ఈ మధ్య అందరూ మిడి మిడి జ్ఞానం ఉన్న పండితులే అయిపొయారండీ . ,
మీరు మాటవరసకు 'జలుబు చేసింది, ' అన్నా సరే,
వంద చిట్కాలు, ఉపాయాలు చెప్పెస్తారు.
అటువంటి ఒక పండిత పుత్రుడు ఏమి చేసాడో ఈ కధ చెప్తోంది .
"పద్మనాభానికి తానొక గొప్ప పండితుడినని నమ్మకం ."
అక్కడా ఇక్కడా గాలివాటుగా విన్న విషయాలు వల్లే వేస్తూ,
ఆచరణలో పెట్టేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు .
ఒక రోజు పద్మనాభం పొరుగింటి వాడయిన చెంచయ్యకు
పొద్దుటే పిల్లల ఏడుపులు వినబడ్డాయి .
ఏమయ్యిందో అని వెళ్లి చుస్తే ,
నిద్రపోతున్న పిల్లలను ఒక్కక్కరినే లేపి,
నడ్డి మీద నాలుగు దేబ్బలేసి ఏడిపిస్తున్నాడు పద్మనాభం .
కారణం అడగ్గా,
'బాలానాం రోదనం బలం ' అన్నారు కదా, అందుకే కొడుతున్నా , అన్నాడు . .
'ఆహా, ఏమి పాండిత్యమయ్యా నీది,
ఆ వాక్యానికి అర్ధం అది కాదు,
పూర్తీ శ్లోకం విను,' అంటూ ఇలా వివరించాడు .
"పక్షీణాం బలమాకాశం
మత్స్యానా ముదకం బలం
దుర్బలస్య బలం రాజా
బాలానాం రోదనం బలం "
ఎవరికేది బలమో ఈ శ్లోకం చెబుతోంది .
ఆకాశమే పక్షులకు బలం . ఆపద వస్తే ఆకాశంలోకి యెగిరి తప్పించుకుంటాయి .
అలాగే చేపలకు నీళ్ళు బలం .
బలహీనులను రక్షించడం రాజ ధర్మం కనుక బలహీనులయిన ప్రజలకు రాజే బలం .
చిన్నపిల్లలు తమకు కావలసినవన్నీ ఏడ్చి సాధిస్తారు . ఏడుపే వాళ్ళ ఆయుధం .
ఎంతటి కర్కోటకుడయినా పిల్లల ఏడుపుకి లొంగిపోతాడు కనుక ,
అదే వాళ్లకు శక్తి అన్న అర్ధంలో చెప్పిన శ్లోకం ఇది .
అంతే కాని, ఏడిస్తే పిల్లలకు బలం వస్తుందని కాదు .
పిల్లల ఏడుపుకు లొంగిపోయి వాళ్ళను గారం చేసి చెడగొట్ట వద్దు
అని పెద్దలకు చేసిన హితవు,
అంతర్లీనంగా ఇందులో దాగి ఉంది,
అని వివరించాడు చెంచయ్య . మీకూ తెలిసింది కదూ...

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి