Pages

31, మే 2021, సోమవారం

బామ్మ రాక్స్ .... మేనేజర్ షాక్

 వర్క్ ఫ్రం హోం లో భాగంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటినుంచి రోజుకు 20 గంటలు పనిచేస్తున్నాడు..

అయినా వాళ్ళ ప్రాజెక్ట్ మానేజర్ సంతృప్తి చెందడం లేదు..

మీటింగ్ మధ్యలో వచ్చే ఇంటి శబ్దాలూ....
పిల్లల అరుపులు......
తల్లి మధ్య మధ్యలో ఇచ్చే కాఫీ......
ఇంకా పడుకోలేదా అంటూ నాయనమ్మ గబాల్న మీటింగు మధ్యలో రూం లోకి రావడం ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ మానేజర్ కు చికాకు తెప్పిస్తున్నాయి..

 ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జనరల్ గా సెలవే కానీ ....
ప్రాజెక్ట్ మానేజర్ ఉదయం 7 గంటలకే లైన్లోకి వచ్చేశాడు..
వచ్చేముందే చెప్పాడు ' ఇంట్లో నాయిస్ ' లేకుండా చూసుకో అని..
అబ్బే అస్సలు ఉపయోగం లేదు..ఇంట్లో ఎవరి గోల వాళ్ళదే..

మానేజర్ కొద్దిగా ఇరిటెడ్ అయ్యి
" ఆల్రెడీ చెప్పానుగా " నాయిస్ లేకుండా చూసుకోమని అని మొహం మాడ్చేసుకున్నాడు..
ఆ మాట బామ్మగారు వినేసి "ఒరే నేను మీ మానేజర్ తో ఒకసారి మాట్లాడతా అన్నది"..

అసలే ముక్కోపి పైగా టెన్షన్ లో ఉన్నాడు ......
ఆ మానేజర్ ఇప్పుడు ఈ మాట వింటే నిప్పు తొక్కిన కోతి అవుతాడని ..
వద్దులే నానమ్మా అన్నాడు మనోడు..
కానీ వాడి దురదృష్టవశాత్తూ మైక్ అన్-మ్యూట్ అయ్యుంది మానేజర్ బామ్మగారి మాట వినేశాడు.. ఏకళ నున్నాడో గానీ ' 

ఇదిగో ఆ బామ్మగారు నాతో ఏదో మాట్లాడతానని అంటున్నారు కదా!!
ఒకసారి ఆవిడ చేత మాట్లాడించు ' అన్నాడా మానేజర్..

అప్పుడే కబాసుర కషాయం తాగిందేమో బామ్మగారి గొంతు ఖంగున మోగింది..
ఒరే నువ్వా కుర్చీలోంచి ఇవతలకిరా అంటూ మానవాడ్ని పక్కకు తోసి మానేజర్ తో సంభాషణ మొదలు పెట్టింది పెద్దావిడ..

ఇదిగో మానేజరూ .. ముందుగా నమస్తే..
నువ్వు చూడబోతే బాగా అప్ సెట్ అయినట్టు ఉన్నావు నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలనా?????
అడిగారు పెద్దావిడ..

ఏం లేదమ్మా మీటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో కొద్దిగా శబ్ధం ఎక్కువతుంది.....
దానివలన మా ఏకాగ్రత దెబ్బతింటుంది ఇదే మాసమస్య అన్నాడాయన..

నాయనమ్మ చిన్నగా నవ్వి ఒక్క 10 నిమిషాలు నీ టైమ్ నాకిస్తావా నాయనమ్మని కదా చిన్న కధ చెప్తా అన్నది..

పెద్దావిడ పైగా కొద్దిగా రిలీఫ్ గా కూడా ఉంటుంది..
తర్వాత ఆవిడని కన్విన్స్ చేసి disturbance లేకుండా కూడా చూసుకోవచ్చు అని మానేజర్ ఓకే చెప్పాడు..

నానమ్మ కధ మొదలు పెట్టింది..

"ఒక మాంచి మానేజర్ ప్రశాంతత కోసం ధ్యానం చేసుకుందామని ఊరి చివర చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానం మొదలెట్టగానే చిటారు కొమ్మనున్న కోయిల కూయడం మొదలెట్టింది..

ఈయన ధ్యానానికి ఇబ్బందయింది..కోపంతో కోయిలను అడిగాడు..
కాసేపు కూయడం ఆపుతావా?? నాకు ధ్యానానికి ఇబ్బందిగా ఉంది అని..

కోయిల రెట్టించిన గొంతుతో మరోసారి కూ అని కూసి  ' అరే అబ్బీ నువ్వు నా ఇంటికొచ్చావు..ఇక్కడ ఇలానే ఉంటుంది..నేను ఆపితే మిగతా పక్షులు రాగాలు తీస్తాయి..నేనేమీ నీ ఇంటికొచ్చి కిలకిలలు చేయడం లేదు.. 

నీకిష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అనేసింది..పాపం దానికి తెలియదు కదా!!
అతను పే...ద్ద మానేజర్ అని..

నానమ్మ నవ్వుతూ ముగింపు టచ్ ఇవ్వడానికి గొంతు సవరించుకుంది..

బాబూ మేము మీ ఆఫీస్ కు వచ్చి మీ పని కి ఆటంకం కలిగించామా?? లేదు కదా!!..

ఇల్లు అంటే ఇలానే ఉంటుంది నాయనా!!
ఇంట్లోని మేమంతా సహకరించబట్టే మీ కార్పోరేట్ కార్యకలాపాలు మా ఇళ్ళలోంచి కూడా సజావుగా సాగుతున్నాయి కనుక మీరే అడ్జస్ట్ కావాలి అంటూ మేనేజర్ వంక చూసింది..

లాప్టాప్ లో కెమెరా బాగా పని చేస్తుందేమో!!..
నానమ్మ గారి మొహంలో వెటకారం.......
చిరు కోపం అన్నీ చూసిన మానేజర్ కు జ్ణానోదయం అయింది..

ముందు చిన్నగా మొదలైన నవ్వు 30 సెకన్లలో పెద్దదయింది..

నానమ్మగారూ మీ సందేశం అర్ధమైంది.....
మీ రాజ్యంలో మీరే క్వీన్.....
మీ మాటే శిరోదార్యం ఇకపై మేమే ఒళ్ళు దగ్గరపెట్టుకొని
" చెట్టు కింద ధ్యానం చేసుకుంటాం" అలాగే వర్క్ ఫ్రం హోం కూడా చేసుకుంటాం..
అంటూ ఒక నమస్కారం పెట్టి మీటింగ్ ముగించాడు..


బామ్మా రాక్స్ .... మేనేజర్ షాక్ !!!!!!!!!!!!




30, ఏప్రిల్ 2021, శుక్రవారం

బూడిద గుమ్మడికాయ వడియాలు

 కొబ్బరి తోటకి ఇంజిన్ తో నీళ్ళు పెట్టారు కదా.. మట్టంతా తడితడిగా ఉంది. 

ఎవరూ చూడకుండా నాలుగు దోసిళ్ళ తడి మట్టి తెచ్చి లోపలి పెరడులో  కుండ పెంకులో దాచాను. 

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక  నాన్న ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు. 

అప్పటికే దాచి పెట్టుకున్న బొబ్బాసీ గొట్టాలు   తీసుకుని లోపలి పెరడులోకి   పరిగెత్తాము అన్న ,నేను .తమ్ముడు .

బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపించే ఆలోచనతో ... రోజు నీళ్లు పొసే పనితప్పుతుంది అని 

రాళ్ళు లేకుండా మట్టి అంతా ముద్దగా కలుపుకుని, 

మట్టి మిగిలితే కారు బొమ్మో, రైలు బొమ్మో చేయాలని కూడా ప్లాన్లేసుకున్నాము . 

ఇంతలో అన్నని  వెతుక్కుంటూ బామ్మొచ్చేసింది. గుండెల్లో రాయి పడింది కానీ, నాన్న ఇంట్లో లేరని గుర్తొచ్చి హమ్మయ్య అనుకున్నా. 

అయితే, బామ్మ "మట్టితో ఆడుతున్నారా ? మీ నాన్నకి చెబుతానుండు.." అనకుండా "ఏమిచేస్తునారు ఎండలో ?" అని అడిగింది ప్రేమగా.


బామ్మ కేకలేయక పోవడం కొత్తగా అనిపించింది. 

"బొబ్బాసీ గొట్టాలతో మొక్కలకు నీటి సదుపాయం కలిపిస్తున్నాము .. నీ తులసి మొక్కకి కూడా పెడతాము " అని హామీ ఇచ్చాను. 

బామ్మ అస్సలు సంతోషించలేదు 

"అవ్వని కత్తిపీట పట్టుకురమ్మని చెప్పేశాను.. 


 "కాఫీలు తాగేసి పని మొదలు పెట్టాలి.. ఓమాటు చెయ్యి కడుక్కుని వస్తావా?" అని అడిగింది అన్నని  ప్రేమగా..  ఏదో పని ఉందని అర్ధమయ్యింది.

 "అవును బామ్మా.. కాఫీ తాగితే ఎంత బాగుంటుందో" అన్నాన్నేను.

 నాకు కావాల్సింది నేరుగా అడిగే అలవాటు లేదప్పుడు. 

 మామూలప్పుడు కాఫీ అడిగితే "మీ నాన్నకి చెబుతా" అని బెదిరించే బామ్మ, 

 ఆ పూట "మా తల్లే .. అదేవన్నా బంగారవా? పలకల గ్లాసుతో ఇస్తాను, రా" అంది, మళ్ళీ ప్రేమగా. పలకల గ్లాసంటే పెద్ద గ్లాసన్న మాట.



నేను ఊదుకుంటూ కాఫీ తాగుతున్నానా.. అప్పుడు విప్పింది బామ్మ పొడుపు కథని. 

"బూడిద గుమ్మడికాయలు కడిగి ,నాటెట్టి వెళ్ళమంటే మీ  నాన్నకీ చెయ్యి ఖాళీ లేకపోయింది. 

ఇదన్న మాట సంగతి.. "వడియాలు పెడుతున్నారా? కారం లేకుండా వడియం అట్టు కాల్చుకుంటే ఎంత బాగుంటుందో.." అన్నాన్నేను, తగు మాత్రంగా లొట్టలేస్తూ.

 నిజానికి నాకు 'ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి' అన్న సామెత అప్పటికి తెలీదు. అయినా అన్నీ తెలిసే చేస్తామా ఏంటి?


"ఓస్.. అంతే కదా.. మీ అమ్మకి చెబుతానుండు, కారం కలపకుండా పిండి తియ్యమని.. రేపు మధ్యాహ్నం అన్నంలోకి నీకు అట్టు కాల్చి పెడతాను..సరేనా?" 

హామీ ఇచ్చేసింది బామ్మ. కాఫీలయిపోయాయి కదా, ఇప్పుడు బామ్మ పని మిగిలింది. 

పెరట్లో తులసి కోట చుట్టూ పెద్దవీ, చిన్నవీ కలిపి ఓ డజను బూడిద గుమ్మడి కాయలున్నాయి. 

దేవుడికి కొబ్బరికాయ కొట్టుకునే కత్తి పట్టుకొచ్చింది బామ్మ.  నేను కాయలు కడగడం 

ఆ కత్తితో బామ్మ పర్యవేక్షణలో ఒక్కో కాయ మీదా నాటు పెట్టాడు అన్న , కత్తి బరువనీ, చెయ్యి నొప్పనీ హడావిడి చేసి..


అది మొదలు అమ్మ, బామ్మ, అవ్వ గారూ ఆ గుమ్మడికాయలు ఒక్కోటీ ముక్కలుగా తరగడం. 

సాయంత్రానికి తరగడం పూర్తయ్యింది. ఓ చీరలో ముక్కలన్నీ వేసి,  రాళ్లుప్పు జల్లి, 

 బట్టల మూటంత పెద్ద మూట కట్టి, ఆ మూటని పెద్ద పీట మీద పెట్టారు. 

 ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసి కుంది రోలు సాయం పట్టి ఆ మూట మీద పెట్టేశారు.

 

 మర్నాడు పొద్దున్నే అమ్మ మినప్పప్పు, పచ్చి మిరపకాయలు విడిగా రుబ్బేసిందా? 

తర్వాత మా కోసం కారం కలపకుండా విడిగా కొంచం పిండి ఉంచి, మిగిలిన పిండిలో కారం కలిపేసింది. 

రాత్రంతా మూట లోనుంచి నీళ్ళు కారిపోడంతో అంత పెద్ద మూటా చిన్నదైపోయింది. 

గుమ్మడి ముక్కల్లో కారంపిండి కలిపేసి అమ్మా, బామ్మా కలిసి వడియాలు పెట్టేశారు. 

మధ్యాహ్నాలు ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు వడియాలు కాకులెత్తుకు పోకుండా కాపలా కాసే పనీ, రోజూ సాయంత్రం వడియాలు లేక్కెట్టే పనీ నామీదే పడ్డాయి.


నాలుగోరోజుకి ఫెళఫెళ్ళాడుతూ ఎండిపోయాయి వడియాలు. 

ఆవేళ మధ్యాహ్నం భోజనంలోకి వేగించింది అమ్మ!!

 నాన్న, నేనూ ,అన్న భోజనాలు చేస్తున్నాం. 

"బాగున్నాయ్ వడియాలు.. ఇంకో రెండు ఎండలు ఎండితే నిలవుంటాయ్" అన్నారు నాన్న. 

"రెక్కలు ముక్కలైపోయాయ్.. అవ్వ కూడా సాయం వచ్చింది కాబట్టి సరిపోయింది.. కాస్త పనా, కూస్త పనా.. రాక్షస చాకిరీ,

" అంది అమ్మ, నేను, అన్న కూడా కష్టపడ్డా ఆ విషయం అస్సలు చెప్పకుండా. నాక్కోపం వచ్చేసింది.

 "చూడు నాన్న.. మొన్న అన్న కష్టపడి నాట్లు పెట్టాడు , నేను కాయలు కడగి ,వడియాలు కాకుల నుంచి కాపాడాను  . 

 ఆవిషయం అస్సలు చెప్పడం లేదు," అని కంప్లైంట్ చేసేశాను.

 "నువ్వూ, నేనూ ఎంత చేసినా మీ అమ్మకి కనిపించదు .. ఆవిణ్ణి మెప్పించడం మన వల్ల కాదులే.." అన్నారు నాన్న. 

 బామ్మ నా  బొబ్బాసీ గొట్టాలు , తడి మట్టి విషయం నాన్నకి చెప్పేస్తుందేమో అని భయ పడ్డాను కానీ, మర్చిపోయినట్టుంది.. నావైపు కోపంగా చూసి ఊరుకుంది, అంతే..




27, ఏప్రిల్ 2021, మంగళవారం

కాయగూరల సంస్కృత నామములు !

