు

కుమారదాసు కదా .. చిన్నప్పుడు పనీ పాటాలేకుండా వీధులెంట బలాదూర్ తిరిగేవాడు.లేని దురలవాటులేదు..తాగుబోతు, తిరుగుబోతు కూడానూ !ఇతనిది 

అందరి కంటే చెత్త ప్రాక్టీసు అని ఊరంతా చెప్పుకుంటారు. పైగా ముగ్గురు స్త్రీలతో అక్రమ సంబంధం ..అందులోఒకరు మీ ఆవిడే కదా ! నాకు తెలీకేం , బాగా తెలుసు ...

" అంది గుక్క తిప్పుకోకుండా ."

డిఫెన్స్ గారికి చచ్చినంత పనైంది . 

జడ్జి గారు ఇద్దరు లాయర్లని తన దగ్గరికి పిలిచి ,రహస్యంగా , "మీ ఇద్దర్లో ఎవరైనా

తెలివి తక్కువగా , జడ్జి గారు తెలుసా అని ఆవిడని అడిగారంటే ,కోర్టు ధిక్కారం కేసు

కింద జైల్లో తోయించేస్తా ,జాగ్రత్త !!"అని బెదిరించాడు.

లాయర్లు షాక్ !! బామ్మ రాక్స్ !!



                                                                                                    (సేకరణ )

17, మార్చి 2021, బుధవారం

పచ్చదయినదమ్మా మా కోనసీమా కొండపల్లి బొమ్మా ఈ పల్లె భామా

కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. 

ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని 

గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. 🌴🌴🌴

మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, 

పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ

 చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!

 

ఊహతెలిసినప్పటినుంచీ  తెలిసిన ప్రపంచం అంతా సప్తవర్ణ శోభితమే.🌈🌈

నిద్రలేస్తూనే మండువా లోకి వస్తే ఎదురుగా  ఉదయించే సూర్యుడు, 

తల పక్కకి తిప్పితే ఎత్తైన  కొబ్బరి అడవి. 

పెరట్లో అరటి చెట్లు, దబ్బ చెట్టు, కూరగాయ మడులు.. 

దాటి కొంచం ముందుకు వెడితే కొబ్బరి తోట. 

ఓ పక్క మావిడి చెట్టు, మరోపక్క వేప చెట్టు, ఇంకోపక్క వెలగచెట్టు. 

సరిహద్దులో పాముపుట్టని ఆనుకుని సంపెంగ పొద, అనాస పొదలూ.

 ఆవెంటే కనకాంబరాలలాంటి ఆకుపచ్చని పూలు పూసే పేరుతెలియని 

మొక్కలు. 


అటుగా ఓ అడుగేస్తే పక్క వాళ్ళ తోటలో ఈత చెట్లూ, నేరేడు 

చెట్లూ. కాకులు, చిలకలు, పాలపిట్టలతో పాటు పేరు తెలియని పక్షులెన్నో. ఇక 

సీతాకోకచిలుకలైతే ఏరకం పూలమీద ఏ చిలుక వాలుతుందో నిద్రలో లేపినా చెప్పేసేంత జ్ఞానం!! 

పసుపురంగు కోల రెక్కలుండే సీతాకోకచిలుకలైతే ఎలాంటి పూల మీదైనా 

వాలేస్తాయి. అదే నలుపు మీద తెలుపు, ఎరుపు చుక్కలుండే పెద్ద రెక్కలవైతే 

మందారాలని విడిచి పక్కకి చూడవు. నల్లరెక్కల మీద తెల్లని చారలుండే బుజ్జి 

పిట్టలు సీతాఫలాలని బతకనివ్వవు. పిందె పండుగా మారుతూ ఉండగానే ఈతాకు బుట్టలు కట్టేయాల్సిందే. 


దొండ పాదుకి రోజూ కోసినా కాయలు కాస్తూనే ఉంటాయి. 

పొట్ల పాదు పూత నిలబడగానే చిన్న చిన్న రాళ్ళకి పురికొస తాళ్ళు కట్టి సిద్ధం

పెట్టుకోవాలి, కాయలు వంకర్లు తిరిగిపోకుండా కాసుకోడం కోసం.

  • శీతాకాలపు ఉదయాలు --- మంచు తెరల్ని చీల్చుకుంటూ పచ్చని చెట్ల మీద ఉదయించే సూర్యుడూ
  • వేసవికాలపు సాయంత్రాలు --- రోజంతా గాడ్పుల తర్వాత ఒక్కసారిగా చల్లబడే సాయంత్రాలూ.
  •  వర్షాకాలపు మధ్యాహ్నాలు --- ముసుగేసుకుని పడుకోవాలనిపించే ముసురేసిన మధ్యాహ్నాలూ ఎక్కడైనా బావుంటాయి 

కానీ, కోనసీమలో అయితే అద్భుతంగా ఉంటాయి


మొదటిసారి గోదారిని చూసిన అనుభవం ఎప్పటికీ తడి ఆరని ఓ జ్ఞాపకం.

