Pages

12, ఏప్రిల్ 2021, సోమవారం

చంటి హాస్యకథ( ఉగాది స్పెషల్)

**********

ఎనిమిదేళ్ళ చంటి కి తలంటి,
కొత్త బట్టలేసి, దేవుడికి దణ్ణం పెట్టించి, 
అమ్మ  ఉగాది పచ్చడి పెట్టి తినమని పంపి
పిండి వంటలకి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుంటోంది . 

చంటి చటుక్కున ఏడుపుతో తిరిగి వచ్చింది..
నాన్న గారాల కూతురు డెందుకు ఎడుస్తోందో అర్థం కాలేదు అమ్మకి.
“ఉగాది పచ్చడి నువ్వు చేస్తే బాగుండేది.
 ఈ మాటు అంతా చేదుగా ఉంది...” అని విషయం చెప్పి మళ్ళీ ఏడవ సాగింది  చంటి.


“పోనీలే, మహా నైవేద్యం అవగానే నీకు  బూర్లు పెడతాను”,
అంది అనునయంగా. 

చంటి ఏడుపు విని పూజ చేసుకుంటున్న మామ్మ గారు బయటికొచ్చి కారణమడిగారు. 

“ఏం లేదండీ,
 చంటికి ఉగాది పచ్చడి కొంచెం చేదుగా ఉందట”,
అని సర్ది చెప్పబోయింది అమ్మ. 

“ఏం కాదు మామ్మా,
పచ్చడి తిన్నపుడు మొదట ఏ టేస్ట్ వస్తుందో,
ఏడాది అంతా అలాగే ఉంటుందని నువ్వేగా చెప్పావ్?” అని కోపంగా అంది  చంటి. 

అవునన్నట్టు మామ్మగారు తల ఊపారు.
“చూడు, నేను చేదుని ఫస్ట్ టేస్ట్ చేశా. నెక్స్ట్ ఇయర్ అంతా చేదే!”
 అని మళ్ళీ ఏడుపు మొదలెటింది . 

ఆవిడ, “ఊరుకోరా వెర్రి తల్లి !
నీకు కాకరకాయంటే ఇష్టం కదూ!
దానివల్ల నీ జీవితమేమీ పాడవలేదుకదా!
ఏదో వేపపువ్వు కానీ ఖర్చు లేకుండా మనింట్లోంచే వచ్చింది
గనుక కాస్త ఎక్కువ వేశాను. 
దానికే ఇంత రాద్ధాంతం చేయాలా?

నీ అమాయకత్వం గానీ,
తలరాతని ఉగాది పచ్చడేం మర్చలేదురా!
ఇంతోటి దీనికోసమా ఇంత ఏడుపు?” అని మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళారు.

ఆవిడన్న మాటలకి ఏదో స్ఫురించిన దానిలా వంటింట్లోకి వెళ్ళి,
అమ్మ చంటితో,
 “పెద్ద వాళ్ళ తిట్లు మనకి ఆశీర్వాదాలు.
అలాగే మామ్మగారు, నాన్నని, అత్తని పెంచి గొప్పవాళ్ళని చేశారు. 

ఆవిడ చేతి పచ్చడి తిని వాళ్ళు ఫస్ట్ రాంక్ తెచ్చుకున్నారు.
అయినా నువ్వు ఏడుస్తున్నావని దీన్ని తీపి చేయమని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను.

ఇప్పుడు చూడు,
దేవుడు పచ్చడిని తీపి చేశాడో, లేదో?”
 అని ఒక గిన్నెలో పచ్చడి పెట్టి చంటికిచ్చింది. 

“అవునమ్మా, దేవుడు దీన్ని తీపి చేశాడు.
 నా నెక్స్ట్ ఇయర్ తియ్యగా ఉంటుందోచ్”,
అని చంటి చకచకా తినేసి, ఆటకి పక్కింటికి వెళ్ళాడు.

 మహానైవేద్యం అయ్యిన తరువాత ఉగాది పచ్చడిని నోట్లో వేసుకున్న మామ్మగారు “ఇదేం చోద్యమే తల్లి!
 ఇంత తియ్యగా ఉంటే చంటిది  చేదని గోల చేసింది ?” అన్నారు. 

“అత్తయ్యా,
మీరన్నట్టు పచ్చడి తలరాతను ఎలాగూ మార్చలేదు కనుక
అందులో డజను అరటిపళ్ళ గుజ్జూ,
పావు కిలో బెల్లమూ కలిపానులెండి.
మరీ ఎక్కువయ్యిందంటారా?”, జవాబిచ్చింది కోడలు . 

“నైవేద్యం పెట్టిన పచ్చట్లోనా నువ్వు మార్పులు చేసింది?”
అని ముక్కు మీద వేలేసుకున్నారావిడ.


8, ఏప్రిల్ 2021, గురువారం

సూర్యుడు చూస్తున్నాడు...

*******************************

'ఎండలు మండిపోతున్నాయి...'
ప్రతి వేసవిలోనూ ప్రతి ఒక్కరూ అనుకునే మాట ఇది. అంతేనా? 

ఏడేళ్ళ పసి వాడు మొదలు,
ఎనభై ఏళ్ళ వృద్ధు వరకూ '
ఇంతలేసి ఎండలు ఎప్పుడూ చూడలేదు'
అనడం కూడా ప్రతి వేసవిలోనూ వినిపిస్తూ ఉంటుంది. 

'నక్క పుట్టి నాలుగు ఆదివారాలు అవ్వలేదు కానీ,
ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అందిట' అని ఓ సామెత. 

గాలివాన మాట ఏమోగానీ, ఎండలకి మాత్రం ఇది తప్పకుండా వర్తించేస్తుంది. 

ఆబాల గోపాలమూ 'హమ్మో ఎంత ఎండా? ఎప్పుడూ చూడనే లేదమ్మా'
అన్న డయిలాగుని నాలుక చివర ఉంచుకునే కాలం వచ్చేసింది.
ఎప్పటి లాగే ఈసారి కూడా ఎండలు గట్టిగానే ఉన్నాయి మరి.


మనింట్లో కరెంట్ పోయినప్పుడు,
పక్క వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతూ,
ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే
 మన హృదయం వెయ్యి ముక్కలు అయితీరుతుంది. 
అలాగే మన ఊళ్ళో మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసినా అదే బాధ. 


ఇన్నాళ్ళూ లోపలి పేజీల్లో ఉండే 'ఉష్ణోగ్రత'లు
ఈ నాలుగు నెలలో న్యూస్ పేపర్ల మొదటి పేజీలోకి వచ్చేస్తాయి 
కాబట్టి, ఉదయాన్నే మనకన్నా వేడిగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి,
చల్లగా ఉన్నవాళ్ళ మీద అసూయ పడొచ్చు. 


ఎండాకాలంలో తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్
లాంటివి తాగుతూ ఉండాలనీ,
వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ
దూరదర్శన్ వాళ్ళు వివరంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. 
ఇప్పుడూ చెబుతూనే ఉండి ఉంటారు కానీ,
కొత్త న్యూస్ చానల్ ఏదో మొదలైన సంరంభంలో
కేబుల్ అబ్బాయి దూరదర్శన్ ని తాత్కాలికంగా పక్కకి తప్పించినట్టు ఉన్నాడు.. 

న్యూస్ ఛానళ్ళు కూడా వార్తలు,
లైవుల మధ్యలో అప్పుడప్పుడూ ఎండల జాగ్రత్తలు చెబుతున్నాయి కానీ,
అవి కూడా మిగిలిన కమర్షియల్స్ లో కలిసిపోతున్నాయి. 
రోజంతా సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చూపించి,
మధ్యలో ఎప్పుడో పాప పరిహారం కోసమా అన్నట్టు
 కొబ్బరి నీళ్ళు తాగండి అని ఓ ముక్క చెప్పడం
 చూసినప్పుడల్లా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. 

వార్తలంటే గుర్తొచ్చింది... 

 పిల్లలకి పరిక్షల హడావిడి ముమ్మరంగా ఉంది. 
 కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తుకి మాంచి భరోసా కనిపిస్తోంది.
 అనుమానం ఉంటే గొప్ప గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు తిరగేయండి.
వాళ్ళల్లో మెజారిటీ లాంతర్ల దగ్గరా, వీధి దీపాల దగ్గరా చదువుకున్న వాళ్ళే.

ఈ పరిక్షలు కాస్తా అయిపోయాయి అంటే,
నెలన్నా తిరక్క ముందే టీవీల్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళ కొత్త డబ్బింగ్ సినిమా విడుదలవుతున్నంత హడావిడి మొదలైపోతుంది. 
అంకెలంటే విరక్తి పుట్టేలా ర్యాంకులు అరిచేస్తూ ఉంటారు, కొన్నాళ్ళ పాటు. 


ఆవకాయ తదాదిగా ఊరగాయలు పెట్టుకునే హడావిడి ఇంకా మొదలవ్వ లేదు. 
ఈసారి మామిడికాయ రావడం కొంచం ఆలస్యం కావొచ్చని మా పక్కవాళ్ళు చెప్పారు. 

మామిడిపళ్ళు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి..
మే నెలలో చాలా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయిట.
కానీ కరోనా పున్య మా అని ఎవ్వరూ పిలవటం లేదు 

  

మండే ఎండలని తట్టుకోడానికి మానసికంగా సిద్ధ పడిపోతే,

ఆ తర్వాత ఇక జల్లులే జల్లులు..
నాలుగు జల్లులు చాలు కదూ ఈ ఎండల బాధ మర్చిపోడానికి...
 తలచుకుంటేనే యెంత హాయిగా ఉందో...
ఎందుకూ ఆలస్యం.. మీరూ తల్చుకోండి..




6, ఏప్రిల్ 2021, మంగళవారం

వేసవి సెలవులు

***********************

వేసవి సెలవులు........... అదొక మదురాతి మధురమైన బాల్య జ్ఞాపకం.

వేసవి సెలవులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు?

అసలు ....సెలవలకి ముందు ఇన్ని పరిక్షలు ఎందుకు పెడతారో? అని తెగ తిట్టుకుంటాను నేను.


పరీక్షలకు  పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటామ చదువు అసలు బుర్ర కెక్కదు.

సెలవుల్లో ఎక్కడికేళ్ళలో ,ఏ మేమి చేయాలో,ఉహించుకోవడం తోనే సరిపోతుంది.

ఎగ్జామ్స్ కి చదువు కోమని నాన్న  పొద్దున్నే లేపుతుంటారు ,

టీ పెట్టి ఇచ్చి చదువుకోమని .. నాన్న అలా వెళ్లడం అల్లస్సమ్ నిద్దర ముంచుకు వచ్చేస్తుంది 

 "అబ్బ-ఇంకేన్నిరోజులని సున్నితంగా విసుక్కుంటూ సగం నిద్ర లోనే ఎన్ని రోజులని మల్లి లేక్కపెట్టుకునే వాళ్ళం.

తియ్యాతియ్యని మామిడి పల్లు ,నోరూరించే కొత్త ఆవయకాయ,పనస పళ్ళు , మామిడికాయ విత్ కారం .........ఇంటి  నిండా చుట్టాలు ..
వీటితో పాటు బోలెడు వేసంగి పనులు ( కొత్తావకాయ , చింత చెట్టు దులపడం ,తాటి ముంజలు ) ఇవన్ని కలిపితేనే వేసవి సెలవులు. 

 పరిక్షలు అవ్వంగానే .....పుస్తకాలు అన్ని బఠాణిలకి సద్దేయడం తోటే వేసవి సెలవుల అసలు హడావిడి మొదలవుతుంది.

  ఇంటి నిండా అన్నలు ,అక్కలు,చెల్లలు,తమ్ముళ్ళ .

  మా ఇంటి చుట్టూ మొక్కలు,చెట్లు పెద్దబావి.పక్కన వేపచేట్టుకి పెద్ద ఉయ్యాలా.

పెద్ద సన్నజాజి పందిరి,మల్లెపూల చెట్లు.ఎన్ని పూలో,కోయలేక ,మాల కట్టలేక మా అమ్మ చేతులు  నొప్పి పుట్టేవి.
ఆవులు,గేదలు.వాటి దూడలు,దొడ్డి నిండా ఎంత సందడో. 
ఆ టైం కి మా ఆవు ఈనింది అనుకొంది ఇంకాఎక్కువ పని ...
జున్ను కూడా ఉంటుంది అనుకొండి 

వేసవి సెలవులంటే మావిడి పళ్ళు ,తాటి ముంజలు,తెగలు,సిమచిన్తకాయలు,.......ఎన్నో.

అమ్మ వండే  పిండి వంటలు,అందరికి కలిపి ఒకే కంచంలో కొత్తావకాయ కలిపి అమ్మపెట్టె చద్దన్నం ముద్దలు.

కొబ్బరి బూరెలు,కారప్పుస,అరిసెలు,ఇంకా ఎన్నో!చిన్ననాటి స్నేహితులు,వారితో ఆడుకునే ఆటలు.

రాత్రిళ్ళు ఆరుబయట పడక,మడత మంచాలు,నవారు మంచాలు,వేసుకొని ఆకాశం వంక చూస్తూ చెప్పుకునే దయ్యాల కధలు, 

మధ్యలో  ఎక్కడికైనా సరదా ప్రయాణం కడితే  రైలు ఎక్కంగానే కిటికీ పక్కన సీట్ కోసం పిల్లల పోట్లాటలు.

మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరుగుతుంది.

పాపం అమ్మలందరూ ఎలా భరిస్తారో ఏమో?రైలు ప్రయాణం ఒక అద్భుతం .

రాత్రి అవ్వంగానే పై బెర్ట్ మిద పడుకోవడం,పొద్దున్నే లేవడం,
దిగినతర్వాట లగేజ్ లెక్కపెట్టుకోవడం,వాటితో పాటు పిల్లలని లెక్కపెట్టడంఆటో,టాక్సీ, కోసం పరుగులు,కులిల అరుపులు,  వారితో బేరాలు,హడావిడే హడావిడి. 