  • అవాక్పుష్పీ (బెండకాయ)

  • జంబీరమ్ (నిమ్మకాయ)

  • ఆలుకమ్ (బంగాళదుంప)

  • ఉర్వారుక (దోసకాయ)

  • కారవేల్ల (కాకరకాయ)

  • కోశాతకీ (బీరకాయ)

  • బృహతీ (ముళ్ళవంకాయ)

  • మరిచకా (మిరపకాయలు)

  • రాజకోశతకీ (కాప్సికం)

  • లశున (వెల్లుల్లి)

  • వార్తాక (వంకాయ)

  • బింబమ్ (దొండకాయ)

  • శీతలా (సొరకాయ)

  • క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)

  • పలాండు (ఉల్లిగడ్డ)

  • కూష్మాండ (గుమ్మడికాయ)

  • తౄణబిందుక (చేమదుంపలు)

  • మూలకమ్ (ముల్లంగి)

  • రంభాశలాటు (పచ్చి అరటికాయ)

  • సూరణ (కంద)

 హేచ్చరిక ::: పొరపాటున కూరగాయల వాళ్ళని ఈ పేర్లతో కూరలు అడగకండి .. ఏదో తిడుతున్నాము అనుకుంటారు .. 

                                                                                          





26, ఏప్రిల్ 2021, సోమవారం

వైకుంఠపాళీ

 వైకుంఠపాళీ ఈ ఆట తెలియని వాళ్ళు ఉండరు .. చాల మందికి ఇష్టమైన ఆట . 

ఇది ఏమిటి ఈ టైం లో దీని గురంచి ఏమి చెపుతాను  కొత్తగా అని అనుకుంటున్నారా ... 

నిన్న ఆదివారం కదా అని మా పాప తో వైకుంఠపాళీ  ఆడాను ..
తన కాయిన్ పావు మింగేసింది అని ఏడిచింది.

చిన్న పిల్ల చెప్పినా అర్ధం చేసుకునే వయసు లేదు..
వైకుంఠపాళీ కి జీవితానికి ఉన్న సంభంధం .. 


జీవితాన్ని వైకుంఠపాళీ తో పోల్చిన పెద్దాయన ఎవరో తెలియదు కాని, ముందుగా ఆయనకి నా వందనాలు.

 వైకుంఠపాళీ లో పాము నోట్లో పడతామో, నిచ్చెన మెట్లెక్కుతామో పందాన్ని నేలపై పరిచేంత వరకూ తెలుసుకోలేనట్టే, 

 జీవితంలో ఎదురయ్యే జయాపజాలనూ ముందుగా పసిగట్టలేము. 

 ఆటలో పందెం సరిగా పడక పాము నోట్లో పడ్డప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, 

 నిచ్చెన కోసం ఎదురు చూస్తూ ఆట కొనసాగించడం తప్ప.. జీవితం లోనూ అంతే.


చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా ఆడిన ఆటల్లో వైకుంఠపాళీ ఒకటి. 

ముఖ్యంగా వేసవి మధ్యాహ్నాలు బడికి వెళ్ళక్కర్లేకుండా, 

ఇంటి నుంచి బయటకి కదలడానికి పెద్దవాళ్ళ అనుమతి లభించని సందర్భాలలో నాకు కాలక్షేపం అందించింది ఈ ఆటే. 

మద్యాహ్నం నిద్ర అలవాటు లేకపోవడంతో, పావులు కదుపుతూ గడిపేసేదానిని . 

మరొకరితో ఆడుతున్నప్పుడు, వాళ్ళ పావులు నిచ్చెనల మీద, నావి పాముల నోట్లోనూ ఉన్నప్పుడు భలే ఉక్రోషంగా ఉండేది మొదట్లో. 

ఎంత ఆవేశంగా గవ్వలు విసిరినా కావాల్సిన పందెం పడేది కాదు.


కొన్ని క్షణాలలోనే ఆట తారుమారయ్యేది.

పెద్ద పందేలతో పైకెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా పెద్దపాము నోట్లో పడి మొదటికి వచ్చేసే వాళ్ళు. 

కొన్నాళ్ళు ఆడేసరికి ఆట అర్ధం కావడం మొదలుపెట్టింది. 

