Pages

19, జనవరి 2021, మంగళవారం

ఆదివారం దింపు ... భూషణం కొట్టి ఇచ్చిన బొండం

ఆ రోజు ఆదివారం ...నాన్న పోద్దిన్నే అమ్మ తో ఈరోజు దింపు ఉంది ..నలుగురు భోజనానికి ఉంటారు అని చెప్పి తోటలోకి వెళ్లారు . 

అది స్థంభం పక్కన ఉన్న నేను విని ... పరిగెత్తుకు వెల్లి మా అన్న తో . తమ్ముడు తో చెప్పాను . 

మా ముగ్గురికి దింపు  అంటే బలే సరదా .. గబగబా చద్దన్నం తినేసి తోట లోకి పరుగు అందుకున్నాము .

నేను భూషణం ఉన్న చెట్లు దగ్గరకి వెళ్ళాను (మా మామ్మ  భూషిగాడు అనే వారు .. పెద్ద వాలు కదా .. నేను చిన్న  పిల్లని  అలా అన కూడదు అని అమ్మ చెప్పింది) 

భూషణం  తన నడుము చుట్టూ పెట్టుకున్న పెద్ద బెల్టుకి తగిలించిన బంధం తీసుకుని జాగ్రత్తగా తన రెండు కాళ్ళకీ వేసుకున్నాడు. 

మరో పట్టీ తీసుకుని దానిని తన నడుము చుట్టూ తిప్పుకుని, కొబ్బరిచెట్టు చుట్టూ తిప్పి ముడేశాడు. బెల్ట్ కి కత్తి ఉంది. 

పట్టీ నెమ్మది నెమ్మదిగా పైకి జరుపుకుంటూ, బంధం వేసుకున్న కాళ్ళతో మెల్ల మెల్లగా చెట్టు పైపైకి ఎక్కుతున్నాడు.నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి, చెట్టు చివర ఆగాడు భూషణం.

 అబ్బా... మెడ నొప్పెడుతోంది. కానీ చూడకపోతే ఎలా, ఒకవేళ భూషణం గబుక్కున జారుతున్నాడనుకో గట్టిగా అరిచి జాగ్రత్త చెప్పొద్దూ. 

ఇంకో నలుగురు దింపు వాళ్ళు కూడా చెట్ల మీద ఉన్నారు కానీ, నేనెప్పుడూ భూషణం వెనకాలే తిరుగుతాను.

 కొబ్బరి తోటలో దింపు తీయిస్తున్నామంటే నాన్నలతో పాటు నేనూ ఉండాల్సిందే. 

దింపు వాళ్ళు తిరిగి నిచ్చెన మీదకి వచ్చే వరకూ ఆగి, అప్పుడు వెళ్ళాలి చెట్టు కిందకి. 

ఒక్కో చేత్తో ఒక్క కాయకన్నా ఎక్కువ పట్టుకోలేం.

 నాన్నయితే రెండేసీ, మూడేసీ పట్టుకుంటారనుకో.....

కానీ ఒక్కో కాయా ఎంత బరువుంటుందో.

 ఆ ముచిక చుట్టూ బిగించి పట్టుకోవడంలో అరిచేతులు ఎర్రగా అయిపోతాయి కూడాను.

 వాటిని తీసుకు వచ్చి మండువాలో వెయ్యాలి.

కాయలొకటేనా? అడ్డుగా ఉన్నఎండు కొబ్బరాకులు, డొలకలు ఇంకా దెయ్యపు తొట్లూ కూడా కత్తితో కొట్టేస్తారు కదా. 

అవన్నీ కూడా కింద పడతాయి. 

జాగ్రత్తగా కొబ్బరికాయలో రాశి, డొలకలొకటి, ఆకులొకటి, ఇలా వేరువేరుగా రాశులు పొయ్యాలి. 

మనం ఒక్కళ్ళమే కాదులే. 

దింపు తీస్తున్నారంటే ఇద్దరో ముగ్గురో అప్పటికప్పుడు వచ్చేసి, పని సాయం చేసేసి వెళ్తూ వెళ్తూ డొలకలో, ఒకటో రెండో కాయలో నాన్నని  అడిగి పట్టుకెడతారు. 

ఆకులు మనం మోయ్యలేం. డొలకలేమో కొంచం మట్టిగా ఉంటాయి. అందుకని కాయలైతే కొంచం బరువైనా పని సులువన్నమాట. 

భూషణానికి నేనంటే ముద్దు.

 అలా ఎండల్లో నేను కాయలు మొయ్యడం తనకి నచ్చేది కాదు. నేను ఎర్రగా అయిపోయిన చేతులు మధ్యమధ్యలో ఊదుకుంటుంటే చూసి, "మీరలా కూకోండి అమ్మాయిగారు .. శానామందున్నారు కదా" అనేవాడు ప్రేమగా. 

కానీ కాయలు మొయ్యకపోతే తోటలో ఉండడానికి ఉండదు, 

ఇంట్లోకి వెళ్లి చదువుకోవాలి. 

అప్పుడు భూషణం వాళ్ళూ చెప్పే కబుర్లు వినడానికి ఉండదు.

 ఇంట్లోకి వినిపించవు కదా మరి. 

ఇంకో కారణం కూడా ఉంది కానీ, అది తర్వాత చెబుతాను.

 భూషణం వాళ్ళూ రోజూ ఎక్కడో అక్కడికి దింపుకి వెళ్తారు. దింపు అయ్యాక పడ్డ కాయల్ని బట్టి వందకిన్ని అని కాయలో, డబ్బులో తీసుకుంటారు. 

దింపుకెళ్ళిన ఊళ్లలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో భూషణం చెబుతూంటే వినాలంతే.

 తను నాన్న కన్నా పెద్దవాడు కబుర్లు మొదలు పెట్టాడంటే మాత్రం నా అంత చిన్న పిల్ల అయిపోతాడు . 

ఏ ఊళ్ళో ఎవరికి ఎన్నెన్ని కాయలు పడ్డాయో, ఎవరి కొబ్బరికాయల రాశిలోకి ఎంత పెద్ద పామొచ్చిందో చెప్పేవాడు

 "ఈ భూషణం కబుర్ల పోగు. పని తెవల్చడు" అని  నాన్న తిట్టుకునే వాళ్ళు కానీ, పైకేమీ అనేవాళ్ళు కాదు. దింపు వాళ్ళందరికీ భూషణమే పెద్ద మరి. 

మామూలు చెట్లు ఎవరన్నా ఎక్కేవాళ్ళు కానీ, ముచ్చెట్లు మాత్రం భూషణానికే వదిలేసేవాళ్ళు. 

మామూలు కొబ్బరి చెట్టు కన్నా రెట్టింపు పొడుగుండే ముచ్చెట్లు కొబ్బరి చెట్లలో ముసలివన్నమాట. 

అలా ఎక్కుతూ ఎక్కుతూ నలకలా అయి, మాయమై పోయేవాడు భూషణం. ముచ్చెట్టు ఎక్కితే పైనుంచి తన గొంతు కూడా వినిపించేది కాదు. 

ముచ్చెట్లే కాదు, 'నా చెట్టు' కూడా భూషణమే ఎక్కేవాడు. !!

నా చెట్టు అంటే నేను పాతిన మొక్క పెరిగి పెద్దై, చెట్టయ్యిందని కాదు. 

ఆ చెట్టు బొండాలు చాలా బాగుంటాయి. మిగిలిన బొండాల కన్నా ఆ బొండాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం. 

ఈ రహస్యం తెలుసు భూషణానికి. ఇంకో రహస్యం కూడా ఉంది మా ఇద్దరికీ. తనా చెట్టు ఎక్కుతుంటే నేను "భూషణం, బొండము తియ్యవూ" అని అడగాలి. 

 నేనిలా అడగ్గానే "పిల్లలికి  నాలుగు బొండాలు తియ్యరా" అన్న నాన్న ఆర్డరూ, నాన్న తోటలో ఏమూల ఉన్నా వినిపించేవి. 

అప్పటికే కాయలు చేరేసీ, చేరేసీ అలిసిపోయే వాళ్ళం , 

బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, తాగడానికి రెడీ అయిపోయే వాళ్ళం మేము ముగ్గురం  .

 తనే చెలిగి, కొట్టి ఇచ్చేవాడు భూషణం. 