     ఇలా రాసుకుంటూ పొతే ఎన్నెన్నో జ్ఞాపకాలు .

     ఇంతలోనే సెలవులు ఐపోయాయి .

          వేపచెట్టు ఉయ్యాలను గుర్తుతేస్తుంది .వాన చినుకు మట్టి పడవలను గుర్తు తెస్తుంది ,మనసెప్పుడు బాల్యం వైపే పరుగెడుతుంది .అందుకే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనసెప్పుడు పసిదే . 
     




  

30, మార్చి 2021, మంగళవారం

ఆంధ్ర పిత ఆవకాయ

 

"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని అవ్వకి చెప్పు తల్లి .. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు...

" ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన అవ్వవాళ్ల  ఇంటికి పరిగెత్తాను నేను.

 అప్పటికే అత్త వాళ్ళ  ఇంటికి, అమ్మమ్మ  గారి  ఇంటికి రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం.

 ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ తుడిచేసి , ఆరబెట్టేశాను.
 చిన్నపిల్ల నన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి? 

 

నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా.

రోజూ అలా తిరగడానికి ఉండదు కదా!!

అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది.

ఇట్టే వెళ్లి అట్టే అవ్వ గారిని తీసుకొచ్చేశాను. 

వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. 

ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. 

అమ్మ, బామ్మ వరస చూస్తుంటే టీ  కూడా ఉండేలా లేవు.


కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. 

అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. 

పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. 

జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది.

కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని,
 "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ.

అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది.
చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. 

"ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది,"
 బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది. 


నాన్న గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. 

నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. 

అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ,
జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. 

ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. 

పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. 

అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. 

అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది.

 నేనుఒక్కదానినే  అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు. 


కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. 

అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. 

ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. 

"దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా తల్లీ " అంది బామ్మ. 

అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. 

ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. 

ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో  పాటు  బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా తల్లే " అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా. 


నేనెంత తొరగా తుడుస్తున్నా, నాన్న గారు గబాగబా  కోసేస్తున్నారు కదా. 

తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్.

 ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. 

 చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. 

 మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. అవ్వ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. 

 బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది. 


మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. 

అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. 

జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను.

 అప్పటికి నీరెండ పడుతోంది. 

 బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. 

 ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, 

 అవ్వ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. 

 అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు. 


మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. 

ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. 

అంతే, బామ్మకి కోపం వచ్చేసింది.
"దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. 

మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? ????

రాత్రి అన్నంతిన్న నాన్న, కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. 

ఈసారి బామ్మకి కోపం రాలా. 

సాయంత్రం చంటిది  ఉప్పుంది  కానీ, దాని  మోహం దానికేం  తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని.

"రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. 

పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా...
ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క  రాలేదు.

 


ఐ క్నో -ఐ క్నో ( హాస్య కథ)

  (సేకరణ )

గోకవరం సుబ్బారావు ( గో.సు)

 అరుగుమీద ప్రయివేట్లు చెప్తున్న సూన్నాణ మాష్టారి దగ్గరకు  వచ్చి, 

" మాష్టారు! చిన్న సందేహం.

మొన్న పి. యు.టి అంటే put అన్నారు. మరి c.u.t కుట్ అవ్వాలికదా! కట్ అంటున్నారేంటండి?  అని చాలా తెలివిగా ప్రశ్నించానని సంబరపడ్డాడు.


"నీ తలకాయ్! ఇంగ్లీషు వాడు 

ఇలాగే చెప్పేడిచాడు 

నీ వెధవ తెలివి ఉపయోగించి

ఆ ఇంగ్లీషు పరిక్ష చెడదొప్పుకోకు.

మీ నాన్న మా వాడికి నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్పి 

అమెరికా కాకపోయినా , బంగ్లాదేశ్ ఐనా పంపమన్నాడు.

నా పరువు తియ్యకు"..అని తిడుతూ బుర్రబాదుకున్నాడు.

 

బుర్ర గోక్కున్న గో.సు  

మళ్ళీ తన పుస్తకంలో ఐదుపైసల నాణెంలాంటి మొహాన్ని దూర్చాడు.


కాసేపయ్యకా, "మాష్టారండి!

కె ఎన్ ఓ డబ్ల్యు (know)

"క్నో " కదండి! మరి రోజా 

నో అంటోందండి.

 

"సైలెంట్రా   ! సైలెంటు.

నేను సైలెంటు గానే ఉన్నానండి. అల్లరి చేయడం లేదండి". 


"ఒరేయ్! సైలంట్ అన్నది నీ కె.ఎన్. ఓ.డబ్యూ లో 

"కె " నాయన.!"

 నీరసం వచ్చేసింది సూన్నాణ మాష్టారికి.


"ఓహో! అని  అక్షరం అక్షరం  కూడ బలుక్కుని

చదవడం మొదలెట్టాడు.

క్నో కాదు! నో.

క్నాలెడ్జి కాదు! నాలెడ్జి!

 చదవడం మొదలు పెట్టగానే,   'లాఫ్' అనే పదం రాగానే అదెలా చదవాలో తెలియక

నాలికని ఎలా తిప్పాలో తెలియక, లా... అంటుంటే,

పక్కన కూర్చున్న మాష్టారి కూతురు

రోజ "లాఫ్" రా ! మొద్దు అంది. 


"ఎఫ్ లేదు కదే!"  అని మళ్ళీ బుర్ర గోక్కున్నాడు అర్ధం 

గాక.


"ఈ ఇంగ్లీషు ఎవడు కనపెట్టాడబ్బా! అంతా పితలాటకం లా ఉంది.

స్కాటు మాస్టారు వేసే ఏనుగు మెలిక లా.." జుత్తు పీక్కున్నాడు.


గో.సు నాన్న ఆ ఊరి పంచాయితి బోర్డు ప్రెసిడెంట్.

రాజకీయాలతో ఏదైనా సాధించేయవచ్చనే వంద ఆలోచనలు,   వందెకరాలు గల బ్రతక నేర్చిన మోతుబరి.

కొడుకు. గో.సు టెన్తె లో కి వచ్చాడు 

అప్పటి వరకు వాడ్ని అడ్డపెట్టే ధైర్యం ఎవ్వరికి లేక పోవడం వల్ల 

క్లాసులన్నీ  కుక్కదూకుళ్ళు చేసుకుంటూ  'పది' కి వచ్చి పడ్డాడు.


అప్పటి వరకు మాష్టర్లని మేనేజ్ చేసిన ఆంజినేయులికి  టౌన్లౌ టెన్త్ పరిక్ష పెట్టడం

అతనికి నచ్చలేదు.


చాలా హై లెవెల్లో,  మినిష్టర్

లెవెల్లో ట్రైచేసాడు 

సెంటర్ తన పల్లెటూర్లో పెట్టిద్దామని. 


" సూడు! ఆంజినేలు! 

ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఎవ్వారం కాదు.

ఇద్యాశాకా మంత్రి 

కత్తిపూడి కనకం సేత రికమెండేసన్ సేయించినా, పని జరగదు.ఎందుకంటే అన్నీ అయ్యాకా నా దగ్గరకు వచ్చేవు మరి.

మీ ఓణ్ణి ఈ ఏటికి ఇలా కానిచ్చేయమను. ప్యాసయ్యడా! టౌను కాలేజీ మనదే! ఆడికో సీటేయించేత్తాను.

అవలేదనుకో వచ్చే ఏడు 

నాదీ గారంటీ!" ...అని బొజ్జతడుముకుంటూ.

 లంకపుగాకు గుప్పు గుప్పు మని ఊదుకుంటూ కారెక్కేసాడు.


ఆంజినేయులికి బెంగ వచ్చింది. తర్వాత  కోపంవచ్చింది , కాసేపయ్యకా బుర్రలో కొత్త ఆలోచన వచ్చింది.


" మాష్టారు! తమరు ఓపిగ్గా మాఓడ్ని తిట్టో కొట్టో పరిచ్చ పాసు సేయించాల!.

ఆడ్ని ఫారిన్ పంపాలని మా సెడ్డ ఇది! " అన్నాడు. కాలు మీద కాలేసుకుని ఊపుతూ.

సూన్నాణ మాష్టారికి భయం వేసింది. వాడికి చదువు చెప్తే తనకున్నది మర్చి పోతానేమోనని కంగారొచ్చొంది.


తన రిటార్మెంట్ డబ్బులకి నామినేషన్ ఇచ్చానా లేదా జ్ఞాపకం రాలేదు.


తడబడుతు..."మీ వ్యవసాయం,  వ్యాపారాలన్ని చూసుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదండి.

ఒఖ్ఖగాని ఒఖ్ఖ నలుసు కదా! 

ఏం పంపుతారండి ఫారిన్.

అక్కడ ఇక్కడ లాగ ఆదుకోడానికి మీరుండరు కదా!

అదీగాక, తిండానికి ఆవకాయ, కొబ్బరి లౌజు, రాసుకోడానికి

ఆవదం దొరకువుటండి! ఆయ్'" 

అని ఏదో రకంగా పెను ప్రమాదం నుంచి తప్పుకోడానికి ప్రయత్నించాడు.