ఆడడానికి ఎవరూ లేనప్పుడు నేనే రెండు పావులతో ఆడేదానిని .

 తెలియకుండానే గెలుస్తున్న పావు నాది అనిపించేది. 

 బహుశా విజయానికి ఆ ఆకర్షణ ఉందేమో. 

 కొన్నాళ్ళు వైకుంఠపాళీ ఆడడం ఓ వ్యసనమైపోయింది. 

 ఈ ఆటలో గెలుపోటములు మన చేతిలో అస్సలు ఉండవనే విషయం పూర్తిగా అర్ధమైంది.


జీవితంలో మొదటి వైఫల్యం ఎదురైనప్పుడు నాకు వైకుంఠపాళీ లో పెద్దపాము 'అరుకాషురుడు' గుర్తొచ్చాడు. 

వచ్చి వచ్చి వీడి నోట్లో పడ్డాను కదా అని బాధ పడ్డాను. 

విజయం కోసం కసిగా ప్రయత్నాలు చేశాను..కానీ వైఫల్యాలే ఎదురయ్యాయి. 

విజయానికీ, వైఫల్యానికీ ఎంత భేదం ఉందో స్పష్టంగా అర్ధమైంది. 

విజయం వస్తూ వస్తూ మిత్రులని తీసుకొస్తే, 

వైఫల్యం మిత్రులు అనుకుంటున్నా వాళ్ళని దూరం చేస్తుందని తెలిసింది. 

కొన్ని వైఫల్యాల తర్వాత ఒక విజయం దొరికింది. 

కానీ, నాకది అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వలేదు.

 వైఫల్యం కారణంగా నాకు దూరమైన వాళ్ళు నాకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు మాత్రం బాగా నవ్వొచ్చింది.


విజయాలనూ, వైఫల్యాలనూ ఒకేలా తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాలేదు కానీ,

 వైఫల్యాలని తట్టుకోగలిగే స్థైర్యం బాగానే అలవడింది. 

 వైకుంఠపాళీ లో పాములు, నిచ్చెనలు యెంత సహజమో జీవితంలో కూడా అపజయాలు, విజయాలు అంతే సహజమని అనుభవపూర్వకంగా తెలిసింది. 

 పాము నోట్లో పడ్డప్పుడు పందెపు గవ్వలను నేలకి విసిరి కొట్టడం వల్ల ఉపయోగం లేదని, 

 కొంచం ఓపికగా ఆట కొనసాగిస్తే నిచ్చెన తప్పక వస్తుందన్న సత్యం బోధ పడ్డాక జీవితపు వైకుంఠపాళీ కూడా ఆసక్తికరంగా మారింది. 

 ముఖ్యంగా పాము నోట్లో పడ్డ ప్రతిసారీ, ఓ నిచ్చెన నా కోసం ఎదురు చూస్తోందన్న భావన నాకు బలాన్ని ఇస్తోంది..




20, ఏప్రిల్ 2021, మంగళవారం

గోదారి రాముడి కళ్యణమ్

**************************

ఊరంతా తాటాకు పందిర్లు.. మామిడాకు తోరణాలు .. 

ప్రతి  ఇంట్లో చుట్టాలు .. అందరూ పెళ్ళివారే .. 

సీత రాముల కళ్యాణం కదూ  ... అందుకని 

మా ఊరి రామాలయం చూడటానికి చిన్నది ఐనా పక్కనే  కౌశిక .. 

కంటికి కనిపించే  అంత మేర కొబ్బరి తోట .. చూడటానికి రెండు కళ్ళు చాలవు .


మా ఊరి లో  శ్రీ రామ నవమి హడావిడి రెండు రోజుల ముందు మొదలవుతుంది . 

పెద్ద వాళ్ళు ...పందిర్లు.. తోరణాలు గురంచి చూసుకుంటే .. 

పిల్లలు ..  గుడిని రంగు రంగుల కాగితాలతో అలంకరించడం..

ఇత్తడి పల్లకి  , కంచు గంట , పల్లాలు,కాగడాలు , కోల తోమడం  .. ..ఇలా ఎన్ని పనులో

ఆడ పిల్లలు అందరం చింత పండు , ఉప్పు తో తోమడం .. 

మగ పిల్లలు నూతిలో నీళ్లు తోడటం అనమయతి గా వస్తోంది 

ఒకరోజు ముందే అందరం సుబ్బరంగా పల్లకి, గంట, పల్లాలు అన్ని తోమేసి మండువాలో పేట్టేసే వాళ్ళం ..

మా రాముడి పల్లకి(ఇత్తడిది ) చాల బరువు .. 





ప్రతి సవత్సరం కావలసిన వస్తువులు ఐనా .. 

గురువు గారు ఒక రోజు ముందు లిస్ట్  రాసి నాన్న కి ఇచ్చేవారు 

అది ఒక ఆనందం .. పసుపు , కుంకుమ తో ఆ లిస్ట్ మొదలు .. 


శ్రీ రామ నవమి రోజు తొందరగా పట్టు బట్టలు కట్టుకుని రెడీ ఐపోయేవాళ్ళం 

పెళ్లివారం కదూ ... 

మేము ఆడ పెళ్లి వారం అందుకని అమ్మ .. 

తలంబ్రాలు , జీలకర్ర బెల్లం , సీత రాములకి పట్టు బట్టలు .. 

గుమ్మడి పండు , అరటి పళ్ళ అత్తమ్ , గంధపు చక్క ,ఉత్తర ధన్యాలు

పూలు పళ్ళు  అన్ని ఇత్తడి పల్లాలలో సద్ది రెడీగా ఉంచేది 

లిస్ట్ ప్రకారం అన్ని వచ్చాయా లేదో చెక్ చేయడం నా పని ..


భాజాలు చప్పుడు వినిపించగానే ఏదో తెలియని సంతోషం . 

కళ్యణనికి ముందు ఊరేగింపు ఉంటుంది ... 


కాగడాలు పట్టుకోవడానికి పిల్లల పోట్లాటలు

మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరిగేది .


పల్లకి గుడికి చేరగానే గుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి

రాముని కళ్యణ పీఠం మీద కూర్చో పెడతారు ..

ఆడ వాళ్ళు ఒక వైపు .. మగ వాళ్ళు ఒక వైపు  కింద కుర్చునేవాళ్ళు .. 

కింద కూర్చోలేని వాళ్ళకి వెనకాల కుర్చీలు 


మా గుడి లో రాముని కళ్యాణానికి ఒక అనామయాత ఉంది .. 

కళ్యాణం జరిగిన అంత సెపు కర్పూరం హారతి వెలుగుతూ ఉండాలి .. 

మా ఊరిలో రాముడు గారు అని ఒక తాత గారు ఉండేవారు 

పిల్లల అందరిచేత కొంచం , కొంచం కర్పూరం వేయించేవారు ..

అది వేసినంత సెపు రామ నామం చెప్పాలి  అది రూల్ ..


ఈలోగా గురువు గారు కళ్యణమ్ మొదలు పెడతారు ....

"సీత రాములు ఇద్దరూ  పట్టు బట్టల్లో మెరిసిపోతున్నారు. 

మండపం నిండుగా జనం ఉన్నా అంతా నిశ్శబ్దంగా ఉంది. 

అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. 

పంతులుగారికి కూడా ఉత్సాహం వచ్చినట్టు ఉంది. 

మంత్రాలకి అర్ధం చెబుతూ, జరుగుతున్న తంతు ఎందుకో వివరిస్తూ చాలా ఓపికగా జరిపించారు. 

పాదుకలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి నీళ్ళతో కడిగారు..
కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నమాట. 

ఆ తర్వాత జీలకర్ర-బెల్లం.
పంతులు గారు, మా పూజారి గారు సీత రాముల తలలపై వాటిని ఉంచారు. 

వధూవరుల తాత , తండ్రుల వివరాలు, వారి గోత్రాలు, ఋషులు అన్నీ ప్రవర రూపంలో చదివారు. '

చదువుతుంటే వినడానికి భలే ముచ్చటగా అనిపించింది. 

తలంబ్రాలు పోస్తుంటే వీరణాల వాళ్ళు, బ్యాండు వాళ్ళు పోటీ పడ్డారు.
మరో పక్క బాణాసంచా. 

తరవాత చదివింపుల కార్యక్రమం .. "

అక్కడితో కళ్యాణం ముగిసింది .. 


తలంబ్రాల బియ్యం కోసం భక్తులు పోటీ పడ్డారు..

ఈలోపు గుడి పక్కన సావిడి లో పానకాల రెడీ ఐపోయేవి .. 

కళ్యణమ్ రోజు రాముడు గారిది వైశాఖ పూజ .. 

పచ్చి శనగలు దేవుడికి .. ఉడికించిన శనగలు భక్తులకు .. 


తొమిది రోజులు వైశాఖ పూజలు ఉంటాయి ..
రోజు పానకాల .. ప్రసాదాలు .. పల్లకి ఊరేగింపు 
ఐదవ రోజు చక్ర స్థానం .

మా చిన్నపుడు ఐతే వైశాఖ పూజలకి  తాటాకు విసిన కర్రలు ఇచ్చేవారు 

తరువాత ప్లాస్టిక్ విసిన కర్రలు

ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు అందరి ఇల్లల్లో ఇన్వెర్టర్ ఉన్నాయి .. 

కానీ  కొన్ని పద్ధతులు ఏమి మారలేదు  ఇత్తడి పల్లకి .. కర్పూర హారతి .. 

మా గోదారి రాముడి ... సీత రాముడు .. మా అగ్రహారం రాముడు .. లోకాభి రాముడు .




               జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 

                                సర్వేజనా సుఖినోభవంతు




 


15, ఏప్రిల్ 2021, గురువారం

బాలానాం రోదనం బలం

 

ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,
మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే,
వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు.
అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది . 


"పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం ."

అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ,
ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు . 

ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు
పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి . 

ఏమయ్యిందో అని వెళ్లి చుస్తే ,
నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి,
నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .

కారణం అడగ్గా,
'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . .

'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది,
ఆ వాక్యానికి అర్ధం అది కాదు,
పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు . 


"పక్షీణాం  బలమాకాశం 

మత్స్యానా ముదకం బలం 

దుర్బలస్య బలం రాజా 

బాలానాం రోదనం బలం "


ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది . 

ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి . 

అలాగే చేపలకు నీళ్ళు బలం . 

బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం . 

చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం . 

ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక ,
 అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది . 

అంతే  కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు . 

పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు
అని పెద్దలకు చేసిన హితవు,
అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,
అని వివరించాడు చెంచయ్య . మీకూ  తెలిసింది కదూ... 






14, ఏప్రిల్ 2021, బుధవారం

వసంత నవరాత్రులు

🌻. ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు 🌻

(సేకరణ )

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 

అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది.
ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది.
శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత...నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల  సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే..

 ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. 

 అందుకే... ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.

 అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?


ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు.
అదే శ్రీరామావతారం. 

అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. 

పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. 

అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. 

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు


   శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

   అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం


శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.   


నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.


సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. 

కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 

అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. 

అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని ,

 ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.


సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , 

అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి.

 వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. 

 రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. 

 "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. 

 నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. 

శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.


వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.


రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. 

అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.


కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించారు.


                                   సర్వే జనా సుఖినోభవంతు