నీళ్లన్నీ తాగాక, బొండాన్ని రెండు ముక్కలు చేసిచ్చేవాడు, మీగడ తినడానికి వీలుగా.

 "ఇంకోటి కొట్టమంటారా?" తనెంత మెల్లిగా అడిగినా,  నాన్నకో వినపడిపోయేది. 

"అక్కర్లేదు. వాళ్ళు ఇంక  అన్నం తినరు .. మిగిలినవి నూతిలో పడేయ్.. రేపు కొట్టిద్దాం" 

అనేసేవాళ్ళు. 

అక్కడితో దింపు వదిలేసి మేము ఇంట్లోకి పరిగెత్తే  వాళ్ళం , మా  పని అయిపోయినట్టే కదా మరి. 

 బొండం కొట్టిస్తూ భూషణం ఎప్పుడూ ఒకటే మాట అడిగేవాడు.... "పెద్దోరయ్యాక నన్ను గుర్తెట్టుకుంటారా ?" .....అని 

ఇప్పుడు భూషణం లేడు ...  కానీ ఊరు వెల్లినప్పుడు నాన్న  ఆ కొబ్బరి చెట్ట బొండాలు కొట్టిస్తారు.. వాటి రుచి మాత్రం ఏమి మారలేదు .






                                లోక సమస్త సుఖినో భవంతు

                                   **** మీ ఉషగిరిధర్ ****

16, జనవరి 2021, శనివారం

ముగిశాయి సంక్రాంతి సంబరాలు

 పసుపు పులిమిన గడపల పవిత్రత

సన్నాయి గీతాలు తెచ్చిన ప్రశాంతత

రంగవల్లుల తో వచ్చిన రమణీయత 

ధూప దీపాల వలన వచ్చిన సుందరత

తోరణాల తో వచ్చిన  స్వచ్ఛత తో  వెలిగిన మా లోగిలి


పట్టుచీరలు, కొత్తనగల పరిచయాలతో

వంటింట్లో యుద్ధ సరాగలతో

తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో

కలలు పండుతాయన్న ఆకాంక్షలతో

అందరి కష్టాలు తీరుతాయన్న ఆశలతో


అందుకు సాక్షిగా పండిన మానోళ్ళతో

మా ఇంట ముగిశాయి సంక్రాంతి  సంబరాలు 


                                        లోక సమస్త సుఖినో భవంతు

                                              ** మీ ఉషగిరిధర్ **

14, జనవరి 2021, గురువారం

సంక్రాంతి శుభాకాంక్షలు

మార్గశిరం ముగిసింది 

పుష్యమి  పురుడు పోసుకుంది

ధనుర్మాసం ధాన్యలక్ష్మిని ఇచ్చింది.

పండగ పరిమళం పొగమంచులా కమ్మేస్తోంది

సంక్రాంతి సూర్యుడు గమనం మార్చి గోరువెచ్చని కిరణాలతో

తెలుగువారి లోగిళ్లలో నులివెచ్చని అనుభూతిని అందిస్తున్నాడు!


అందుకే అన్నారు.

మకర సంక్రమణం

మధురానుభూతుల సమ్మేళనం అని !


అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు



                        సర్వేజనాః సుఖినోభవంతు

                            **** మీ ఉషగిరిధర్ ****

13, జనవరి 2021, బుధవారం

భోగి శుభాకాంక్షలు



అగ్ని దేవుని ప్రార్థన జేసి భోగి మంట రాజేసిన  పెద్దలకు  
రంగవల్లులు, గొబ్బెమ్మలు  పెట్టిన అక్కాచెలెళ్లుకు 
బోగి దండలతో , గాలి పటాలతో  సందడి చేసిన అన్నదమ్ములకు 


శ్రీమద్రమణ గోవిందో హరంటూ వచ్చిన  హరిదాసులుకు 
అయ్యవారికి దండం బెట్టంటు వచ్చిన  గంగిరెద్దులోళ్లూకు

కొత్త ధాన్యపు బస్తాల బండ్లతో ఇళ్ల్లకు చేర్చిన రైతులకు 

"వానల్లు కురియలి 
వరి చెను పండాలి 
మా దాసు దంచాలి 
మా అమ్మ వండాలి 
మా కడుపు నిండాలి ...బుడుగో బుడుగు "
అని పాటలు పాడిన పిల్లలకి  

అందరికి  భోగి  శుభాకాంక్షలు 






                                            లోక సమస్త సుఖినో భవంతు
                                            ***** మీ ఉషగిరిధర్ *****

12, జనవరి 2021, మంగళవారం

జగ్గన్న తోటకు పోదామా రుద్రులు వస్తున్నారు ...


కోనసీమ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి తోట ... 

అలాంటి కొబ్బరి తోటలో మన దేశ ప్రధాని మెచ్చిన ఒక తీర్థం  ...

అదే  అండి జగ్గన్నతోట ప్రభల తీర్థం.

సంక్రాంతి వస్తోంది కదా ఇంక మా కోనసీమ లో సందడి మాములుగా ఉండదు 

బోగి మంటలు  --- పిండి వంటలు 

ముగ్గులు --- గోబిల్లు 

వీటితో పాటు  జగ్గన్నతోట ప్రభల తీర్థం.కనుమనాడు ఈ ప్రభల తీర్థం జరుగుతుంది .

ఇక్కడ తోటే గుడి ..  ప్రభలే రుద్రులు .

ఏకాదశ రుద్రులు 11 ప్రభలు గా దర్శనం ఇస్తారు . 

1. గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

2. గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

3. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

4. ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

5. వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

6. పెదపూడి – మేనకేశ్వరస్వామి

7. ముక్కామల – రాఘవేశ్వర స్వామి

8. మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

9. నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

10. పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

11. పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి


కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాల ప్రజలు  ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు

ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు. 




యావత్ కోనసీమ వాసులందరికీ జగ్గన్నతోట ప్రభల తీర్థం ముందుగానే ఆహ్వానం పలుకుతోంది....

సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు........

                                 సర్వేజనాః సుఖినోభవంతు

                                **** మీ ఉషగిరిధర్ ****



 

 




ఏకాదశ రుద్రులు


ఏకాదశ రుద్రులు:
శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. 

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః"

అని రుద్రనమకంలో చెప్పబడినది. 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి. 

1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3.త్ర్యంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి 

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు. వాటి వివరాలు మనంతెలుసుకుందాము.

1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనముకలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 

3. త్ర్యంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.  

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను.  రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.
పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు. 

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మిగ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి): 
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించివిష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
 
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.


                                    లోక సమస్త సుఖినో భవంతు
                                        **** మీ ఉషగిరిధర్ ****

11, జనవరి 2021, సోమవారం

గృహంలో అలక

గృహంలో అలక
=============

ఏమిటి అలక గృహం  అనకుండా గృహంలో అలక అంటున్నాను అనుకుంటున్నారా..నిజమేనండి....
గత 10 నెలల నుంచి మా గృహంలో అన్ని అలక పూనాయి

లంచ్ బాక్స్ ====  అలిగి అటక ఎక్కింది
ఐరన్ బాక్స్ ====   అలిగి మూల కూర్చుంది
వాచ్              ====   అలిగి తిరగడమే మానేసింది⌚
షూస్             ==== అలిగి దుమ్ము దుప్పటి కప్పుకుని మూల కూర్చున్నాయి.
పెర్ఫ్యూమ్, ఫేస్ క్రీమ్స్   ==== అలిగి ఎక్కడికో వెలిపోయాయి

ఇలా కోన్ని వాడక అలిగితే...
 కోన్ని వాడకం ఎక్కువై అలిగాయి...

వాటిలో  వాషింగ్ మెషిన్ , సోఫా,టీవీ   ...
వంటిల్లు అయితే మరీ  అలిగింది బాగా ఎక్కువగా వాడుతున్నాను అని 

ఇన్ని అలకల మధ్య నాకు అలక వచ్చినా అలగ లేక పోతున్నాను....😟😟😟

ఈ అలకలు అన్ని ఎప్పటికి తీరే్నో...

ఇది చదివి మీరు అలగ కండి ప్లీజ్ ...😝😝😝



                                            లోక సమస్త సుఖినో భవంతు
                                        ******* మీ ఉషగిరిధర్ ***********