"అబ్బెబ్బే! మా ఓడు ఏదో రకంగా పదో క్లాసు పాసై 

ఈ ఊరు దాటి ఫారిన్ ఎల్లాల!

నిఖ్ఖచ్చిగా చెప్పి జేబులో చెయ్యిపెట్టాడు. 

మాష్టారు తనకి ఆంజినేయులు డబ్బులు ఇవ్వబోతున్నాడేమో నని,

"అబ్బెబ్బె, తరోత ఇద్దురుగాని!

అంటూంటే,

ముక్కుపొడుం డబ్బా మాష్టారి

చేతిలో పెడుతూ హాచ్! అని తుమ్మాడు.

"పాఠాలు సెప్పాలి!  మా సుబ్బుగాడికి

తప్పదు!  అని విచిత్రంగా  నవ్వి. అవకాశం ఇవ్వకుండా డుబ్ డుబ్ మంటూ బుల్లెట్ లాగించేసాడు. 


మాష్టారికి తింగర వాటం వచ్చేసింది.

'సుబ్బిగాడి చదువు నా చావుకొచ్చిందనుకుంటా' . గాలివానకి అల్లల్లాడిపోతున్న 

ఎండు కొబ్బరాకులా  ఊగుతూ  ఉసూరుమంటూ

ఇంటి దారి పట్టాడు ఆ బక్క ప్రాణి. 

అలా రోజూ మాష్టారింట్లో నే మకాం పెట్టిన గో.సు గాడికి ముప్పొద్దులా 

తిండి కూడా మేప లేక అల్లల్లాడి పోతున్నాడు.

సూణ్ణాణ మాష్టారు.

**

పరిక్షలు మొదలయ్యాయి.

మాష్టారికి గుండెల్లో వంద బుల్లెట్లు పరిగెడుతున్నాయి. గో.సు ని 

సానబెట్టగా  అత్తీసరు మార్కులు వచ్చే వరకు ఫర్వాలేదని పించేడు. ఒక్క ఇంగ్లీషు పరిక్ష రోజున మాత్రం,

మాష్టారి టెన్షన్ తగ్గడానికి పది

మాత్రల్లేసుకుని వాడితో సెంటర్ కి వెళ్ళాడు.


దూరంగా చెట్టుక్రింద నెత్తిమీద గుడ్డేసుకుని కూర్చున్నాడు.


గో.సు ముఖం నిండా వీభూది.

బొట్లు పులుముకున్నాడు. చేతికి తాయత్తులు కట్టుకున్నాడు. డాలు లాంటి అట్ట, కత్తిలాంటి పెన్నుతో 

మాష్టారికి వాడు యుధ్ధానికి వెళ్తున్నట్టు కనిపించింది.

వీడు ఏం చీల్చి చెండాడుతాడో ఆ ఆంగ్ల పేపర్ని అని భయపడ్డాడు.

*

రిజల్ట్స్ వచ్చేరోజున వంద లంఖణాలు చేసిన వాడిలా ఉన్నారు మాష్టారు.

వంద కొబ్బరికాయలు 

ఐనవిల్లి గుళ్ళో మొక్కు కున్నారు.

ఎట్టకేలకు గో.సు కరక్టుగా 35 శాతంతో గట్టెక్కాడు.

కూతురు రోజా స్కూల్ ఫస్టు వచ్చిన ఆనందం కన్న గో.సు 

గాడు ప్యాసవ్వడం గొప్ప ఆనందం వచ్చిందాయనకు.

ఇంటర్లో జాయిన్ అయిన

గో.సు అంతకన్నా ముందుకి వెళ్ళ లేక చతికిల పడిపోయాడు. 

కానీ రాజకీయాల్లో మంచి పట్టు సంపాదించాడు.

**

ఒకరోజు రిటైరై పోయి పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న మాష్టారు 

ఆ వార్త చూసి   స్పృహతప్పిపడిపోయారు.

భార్య కంగారు పడుతూ

ముఖం మీద నీళ్ళు జల్లి 

లేపింది.

"ఏవైందండి!  

నోట మాట రాక, అలా ఉండి పోయాడు. కాసేపయ్యాకా తేరుకుని.

మన గో.సు గాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారుట. 

అంటూ...

ఐ క్నో ! ఐ క్నో. 

అంటూ వెర్రిగా నవ్వాడు.

పెళ్ళం అతనికి పిచ్చి పట్టిందేమోనని కంగారు పడుతోంది ఇప్పటికి.

25, మార్చి 2021, గురువారం

పార్వతీశం ప్రయాణం (2021)-- 1


పార్వతీశం ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో ...

అదే అండి మన నరసింహశాస్త్రి  గారి పార్వతీశం... 

మన వాడు .. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి .. 

వచ్చి  80 సంవత్సరాలు దాటినా మన తెలుగు వారి మనసులో ఉన్న వ్యక్తి ..


నాకు ఒక ఆలోచన వచ్చిందీ ..

ఒక సారి చదువు కోసం ఇంగ్లాండు వెళ్లి వచ్చిన పార్వతీశం ... 

ఇప్పటి రోజులలో మళ్లీ ప్రయాణం కడితే ఎలా ఉంటుందా అని?

ఇంకెందుకూ అల్లస్సం చదవండి ... 

                              ************

"మొగలితుర్రు కాపురస్థుడు  అయిన  వేమూరు పార్వతీశం చాల సంవత్సరాల తరవాత మళ్లి ఒక సారి ఇంగ్లాండు వెళ్లి వద్దాము అని ఆలోచన వచ్చింది .. "

ఈ సారి  ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రయాణం మొదలు పెడతాడు ....


ఒక సారి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి .. 

ఇంతక ముందు చేసిన తప్పులు ఏమీ మళ్లి జరగ కుండా చూసుకోవాలి అని అనుకుని 

ఫ్లైట్ టికెట్స్ అవి  కొనుక్కుని .. 

కావలిసి సామానులు లిస్ట్ ఒకటి సిద్ధం చేసుకుంటాడు!

సామానులు కొనడానికి బజారుకి వెళతాడు ..

ముందుగా .. 

దంత దావనానికి  .. బ్రెష్ , పేస్ట్ . 

స్నానం కి .. సబ్బులు , ఒక టవల్ 

ఒక నాలుగు జతల బట్టలు .. 

కరోనా సమయం కదా .. మల్లి అక్కడ మాస్క్ లు కొనడం ఎందుకు అని 

ఒక నాలుగు నారింజ పండు రంగు మాస్క్ లు ... 

దువ్వెన కొందాం అని అనుకుని ... 

దాని అవసరం పెద్దగా లేదు అని విరమించుకున్నారు .

( వయసు పై బడింది కదా బట్ట తల వచ్చిందీ ) 

కరోనా సమయం లో అక్కడ భోజనం ఇబ్బంది అవుతుందేమో అని 

ఒక ప్రియా ఆవకాయ ,
 MTR సాంబారు పొడి కొనుకుని . 

దూర ప్రయాణం కదా సెల్ ఛార్జింగ్ ఐపోయిన ఉంటుంది అని ఒక పవర్ బ్యాంకు కొనుకుంటారు  .

ఇంకా ఏమీ ఐనా కావాలి అంటే అమెజాన్ లో ఆర్డర్ చేయచ్చు అని ఇంటికి చేరుకుంటారు  .

ఇంటికి వచ్చి మడత కుర్చీ లో కూర్చుని ఉండగా ... ఒక అనుమానం వచ్చింది.....


                                

                                                                         ( ఇంకా ఉంది)

                          **** మీ ఉషగిరిధర్ ****

24, మార్చి 2021, బుధవారం

గాడిద గుడ్డు

 'గాడిద గుడ్డు..' అంటూ ఉంటారు.

 అసలు గాడిద గుడ్డు పెట్టదు కదా! మరి ఎందుకలా అంటారు ? చదవండి . 

అనగనగ ఒక అగ్రహారంలో జోగులు ఉండేవాడు 

జోగులుకి చదువు అబ్బలేదు.
ఆరుశాస్త్రాలలో ఉద్దండులయిన పండితులు ఉన్న అగ్రహారంలో,
ఇరవై ఏళ్ళు వచ్చిన తాను ఒక్కడే, ఇలా చదువు రాక మిగిలిపోవడం అతనికి తలవంపులుగా అనిపించింది .

దూర దేశానికి వెళ్లయినా సరే........
పిలక్కి తాడు కట్టుకుని అయినా సరే.....
( నిద్ర మానుకుని కష్టపడటం అనేందుకు ఈ ఉపమానమ్... నిద్ర పొతే, తూలి , పిలక్కి ఉన్న తాడు వెనక్కి లాగడంతో మెలకువ వస్తుంది కదా...)

 మహా పండితుడయ్యి తిరిగి రావాలని సంకల్పించాడు .

దూర దేశానికి వెళ్లి, ఒక సత్రంలో బస చేసి, తోటి ప్రయాణికుడిని
' అయ్యా! నన్ను ఆరు మాసాల్లో పండితుడిని చెయ్యగల గురువు కావాలి,' అని అడి గాడు .

'ఓ లేకేం, నేను విద్య నేర్పిన శిష్యులు అంతా ఇప్పుడు రాజాస్థానాల్లో కొలువు చెస్తున్నారు. మరి, గురుదక్షిణ ఏమి ఇస్తావ్ ?' అని అడిగాడు ఆ గురువు.

' నా బంగారు మురుగులు ఇస్తాను. గురువర్యా!
వెంటనే నాకు విద్య నేర్పండి,' అంటూ సాష్టాంగ పడ్డాడు జొగులు.

'నీకు శబ్దాలూ, సంధులూ వచ్చునా?'

'వాటిల్తోనే అసలు చిక్కండీ . సంధులూ- సమాసాల జోలికి పోకుండా పండితుడిని కాలేనా?'

'అసలు వాటితో అవసరం లేకుండా పండితుడిని చెయ్యడమే నా ప్రత్యెకత.

శత శ్లోకేన పండితః ' అన్నారు పెద్దలు.
అంటే వంద శ్లోకాలు నేర్చినవాడు పండితుడు అవుతాడని శాస్త్రమ్...


"గురువుగారు, మరీ వంద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం .
కాసిన్ని శ్లోకాలు తగ్గిస్తే పండితులు కాలేరా?" దీనంగా అడిగాడు జోగులు .


" తగ్గకేమి? చతుః శ్లోకేన పండితః " , అన్నారు శాకటాయనుల వారు.
అంటే, నోటికి నాలుగు శ్లోకాలు వచ్చిన వాడు కూడా పండితుడే,"


"అయితే, నాకు నెలకు ఒక శ్లోకం చప్పున నాలుగు నెలలకు నాలుగు శ్లోకాలు చెప్తే చాలు,"
అంటూ మురిసిపోయి, విద్యాభ్యాసం మొదలెట్టాడు జోగులు .


నాలుగు నెలల తర్వాత గురువుగారు 'పండితుడివయి పోయావు, ఇక నీకు తిరుగు లేదు పో,' అంటూ సెలవిచ్చారు.
వెంటనే జోగులు తన వేలికున్న బంగారు ఉంగరం అమ్మి, కాశ్మీరు శాలువా భుజాల నిండుగా కప్పుకుని, కళ్ళు ఎగరేస్తూ, దర్జాగా అడుగులేస్తూ ఇంటి ముఖం పట్టాడు .


దారిలో అతడికి ఒక చచ్చిన గాడిద కనిపించింది .
'అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్ .. ' అంటూ తను నేర్చుకున్న మొదటి శ్లోకం గుర్తుకు వచ్చింది . 

వెంటనే ఒక తాడు తీసుకుని, గాడిద మెడకు కట్టి, ఈడ్చుకుని వెల్లసాగాడు . 

అది చాలా బరువుగా ఉండడంతో ఈడ్చలేక ఆయాసపడ సాగాడు .


వెంటనే రెండవ శ్లోకం గుర్తుకు వచ్చింది . "సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్..." 

అంటే, శరీరం అంతటిలో తలే ముఖ్యమయినది .

 కనుక, రంపం లాంటి కొమ్మ తీసుకుని, గాడిద తల నరికి దాన్ని తీసుకు పోసాగాడు . 

కాసేపటికి అది కూడా బరువు అనిపించింది .


అప్పుడు మూడవ శ్లోకం గుర్తుకు వచ్చింది . 

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం ...' 

అన్ని ఇంద్రియాల కంటే కళ్ళే ముఖ్యమయినవి. 

వెంటనే, సన్నటి వెదురు బద్దతో గాడిద కన్ను గుడ్డు పెకిలించి, అది చేతిలో పెట్టుకు వెళ్ళసాగాడు . దారిలో ఒక పలివెల అనే దేశం వచ్చింది . ఆ దేశపు రాజు పండిత ప్రియుడు అని విని, రాజు వద్ద తన పాండిత్యం ప్రదర్శించాలని అనుకున్నాడు .

అప్పుడు జోగులుకి నాలుగోవ శ్లోకం గుర్తుకు వచ్చింది . 

' రిక్తహస్తేన నో పెయాట్ రాజానం దైవతం గురుమ్... ', 

రాజును, దైవాన్ని, గురువును, వట్టి చేతులతో దర్శించకూడదు . 

ఏదో వొకటి ఇవ్వాలి, అనుకుని, రాజు వద్దకు వెళ్లి, తన చేతిలో ఉన్న గాడిద గుడ్డును ఇచ్చాడు .


ఆ వింత వస్తువును చూసి, బెదిరిన రాజు జోగులుకి బాగా దేహశుద్ధి చెయ్యమని, నౌకర్లకు ఆజ్ఞాపించాడు . 

తాను ఇంత శ్రమ పడి నేర్చిన పాండిత్యం, గాడిద గుడ్డు వల్ల వికటించిందని గొల్లుమన్నాడు జోగులు .

అదండీ సంగతి, గాడిద గుడ్డంటే , గాడిద కన్ను గుడ్డు అన్నమాట .