Pages

25, జనవరి 2021, సోమవారం

కృష్టుని మేలు కొలుపులు

 

1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన  వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల  కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది  శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము  నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు  గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార  గోపాలబాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహ లోచన మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


8. వామన రూపమున భూదాన మడిగిన పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన కశ్యప నందనా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది పొడచూతువుగాని మేలుకో || కృష్ణ తెల్లవారవచ్చేను ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


12. దామోదరా యని దేవతలందరు దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ నాదరించిన దేవ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ దర్భశయన వేగ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి వందన మొసగెద మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు మురళీనాదవినోద మేలుకో || కృష్ణా  తెల్లవారవచ్చేను||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు వనమాలికాధర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార కంససంహరణా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె గోపాల బాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


         


హరా కృష్ణ హరా కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

                                           



అతిరథ మహారథులు..అంటే..ఎవరు?

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. 

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం 

మనకు అర్థమవుతుంది. 

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. 

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.


1) రథి..ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు ---------------------వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు--------------.వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు)....7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.


రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు ---------------వీరంతా..మహారథులు.


4) అతి మహారథి (మహారథికి 12రెట్లు)...86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.


ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు ----------------వీరు..అతి మహారథులు.


రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు - 

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) ...ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.


బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 

దుర్గా దేవి, 

గణపతి మరియు 

సుబ్రహ్మణ్య స్వామి, -----------------వీరంతా..మహామహారథులు.




                                                          🙏🙏🙏🙏🙏


                                      జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 

" బద్ధకం..."

 "నాక్కొంచం బద్ధకం..." ఏదో ఒక సందర్భంలో ఈ మాట  అనని వాళ్ళు ఎవరూ ఉండరేమో కదా.. 

నావరకైతే మరీ తరచూ కాదు కానీ, అప్పుడప్పుడన్నా ఉపయోగిస్తూ ఉంటాను. 

బద్ధకం గొప్పదనం ఏమిటంటే ఇది మన దిన చర్యతో పాటే మొదలవుతుంది. 

చక్కగా ఉదయాన్నే లేవాలనుకుంటామా? మెలకువ రాగానే "

ఒక్క పది నిమిషాలు పడుకుని అప్పుడు లేద్దాం.....😴😴😴.....

ఈలోగా ప్రపంచం ఏమీ తలక్రిందులు అయిపోదు కదా.." అని అ శరీరవాణి చెబుతుంది. 

ఎప్పుడూ ఎవరి మాటా వినని వాళ్ళు కూడా ఈ మాటలు బుద్ధిగా వింటారు.

అది మొదలు మనం చేయాల్సిన ప్రతి పనినీ కాసేపైనా వాయిదా వేసేస్తూ ఉంటాం, 

కేవలం బద్ధకం వల్ల.

 అలా అని ఆ పని చేయడం ఏమన్నా తప్పుతుందా? ఆంటే అదీ లేదు.!!!!!!!

ఎందుకంటే అది మన జన్మ హక్కు. 

బద్ధకించినందుకు గాను ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లిస్తూనే ఉంటామా..

అయినా కూడా బద్దకించడం మానం. అలా అలవాటైపోతుందన్న మాట.😞😞

ఉదాహరణకి, చిన్నప్పుడు బళ్ళో మేష్టారు, ఇంట్లో పెద్దోళ్ళు

 "ఎప్పటి పాఠాలు అప్పుడు చదివేసుకోండి.." అని మన చెవుల్లో బంగ్లాలు కట్టుకుని మరీ చెప్పినా మనం విన్నామా? లేదు..📚📚📚

 పరీక్షలప్పుడు బుద్ధిగా నైటౌట్లు చేసి, మనం టెన్షన్ పడి, వాళ్ళని టెన్షన్ పెట్టి, కాలక్రమేనా వాళ్ళని ఇలాంటి టెన్షన్లకి అలవాటు చేసి మన చదువు పూర్తి చేశాం. 

"మేమిలా అస్సలు చెయ్యలేదు" అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అత్యంత బుద్ధిమంతులైనా అవ్వాలి లేక అతిపెద్ద అబద్ధాలకోరులైనా అవ్వాలి. 

ఇప్పుడు మళ్ళీ పిల్లలకి హితబోధలు చేయడానికి మనం అస్సలు మొహమాట పడం, అది వేరే విషయం.

నావరకు నేను కొన్ని విషయాల్లో అస్సలు బద్ధకించను.

 కాఫీ, టిఫిన్, బోయినం.. ఇలాటి విషయాల్లో అన్నమాట. ☕🍛🍛🍕

మన బద్ధకం కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అయితే ఇంక మన గొప్పదనం ఏముంది??????

 కాబట్టి, ఆఫీసు పనిలో కూడా మనం బద్ధకిస్తూనే ఉంటాం. 

అది మన హక్కు$$$$$

 అయినా చెప్పిన పని వెంటనే చేసేస్తే, ఆ వెనుకే మరో పని వెతుక్కుంటూ వచ్చేయదూ?? ????????

అయితే ఇలా బద్దకించి పని వాయిదా వేయగలిగే అదృష్టం అందరికీ ఉండదు.

బద్ధకం కేవలం మనుషులకి మాత్రమే కాదు@@@@@@@

 జంతువులకీ, వస్తువులకీ కూడా సహజమే. 

ముఖ్యంగా పెంపుడు జంతువులకి ఉండే బద్ధకం వాటిని పెంచే వాళ్ళకే తెలుస్తుంది. 

వస్తువుల విషయానికి వస్తే, కొంచం వయసైపోయిన టీవీ ఆన్ చేయగానే దృశ్యం చూపించకుండా కాస్త నెమ్మదిగా ఆ పని చేస్తుంది. 

పాత కారు, ఫ్రిజ్జు.. ఏదైనా సరే.. ఇదే పరిస్థితి దాదాపుగా. 

ఈ పోస్ట్  రాద్దామని నేను మూడు రోజులుగా బద్దకించి వాయిదా వేస్తున్నాను. ....




**అందుకే అన్నారు 
జీవితం లో భయాన్ని మించిన శత్రువు
బద్ధకాన్ని మించిన అపకారి 
ఎవరూ ఉండరు అని**



                                  లోక సమస్త సుఖినో భవంతు

                                  **** మీ ఉషగిరిధర్ ****


24, జనవరి 2021, ఆదివారం

మార్నింగ్ వాక్ తెచ్చిపెట్టిన తంటాలు

ఈ రోజు ఆదివారం కదా అని పొద్దున్నే సరదాగా మా వీధిలో ఉన్న వనస్థలి (park) కి వెళ్లాను...

వెళ్ళిన దానిని నా వాకింగ్  నేను చేసుకోకుండా 

అక్కడ ఎవరో  కొందరు కూర్చుని ఏదో వ్యాయామం చేస్తుంటే చూద్దామని దగ్గరికి వెళ్ళా....

 ఈమధ్య మా వనస్థలి లో  కొన్ని వ్యాయామ పరికరాలు కొత్తగా పెట్టారట ..

 వాళ్ళందరూ వాటిని చేస్తున్నారు అని నాకు అర్థం అయింది .

కొంచెం దగ్గరికి వెళ్లి చూద్దామని వెళ్ళాను ...

అక్కడ వాళ్లు కింద కూర్చుని ఒక పెద్ద చక్రం లాంటిది దాన్ని చేత్తో తిప్పుతున్నారు....చూడడానికి మన ఇంట్లో రొలు లా ఉంది

 ఇంకొంచెం ముందుకు వెళితే కొంతమంది పెద్ద కర్ర లాంటి దాన్ని చేత్తో తిప్పుతున్నారు

చూడడానికి మన మజ్జిగ కవ్వ లా ఉంది...

అన్నీ నాకు తెలిసిన వస్తువు లేకదాన్ని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను

 ఇంటికి వచ్చి అత్యుత్సాహంతో  మిక్సీ మీద ఒక కవర్ కప్పి ...తులసి కోట దగ్గర ఉన్న రోలు ని వంటింట్లోకి తీసుకువచ్చి శుభ్రంగా కడిగాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు   రోటిలో నూరాను.....

హ్యాండ్ బ్లెండర్  అట్టపెట్టెలో పెట్టేసి మజ్జిగ కవ్వంతో వెన్న తీశాను....

అందరినీ చూసి ఏదో ఉత్సాహంతో చేసాను కానీ కొద్దిసేపటికే భుజంనొప్పి మొదలైంది....😢😢😢😢

 పైకి చెప్తే ఏమంటారో అని భయంతో కుక్కిన పేనులా భుజానికి ముందు రాసుకున్నాను

మాట్లాడకుండా మిక్సీ మీద కవర్ తీసేసి కవ్వం అటక మీద పెట్టేసాను

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది నా పరిస్థితి..


                    లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****

22, జనవరి 2021, శుక్రవారం

వంకాయ తో వెంకాయమ్మ గారి ముచ్చట్లు

వంకాయ : వెంకాయమ్మ గారు ఎలా ఉన్నారు 

వెంకాయమ్మ గారు :ఆ వంకాయ రా రా  ... నేను బాగున్నాను . నువ్వు ఎలా ఉన్నావు .

వంకాయ :ఏదో ఇలా ఉన్నాను అండి ..

వెంకాయమ్మ గారు : అది ఏమిటి అలా అంటావు ... ఎన్ని తరాలు మారిన .. ఎన్ని  కొత్త రకాలు వచ్చిన నీకు ఆదరణ ఏమాత్రం తగ్గ లేదు కదా ....

వంకాయ : ఏమి ఆధరణ లేండి ... మీ రోజులలో ఐతే చక్కగా 

చిన్న వంకాయల తో : వంకాయ కారం పెట్టి కూర, వంకాయ కొత్తి మీరి కారం కూర, వంకాయ వేపుడు ,వంకాయ బజ్జి (అమలాపురం లో చాల ఫేమస్ )

తెల్ల వంకాయల తో : వంకాయ జీడి పప్పు  ముద్ద  కూర,వంకాయ  చిక్కుడుకాయ ముద్ద  కూర,వంకాయ  పనస గింజలు ముద్ద  కూర,వంకాయ  శనగలు ముద్ద  కూర ...

పెద్ద వంకాయ తో : వంకాయ  ముద్ద పచ్చడి ,వంకాయ  పెరుగు పచ్చడి 

ఇలా ఎన్నో రకాలు  వండేవారు .... 

 కానీ ఇప్పటివాళ్లు ఇంత ఉల్లి ముద్దో, మషాలా ముద్దో నా పొట్ట లో కూరి ... 

ఏమిటో రక రకాలు వండుతున్నారు ... పోనీ పిల్లలు కదా అని అనుకుందామా అంటే .. 

కంచంలో కూర అంతా తినేసి ..ఈ వంకాయ లో ఏమి ఉంది బలం ..అని వెలిపోతున్నారు.

ఆ ఆఖరి మాట వింటుంటే గుండెలో చివుక్కు మంటోంది .. 

వెంకాయమ్మ గారు :పోనిలే చిన్న పిల్లలు  వాళ్లే తెలుసు కుంటారు

 మషాలా వద్దు ...ముద్ద కూర ముద్దు అని 

నువ్వు ఏమి బాధపడకు 

వంకాయ : మీ మాట చలవ ...అలా జరిగితే ఎంత బాగుంటుందో .. 

నేను వెళ్లి వస్తాను .. పక్క వీధిలో శర్మ గారు వాళ్ల అమ్మాయి పెళ్లికి వచ్చాను 

అని వంకాయ వెళ్ళిపోఇంది .!!!!!!!!!!!!!!!!!!!!!


ఈ లోపు విధి లొంచి వెంకయ్య గారు ... 

చేతిలో  ఒక  సంచీలో  వంకాయ  లు తెస్తూ  ... 

వెంకాయమ్మ ఏమి వండావు ఇవాళ అని అడిగారు !!

వంకాయ కూర అన్నారు వెంకాయమ్మ గారు.

అలా వెంకయ్య గారు,వెంకాయమ్మ గారు ....

వంకాయ కూర తో భోజనం ముగించారు ....



                         లోక సమస్త సుఖినో భవంతు

                       **** మీ ఉషగిరిధర్ ****

21, జనవరి 2021, గురువారం

ఎక్కాల పుస్తకం

 

మీకు ఈ  రోజు ఒక కథ చెపుతాను 

కథ అంటే పెద్దబాలశిక్ష  అంత పెద్దది కాదు 

ఎక్కాల పుస్తకం  అంత  చిన్నదే !!!!!

'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు. 

ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం.

 ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది. 

చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. 😢😢😢

చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది. 

అమ్మ  బాలశిక్ష నేర్పించి, నాన్న బళ్ళో చెరిపించారు . 

 మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ. 

తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది. 

అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?

అమ్మ వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి. 

మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది.

 ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు. 

తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను. 

దిగితేనే కదా లోతు తెలిసేది!!!!

ఒక రెండు రెండు...
రెండ్రెళ్ళు నాలుగు..
 మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు. 

ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు.

 ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యమన్నారు'  ఎక్కడివరకు వచ్చిందో అడిగి, 

ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.

సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు. 

తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు. 

పన్నెండైదులు అరవై  వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది. 

నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.

అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు. 

ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది.. 

'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం. 

ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..

నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి  

ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల గాలి లో విదిలించేవారు....

 తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి. 

రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు. 

ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.

రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి. 

ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. 😢😢😢😢

పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. !!!!!!!!!!!

నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. 13❌13 = ?

పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి.. 

నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.

దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది. 

సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది. 

చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే దానిని . పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, 14❌13 = ? 

పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను.  16❌13 = ?

గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.

కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక.

 అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు.

అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది.

 మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. 

తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?


                                                లోక సమస్త సుఖినో భవంతు

                                                  **** మీ ఉషగిరిధర్ ****


20, జనవరి 2021, బుధవారం

కుంటి "స "....మెలిక "శ"

చిన్నపుడు  చేతి రాత బాగుంటే తల రాత బాగుంటుంది అనేది అమ్మ  ... 

అది నా బాలశిక్ష చదువు సాగుతున్న రోజులు. 

అమ్మ ప్రశ్న నోటితో అడుగుతుంది. జవాబు నేను పలక మీద రాయాలి. 

"శ్రీరాముడి భార్య పేరు ఏమిటి?" నేను 'శీత' అని రాశాను, హుషారుగా. 

"వర్షాకాలం తర్వాత ఏ కాలం వస్తుంది?" తెలిసిన ప్రశ్నే కావడంతో నాలో హుషారు ద్విగుణీకృతం అయ్యింది. 'సీతాకాలం' అని రాసేశా. 

"ఏ చంటి .. మెలిక శ కీ, కుంటి స కీ తేడా తెలియకపోతే ఎలాగ నీకూ?" చెవి మెలేస్తూ అమ్మ అడిగిన ప్రశ్న ఇది. 

నేను రాసిన పది జవాబుల్లోనూ ఈ రెండే తప్పులు. 


అదిగో అప్పుడు విన్నాను ఈ మెలిక శ, కుంటి స గురించి.

 'మెలిక శ' అనే మాట వినగానే భలేగా నచ్చేసింది. 

ఎందుకో కానీ, 'కుంటి స' అస్సలు నచ్చలేదు. 

'కుంటేమిటీ?' అనుకున్నాను కానీ, పైకనలేదు. 

మొత్తానికి ఈరెండు అక్షరాలతో వచ్చే పదాలు మళ్ళీ మళ్ళీ రాయించీ రాయించీ ఏ అక్షరం ఎక్కడ వాడాలో బాగా అర్ధమయ్యేలా చెప్పింది అమ్మ. 

చాలామంది పిల్లలు హైస్కూలుకి వచ్చేసినా ఈ 'శ' 'స' లతో కుస్తీలు పడుతూనే ఉంటారన్న సంగతి నేను హైస్కూల్లో ప్రవేశిస్తేనే కానీ తెలియలేదు. 

అక్కడ మా మేష్టారు మెలిక, కుంటి అనకుండా 'సీత స' 'శకుంతల శ' అని చెప్పారు. 

ఇదేదో చాలా బాగుందనిపించింది నాకు. 

చక్కగా సీతనీ, శకుంతలనీ గుర్తు పెట్టుకుంటే చాలు. 

పైగా అవేమీ మరిచిపోగలిగే పేర్లు కాదు, రామాయణం, శాకుంతలం అప్పటికే చాలాసార్లు విని ఉండడం వల్ల. 

కాకపొతే ఒక కొత్త సమస్య వచ్చింది. 

కొందరు మేష్టర్లు మెలిక శ - అదే శకుంతల శ - ని 'ష' అని పలికేవాళ్ళు. 

ఉదాహరణకి, శాంతి ని షాంతి అని. 

కాలేజీలో కూడా ఈ శ, స లు వదలలేదు. ఓసారి అనుకోకుండా, ఒక  నోట్సు చూసి, ఈ శ, స లని సరిచేయడం కోసం "ఇక్కడ సీత స కాదు, శకుంతల శ ఉండాలి" అన్నాను.

సంభాషణ భాష గురించి కాక, కాలేజీలో సీత గురించీ, శకుంతల గురించీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాలా?

 వాళ్లు మా సీనియర్స్..

ఎదో వాళ్లకి సమయ స్ఫూర్తి తో నచ్చచెప్పి అక్కడ నుండి తపించుకున్నాను ......


ఇప్పుడు  కాగితం మీద రాసే పని ఉండడం లేదు. అందులోనూ తెలుగు రాసే పని అసలే లేదు. 


నా చేతిరాత ఎలా ఉందో ఏమిటో...😞😞😞

                                                   


                                             లోక సమస్త సుఖినో భవంతు

                                           **** మీ ఉషగిరిధర్ ****