 సైకిలు మీద నాన్నతో కలిసి ఏటిగట్టు మీద ప్రయాణం.

 నాన్న సైకిలు తొక్కుతూ ఉంటే చెరువు కన్నా ఎన్నో 

రెట్లు పెద్దగా ఉన్న గోదారిని కళ్ళు విప్పార్చుకుని గోదారిని చూడడం బాల్య జ్ఞాపకం .


వినగలగాలే కానీ గోదారి ఎన్నెన్ని కబుర్లు చెబుతుందో. 

ఎంత చక్కని వక్తో, అంతకి మించిన శ్రోత కూడా. 

చెప్పడం చేతనవ్వాలి ఎటొచ్చీ.. చూడ్డానికి ఎంత ప్రశాంత 

గంభీరంగా ఉంటుందో, అంతకు అనేకరెట్లు లోతైన నది కదా మరి. 

వినగలగాలే కానీ గోదారి గలగలల్లో సంగీతం వినిపిస్తుంది.. 

చూడగలిగితే సాహిత్యం కనిపిస్తుంది. 

ఓ సంగీత రూపకం లానో, గేయ కావ్యంలాగో అనిపిస్తుంది. 

చూసే కళ్ళకి గోదారి నడకల్లో నాట్యం కనిపిస్తుంది. 

ఎన్నో పాటలు , కధలు కవితలు పుట్టుకకు స్ఫూర్తి మా గోదారమ్మ , కోనసీమ ..🙏🙏


      



లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ***********


11, మార్చి 2021, గురువారం

🌼🌼దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి🌼🌼

 ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. 

పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు. 

అంతేకాదు, సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణలకు దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది. 

న మఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). 

ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.

అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం.

 మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. 

 కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.


బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం


కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. 

పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు.

 ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. 

 అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. 

 అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. 

 బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.


భక్తుల పేరుతోనే...


శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. 

అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. 

పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. 

మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. 

దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.


కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు.

 ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. 

 కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. 

 అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. 

 సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. 

 విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. 

 దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.


మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.


రాహు కేతు పూజలతో ఖ్యాతి


పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. 

ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. 

సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 

క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. 

పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.
 



                      లోక సమస్త సుఖినో భవంతు

                      **** మీ ఉషగిరిధర్ ****

10, మార్చి 2021, బుధవారం

మొదట ఉపోషం

అప్పుడు నేను మూడో తరగతి.
పండగలు వచ్చాయంటే కొత్త బట్టలు కుట్టిస్తారనీ, పిండి వంటలు చేస్తారనీ, బోయినాలు ఆలస్యమవుతాయనీ,
శివరాత్రి,కార్తీక సోమవారాలు "ఉపోషాలు" ఉంటారనీ మాత్రమే తెలిసిన రోజులు.

"అమ్మా.. రేపు నేనుకూడా మీతోపాటు ఉపోషం ఉంటానమ్మా..
అన్నం తినకూడదు, అంతే కదా.. నేనుండగలనమ్మా..
జొరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటున్నానుకదా.."

 రోజంతా బతిమాలగా బతిమాలగా ఎట్టకేలకి సాయంత్రానికి నా శివరాత్రి  ఉపవాస వ్రతానికి అమ్మ అనుమతి దొరికేసింది. 

 "రేపు మళ్ళీ నువ్వు ఉపోషం కదా. అన్నం తినవు కదా.. పొద్దున్నే నీరసం వచ్చేస్తుంది. ఓ రెండు ముద్దలు ఎక్కువ తినాలి మరి.." 

అని ఆవేళ రాత్రి ఎప్పుడూ తినేదానికి డబుల్ కోటా తినిపించేసిందా.. ఓ పక్క నాకు ఆవులింతలొచ్చేస్తూ కళ్ళు బరువుగా వాలిపోతుంటే అప్పుడింక ఒకటే జాగ్రత్తలు.

 "ఇదిగో.. నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడు నాకు చెప్పెయ్యాలి, తెలిసిందా. మధ్యాహ్నం ఆకలేసినా చెప్పెయ్యి. వంట చేసేస్తాను.." అంటూ.. నేను వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు పొద్దున్నే స్నానం చేసొచ్చేశామా.
ఇంక గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలి. 

ఎప్పుడూ ఖాళీగా ఉండే శివాలయం ఆవేళ ఒకటే హడావిడిగా ఉంది.
ఊళ్ళో వాళ్ళందరూ గుళ్ళోనే ఉన్నారు.

 "గుళ్ళో అభిషేకం ఆలస్యం అయ్యేలా ఉంది కదా చంటి . నువ్వు పాలు తాగెయ్యి," అంది అమ్మ, తను మాత్రం కాఫీ తాగలేదు. 

 అదే అడిగితే "కాఫీ తాక్కూడదమ్మా.. పాలు పర్వాలేదు.." అని చెప్పిందే కానీ,
తను మాత్రం పాలు కూడా తాగలేదు.
నాన్న నన్ను బడికి పంపాలనుకున్నారు కానీ, అమ్మ ఒప్పుకోలేదు, "ఉపోషం పూటా ఏం వెళ్తుంది .." అని.

గుళ్ళో అభిషేకం చేయించుకుంటే ప్రసాదం ఇవ్వకుండా ఉండరు కదా. 

అసలే పూజారిగారు మాకు బాగా తెలుసు కూడాను.
కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. 

గుడి బయటకి రావడం ఆలస్యం, అమ్మ కొబ్బరి చెక్క ముక్కలుగా కొట్టీ, అరటి పళ్ళు ఒలిచీ నాకు అందించేసింది..
"ప్రసాదం వద్దనకూడదమ్మా,  తినాలి" అని కూడా చెప్పింది. 

నేను భక్తిగా ప్రసాదాన్ని ఆరగిస్తుండగా,
 "ఇవాళ  మా 
చంటి కూడా ఉపోషం" అని మిగిలిన భక్తులకి  చెప్పింది అమ్మ.
వాళ్ళంతా నా భక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు. అంత చిన్నపిల్లలెవరూ ఉపోషాలు ఉండరుట.

ఇంటికి రాగానే మళ్ళీ బోల్డన్ని పాలు కాచి వాటిలో పంచదార, అటుకులు వేసి ఇచ్చింది నాకు. 

"అటుకులు తినొచ్చు, అన్నం తినకూడదు కానీ," అని చెప్పెయ్యడంతో నేను ఆ పాలటుకుల పని పట్టాను. 

మధ్యాహ్నం అవుతుండగా చాలా ప్రేమగా మళ్ళీ అడిగింది
"అన్నం వండేయనా? చిన్న పిల్లలు ఉపోషం ఉండకపోయినా పర్వాలేదు" అని. 

నేనొప్పుకోలేదు. ఉపోషం ఉండాల్సిందే అనేశాను, కచ్చితంగా.
 "పిల్ల ఉపోషం ఉంది , ఎవర్నైనా పిలిచి బొండాలు తీయించండి" అని నాన్నకి పురమాయించేసింది.

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, రెండు బొండాల్లో నీళ్ళు నాచేత తాగించడమే కాదు, కొబ్బరి మీగడ అంతా తినిపించేసింది అమ్మ.  

"ఉపోషాలు ఉండేవాళ్ళు బొండాలు తాగొచ్చు" అనడంతో నేనింకేమీ మాట్లాడలేదు. 

సాయంత్రం కాఫీల వేళ నాకు పెద్ద గ్లాసుడు పాలిచ్చి, బిస్కట్లైనా, రస్కులైనా ముంచుకుని తినమంది.
నేను "బిస్కట్లు తినొచ్చా?" అని సందేహం వెలిబుచ్చితే, 

"అన్నం తినకూడదు కానీ మిగిలినవి ఏవన్నా తినొచ్చు" అని మళ్ళీ హామీ ఇచ్చేసింది. పాలతో పాటు కాసిన్ని బిస్కట్లు నమిలాను.

దీపాల వేళ అయ్యిందో లేదో,   నేనేమో మండువాలో మంచం వాల్చుకుని కూర్చుని, నక్షత్రం కనిపిస్తుందేమో అని కొబ్బరాకుల మధ్యనుంచి కళ్ళు చికిలించుకుని ఆకాశంలోకి చూడడం. 

అలా చూస్తూ నేను కాసిని పాలు తాగేసరికి అమ్మ కొట్టక బుట్టలు , కొబ్బరి పచ్చడి , తిమ్మనం రడీ చేసింది , నక్షత్రం రావడం జరిగిపోయింది. 

ఇంకేముంది, నువ్వుల నూనె వేసుకుని ఫలహారం  చేసేశా.
"ఇంతేనా ఉపోషం ఆంటే.. బామ్మెప్పుడూ బోల్డు హడావిడి చేసేస్తుంది.
తను రాగానే చెప్పాలి, నేను ఉపోషం ఉన్నానని" అనుకుంటూ నిద్రపోయా.

మర్నాడు స్కూల్లో మేష్టారు అడిగారు, ముందు రోజు ఎందుకు రాలేదని. 

"శివరాత్రి కదండీ, ఉపోషం ఉన్నాను" అని చెప్పగానే ఆయన ఎంతగా మెచ్చుకున్నారంటే, నాకు ఫస్టు మార్కులొచ్చినప్పుడు కూడా ఆయనెప్పుడూ అంతగా మెచ్చుకోలేదు. అది మొదలు నేనెప్పుడూ ఉపోషం మిస్సవ్వలేదు.

లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ ****