Pages

9, ఆగస్టు 2021, సోమవారం

శనగలమాసం


"ఇవ్వాళ శనగలు సాతాళించొద్దమ్మా.. మాటోళీ చేసుకుందాం. లేకపొతే

వడలేసినా సరే.." 

అమ్మా, నేను  పేరంటానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగానే

రాబోయే శనగలని ఏం చేయాలో నిర్ణయించేశాను నేను. 

శనగలతో బోల్డన్ని వంటకాలు చేసుకోవచ్చు కదా మరి. 

"మాటోళీ ఏవిటి మాటోళీ? పాటోళీ అనాలి. 

వెనకటికి నీలాంటిదే 

చదువుకి ముందు కాకరకాయ్, చదువయ్యాక కీకరకాయ్ అందిట 

" అమ్మ  ఏమో అనేదే కానీ నాన్న  నన్ను రక్షించేశారు "

అది  సరిగ్గానే చెప్పింది  లేవే.. నువ్వు 

చేసేదాన్ని మాటోళీ అనే అనాలి..."


అమ్మా మాట తిరగెయ్యబోయింది...

కానీ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తున్న ఆడవాళ్ళని చూసి ఆగిపోయింది. 

పట్టు చీరలు కట్టుకుని, బోల్డన్ని నగలు పెట్టుకుని వచ్చారు వాళ్ళు.

మరి పేరంటానికి వెళ్ళాలంటే అలాగే తయారవ్వాలి కదా. 

అమ్మ, నేను కూడా తయారైపోయం . 

అసలు శ్రావణ మాసం వస్తుందనగానే

నాకు ఉన్న రెండు పట్టు పరికినిలు రవణమ్మకి 

వేసేస్తుంది అమ్మ, ఓ వంద జాగ్రత్తలు చెప్పి. 

పేరంటానికి పట్టు పరికినిలే కట్టుకుని వెళ్లాలని అమ్మ సిద్ధాంతం. 


పేరంటం అంటే అమ్మా ఎంత బాగా తయారవుతుందో. 

అప్పటికే ముస్తాబులై  వచ్చిన స్నేహితురాళ్ళు 

"ఆలీసం అయిపోతోంది.. తొరగా వచ్చేయండి.." 

అని తొందర పెట్టగానే.....

అమ్మా, నేను  పేరంటానికి బయలుదేరతాము అన్న మాట .


  శ్రావణ మంగళవారం అంటే కనీసం అరడజను పేరంటాలు తప్పకుండా 

ఉంటాయి ఊళ్ళో. 

ఇవి కాకుండా ఇంటికొచ్చి వాయినం ఇచ్చేవాళ్ళు సరేసరి. 

ఇంటినిండా వద్దంటే శనగలు. 

సాతాళింపు, వంకాయి-శనగల కూర, శనగ వడలు, పాటోళీ...

నెలంతా ఇవే వంటకాలు మాకు. 

 అసలు ఈ పేరంటానికి వెళ్ళడం ఓ పెద్ద ప్రహసనం. మధ్యాహ్నం 

పేరంటానికి పొద్దున్న నుంచీ  హడావిడి. 

మధ్యాహ్నం కాఫీలవ్వగానే బయలుదేరతారా, 

మళ్ళీ దీపాలు పెట్టే వేళకి ఇళ్ళు చేరేవాళ్ళు. 


మామూలుగా అయితే మగ పిల్లలకి పేరంటాల్లో ప్రవేశం లేదు.. 

మరి మా తమ్ముడు కి  ఎలా   దొరికిందంటే.. 

బోల్డు బోల్డు శనగలు పట్టుకుని ఒక్కసారే

 ఇంటికి రావడం అమ్మకీ, నాకు  కష్టం కదా

 అందుకని మా తమ్ముడు ప్రతి పేరంటానికీ వచ్చి  

శనగలు ఇంటికి చేరేసే వాడన్న మాట.


 మా తమ్ముడు అలా  పేరంటాలకి వెళ్ళడం బామ్మకి నచ్చేది కాదు. 

"వీడెందుకూ పోతు పేరంటాల్లా.." అనేది కానీ, 

వాడెప్పుడు  పట్టించుకునే వాడు  కాదు.  

అమ్మ తమ్ముడిని  వద్దు అనేది కాదు కానీ బోల్డన్ని జాగ్రత్తలు చెప్పేది.

 ముఖ్యంగా ఎవరు మాట్లాడుతున్నా

 మధ్యలో వచ్చి తన  అభిప్రాయాలు చెప్పొద్దని మరీ మరీ చెప్పేది. 

 అలా పిలవని పేరంటంలా మాట్లాడకూడదుట కదా, అందుకన్న మాట. 


పేరంటం శనగల్లో వేసే కొబ్బరి ముక్కలు ఎంత బాగుంటాయో. 

శనగలు ఇంటికి తెచ్చినప్పుడల్లా నేను,తమ్ముడు కొన్ని కొబ్బరి ముక్కలు నోట్లో 

వేసుకుని (అన్నీ తీసేసుకుంటే అమ్మకి అనుమానంవస్తుంది)

దేవుడి గూట్లో నైవేద్యం కోసం పెట్టిన బెల్లం ముక్కలు

 కూడా బుగ్గన వేసుకుంటూ ఉండేవాళ్ళం . 

అలా నోట్లోనే కొబ్బరి లౌజు తయారు చేసుకునే ఏర్పాటు ఉండేది.

 ఒక్కోసారి  శనగలు మరీ ఎక్కువ వస్తే అమ్మ కొన్నింటిని ఆవుకి పెట్టేసేది.

 "పాడు చేసుకునే కన్నా, దూడకి పెడితే పుణ్యం" అంటూ.


 అసలు పేరంటంలో ఎన్నేసి విషయాలు మాట్లాడుకుంటారంటే.. 

కొత్తగా చేయించుకున్న నగల మొదలు,

 టీవీలో వచ్చే నాటకాల వరకూ దొర్లని టాపిక్ ఉండదు. 

పిల్లల చదువులు, పక్కింటి వాళ్ళతో గొడవలు..ఇవన్నీవినిపిస్తూ ఉండేవి.  

ఎవరైనా పేరంటానికి రాకపోతే వాళ్ళ గురించి కొంచం 

ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు. 


 ఇప్పుడెక్కడా అలాంటి సందడి  కనిపించడం లేదు.. 

కొన్నాళ్ళు పోతే "ఒకప్పుడిలా పేరంటాలు జరిగేవి" అని చెబితే నమ్మరేమో కూడా..





4, ఆగస్టు 2021, బుధవారం

బేరం

బేరమాడడం అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పాలేమో.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వస్తువుని బేరం చేసే ఉంటారు. 

నిజానికి ఈ బేరం ఆడడం అనేది ఒక కళ అనిపిస్తుంది నాకు. 

ముందుగా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే నాకు బేరమాడడం పెద్దగా రాదు. 

అయినా అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. 


నా చిన్నప్పుడు మా ఊళ్లోకి బట్టల మూటల షావుకార్లు వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బట్టల

 మూటలు సైకిల్ వెనుక కట్టుకుని ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాళ్ళు. 

 అందరూ మధ్యాహ్న భోజనాలు ముగించి, అరుగుల మీద చేరి పిచ్చాపాటీ లో పడే

 వేళకి సైకిల్  బెల్లు కొట్టుకుంటూ ఈ షావుకార్లు దిగిపోయే వాళ్ళు.  ఒక్కసారిగా సందడి

 మొదలయ్యేది. 


మా ఇంటి దగ్గర ఎవరు ఏం కొనుక్కోవాలన్నా నాడెం చూడడం (నాణ్యత

 పరిశీలించడం) మొదలు, బేరం చేయడం వరకూ అన్ని బాధ్యతలూ మా

 మేనత్త తీసుకునేది. బేరం చేయడం లో నోబుల్ బహుమతి లాంటిది ఏమన్నా ఉంటే

 ఆవిడకి నిరభ్యంతరంగా  ఇచ్చేయొచ్చు. చెప్పిన రేటుకి సగం నుంచి బేరం

 మొదలయ్యేది. 

డైలీ సీరియళ్ళు లేని ఆ రోజుల్లో ఆ బేరమే గంటల తరబడి సీరియల్లా సాగుతూ

 ఉండేది. 


ఒక బేరం సాగుతూ ఉండగానే మరొకరెవరో వచ్చి ఇంకేదో ఎంపిక చేసుకునే

 వాళ్ళు. అలా అలా సాగి సాగి చివరికి కొనాల్సినవి అన్నీ కలిపి 'కండ గుత్త బేరం' 

కింద  కొనేసి ఎవరి వాటా డిస్కౌంట్ ని వాళ్ళు పంచేసుకునే వాళ్ళు. 

మా మేనత్త స్పూర్తితో నేను స్కూల్లో చదివే రోజుల్లో మొదటి సారి బేరం చేశాను,

 బడి దగ్గర కొట్లో నిమ్మతొనలు. అంటే నిజం నిమ్మతొన కాదు, 

తియ్యగా పుల్లగా ఉండే ఒక చాక్లెట్. 

మా అత్త కి ఉన్నంత టాలెంట్ నాకు లేకపోవడం వల్ల బేరం కుదర లేదు. 


హైస్కూల్లో చదివే రోజుల్లో 'పెళ్లి బేరాలు' అనే మాట నా చెవిన పడింది. 

అంటే కట్న కానుకలు మాట్లాడుకోవడం అన్నమాట.

 వినడానికి కొంచం అదోలా అనిపించినా ఆ పేరు సరైనదే అనిపించింది తర్వాత్తర్వాత.

 మేష్టారు హాజరేస్తూ ఒకమ్మాయి పేరు దగ్గర ఆగి 'ఎందుకు రాలేదు?' అని అడిగారు. 

 ఆమె స్నేహితురాలు లేచి నిలబడి 'ఇయ్యాల్దానికి పెళ్లి బేరాలండి' అనగానే క్లాసంతా గొల్లుమంది. 

 మేష్టారు పాపం నవ్వాపుకుని సైలెన్స్ అని అరిచారు. 


కాలేజీ పిల్లలెవరి దగ్గరైనా 'బార్గెయిన్' అని చూడండి. ముఖం చిట్లిస్తారు. 

మా రోజుల్లో కూడా అంతే.

అమ్మతో బయటికి వెళ్ళినప్పుడు తనేమైనా బేరం చేస్తుంటే 

'అబ్బా.. ఎందుకమ్మా' అని విసుక్కునే దానిని . 

'నీకు తర్వాత తెలుస్తుందిలే ' అనేది. తెలిసింది, నిజంగానే. మన దగ్గర బేరమాడే టాలెంట్

 లేనప్పుడు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తే ఉపయోగం అన్న సత్యం బోధ పడింది. 

వాళ్ళు బేరం చేసేటప్పుడు అమ్మకందారు మనం అడక్క పోయినా మనకి 'న్యాయమూర్తి' హోదా

 ఇచ్చేసినా, మనం ఆవేశ పడిపోకూడదనీ, మౌనంగా ఉండాలనీ కొన్ని అనుభవాలు నేర్పాయి.


ఇప్పటికీ నేను కూరగాయలు బేరం చేయడం లో వీక్. 

ఆ మాటకొస్తే ఎంపిక చేయడంలో కూడా. 

వీధుల్లో అమ్మోచ్చే కూరగాయలు, పళ్ళు గీసి గీసి బేరం చేసేవాళ్ళు కూడా 'ఫ్రెష్' లకీ 'స్టోర్' లకీ

 వెళ్తే బేరం మాట మర్చిపోవడం వింతల్లోకెల్లా వింత. 

బేరం గురించి ఎంత చెప్పినా తరగని విశేషాలు పుడుతూనే ఉంటాయి మరి. 

అన్నట్టు ఈ టపా రాస్తున్నంత సేపూ 'భలే మంచి చౌక బేరము..' పాట గుర్తొస్తూనే ఉంది నాకు..

30, జులై 2021, శుక్రవారం

నమశివాయలు

                    కాశీలో విశ్వేశ్వర మా జనని అన్నపూర్ణాదేవి తో 

                    కలభైరవ ఈశ్వర జీవులను కరుణించు                    || నమశివాయ||


                  గంగ యమున నడుమను సరస్వతి సంగమ యుండగాను 

                   నాసిక త్రివేణి లో నాణ్యము గా చూడుము                   || నమశివాయ||

 

 జనన మరణములన గా ఈ జన్మలో పుట్టించొచ్చు చందురు 

 మీ నామ పంచాక్షరి స్థిరముగా నిలుపు మీ                   || నమశివాయ||


 కుక్క వలే తిరుగుతూ చాడీలు చక్కగా చెప్పుచుందురు 

 ఒకవేళ ఉన్న బుద్ధి ఒకవేళ ఉండదు                          || నమశివాయ||


 గంతలు  తొమ్మిది ఆలోపల దంతాలు వేయి ఉండును

పంచ క్రోధముల బట్టి నీ యందు పసలేదు                || నమశివాయ||


 మలమూత్రములు గుంటలు ఆ లోపల మాంసపు  నెత్తురు కండలు

 మురికి ప్రేగుల దండతో పైతోలు బహు తీపి                 || నమశివాయ||


 వేదములు చదివిన ఎన్నెన్ని వేషాలు వేసినా

 నీ భక్తి లేని వారు కాశీలో కొరగారు                      || నమశివాయ||


 కామ క్రోధములు లకే మానవులు కాలమంతయు గడుపుచూ 

 మోహజ్వాలములగుచూ  మీకంటే వెలలేదు      || నమశివాయ||


పగలు నాలుగు ఝూములు  పోకిరీలు పోవుచు తిరుగుచుందురు 

 రాత్రి పొద్దు వేళ నా అతి కేలి భోగములు అనుభవిస్తారు 

 ఆమీద కను నిద్రతో మిమ్మలను తలువరు         || నమశివాయ||

 

 పెక్కు మాటలాడుతూ పెద్దలను వింతగా దూషించు 

 సజ్జలు చూచి నవ్వి చప్పట్లు తలువారు                  || నమశివాయ||

 

 ఈశ్వరా నీ నామము యిలలోన ఎవరూ పాడి వినను

 కైవల్యము తో ముక్తి పొందుతారు                      || నమశివాయ||


                                              లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ *****

27, జులై 2021, మంగళవారం

నవ గ్రహ పాట

1. శ్రీసర్వేశ్వరవర తనయూడు - తేజస్కామూడు |

    సిద్ధి బుద్ధి ­నాయుకుడు - ఆశ్రితవరదూడు |

    గజముఖధరుడూ - గణనాయుకుడు |

    మూషిక వాహన - మోదకహస్తుడు

    శ్రీ అఖండ  గణపతి రక్షించు  ఈ దంపతులనూ ||


2.    హంసవాహనుడు అబ్జాసనుడూ - నారాయుణ సుతుడూ|

       వాణి తలమున వీణా కలిగిన - వాణీ ­ విభుడు |

      వేద జనకుడు వేదాతీతుడు - వేదాంత ­చారపరుడూ |

      బ్రహ్మ దేవుడు రక్షించు  ఈ దంపతులనూ ||


3.   లక్షీసహితుడు నిక్షేపాజ్ఞుడు - పక్షివాహనుడు |

      పాతక సంహారుడు - పీతాంబరధరుడూ |

      అహల్య శాప ­మోచనుండు - అక్షయుమొసగిన ఆది దేవుడు |

    శ్రీమహా­ష్ణువు - రక్షించు ఈ దంపతులనూ ||


4.  పార్వతి సహితుడు - పన్నగధరుడు - ఫాలనేత్రుడు |

    గౌరీహితుడు - గంగాధరుడు - గజచర్మాంబరధరుడూ |

    కరిముఖజనకుడు - గరళగ్రీవుడు - కైలాసాద్రినివాసుండైన |

    సాంబ మూర్తి రక్షించు - ఈ దంపతులనూ ||


5.  రక్తవస్తువు ప్రీతికరుడు - రత్నాంబరధరుడూ |

    రక్తగాత్రుడు - బూగ్వేదుడూ - వేదాచార్యుడు |

    పదిమూడారింట, ఫలదాయుకుడూ - పంచమరాశిన నివసించెడువాడు|

    సూర్యగ్రహము రక్షించు - ఈ దంపతూలనూ ||


6.   తెల్లనిగంధము - తెల్లనిమేను - తేజస్కామూడు |

    రోహిణి హితుడు - రాత్రీశ్వరుడూ - రూఢిగ ఇతడూ |

    ఆరు, ఒకటి, మూడెడింటను ఎప్పటికిని ఫలదాయుకుడైనా |

    చంద్రగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


7.  అప్రకాశూడు ఆదిత్యోత్తము - డత్యంతోత్తముడు |

     మేషవృశ్చిక రాసుల యుందు కాంక్ష గలవాడు |

    ఆడకధాన్య ఆహారపరుడు - అగ్నిహోత్రునకు అనుకూలుండు |

    అంగారకగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


8.   సోముని సుతుడు మేషాతీతుడు - మేధాతీతూడూ |

    కన్య ­ధున రాసులయుందు కాంక్ష గలవాడు |

    ఎనిమిది నాలుగు పది రెండింటను - ఎప్పటికిని ఫలదాయుకుడైనా |

    బుధగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


9.   ధునధనుస్సులాకారముగా - మేదిని లోపలను |

    తొ్మ్మ్దిది రెండెడింటను తొలుతగా ఫల­ుచ్చు |

    బుగ్వేదాత్తుడు - లోకాతీతుడు - ప్రీతిదై్వత ప్రీతి కరుడూ |

    గురుగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


10.  వృషతుల రాశుల యీరెండింటని - ­వరించెడువాడు |

    భార్గవసుతుడు దానవ హితుడు - ప్రఖ్యాతైనవాడు |

    ఆరు ఒకటి మూడేడింటను - ధనము నొసగెడి - ధవళ శరీరుడు |

    శుక్ర గ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


11.   మంద గమనుడు - మలిన శరీరుడు - మలినాంబరధరుడూ |

    ఆరు - మూడింటను - అనుకూలుండు - ఆయూశ్కారకుదు |

    కుంభమృగాదులు కోరిన విభుడూ -ఛాయూధరడూ ఛాయూ సుతుడు

    శని గ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


12. కృష్ణవర్ణుడు - కృష్ణశరీరుడు - కృష్ణాంబరధరుడూ |

    సృష్టీపరుడూ - నిష్టాపరుడూ - శ్రేష్టుండవు నీవు |

    మాషాశనుడవు - మన్మధ ­మిత్రుడవు |

    మూడారింటను - ముఖ్యుడవైనా |

    రాహుగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


13. చిత్రవర్ణుడు - చిత్రశరీరుడు - చిత్రాంబరధరుడూ |

    చిత్రాగుప్తాదుల తోటి - మైత్రీగలవాడు |

    త్రిషడస్థానందు శివుడూ వృషళీ పతుడూ కుళుధ్వజుడు |

    కేతుగ్రహము రక్షించు - ఈ  దంపతులనూ ||


14.  ఆశించెవ్వరు నవగ్రహాల - మంగళహారాతీ

    పాడీ ­న్నను - కాశీయూత్రా చేసిన ఫలమూ

    వాసిగ వారణాశి సుబ్బయు్యశాస్త్రి - శాశ్వత వరద నివాసుండైనా

    శ్రీసర్వేశ్వరవర సన్నిధికి - చేరుదు మెల్లపుడూ ||

16, జులై 2021, శుక్రవారం

కాసిని చల్లని కబుర్లు


నెల్లాళ్ళ నుంచీ ఎదురు చూస్తూ ఉండగా .......

ఇదిగో ఇవాళ కాస్త చెప్పుకోగలిగే విధంగా నాలుగు చుక్కలు విదిల్చింది ఆకాశం. 

చిన్న చిన్న జల్లులు వాతావరణాన్ని చల్లబరిచి, మనసు తేలిక పరిచాయి. 

హమ్మయ్య.. వర్షాలకి మనఃశ్శరీరాలని సిద్ధం చేసేసుకోవచ్చు అన్న నమ్మకం కుదిరింది.

 ఓ ఎనిమిది నెల్ల వరకూ ఈ ఎండల బాధ ఉండదింక. 

 నావరకూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే ఇది.

 ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. 


పొద్దుపొద్దున్నే వర్షాన్ని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతూ, పేపర్లు చదువుకుంటున్నానా?

నా ఆనందాన్ని భగ్నం చేస్తూ ఓ ఫోన్ కాల్.

నా సహా ఉద్యోగి... వాళ్ళ కాలనీ నీటిలో మునిగి పోయింది అని ... ఈ  రోజు సెలవు తీసుకుంటాను అని .

ఆ పని భారం కూడా నా మీద పడింది .

చికాకు తో ఆఫీస్ పని మొదలు పెట్టాను .. 

అస్సలే శుక్రవారం . 

పైగా వాతావరణ చల్లగా పనికి అస్సలు అనుకూలంగా లేదు ...  తప్పదు కదా .. 


భాగ్య నగరంలో నివాసం ఉంటున్న మిత్రులతో కొన్ని కాల్స్ మాట్లాడాను.

 ఏమిటో, అందరూ కరోనా మూడ్ లో ఉన్నారు. 

 కరోనా వల్ల ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకొక్కరూ వివరంగా చెప్పడం మొదలుపెట్టారు. 

 వీళ్ళంతా బొత్తిగా సామాన్య జనం అవ్వడం వల్ల కేవలం వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. 

 ఎవరైనా అంతే.. ముందర ఇల్లు చక్కబెట్టుకుని ఆతర్వాత ఇతర విషయాలు ఆలోచించాలి మరి. 


జల్లుల పుణ్యమాని కాఫీటీల సంఖ్య రోజూ కన్నా పెరిగింది. 

వర్షాకాలంలో వీటిని కొంచం అదుపులో పెట్టాలి, ఏదో ఒకటి చేసి. 

సరే నా చికాకు చికాకులాగే ఉండిపోయింది కదా.. దానిని పారదోలే ఉపాయం ఒక్కటే. 

అదే అమలుచేశాను. ....ఈ టపా  తో ....                                     మీ ఉషగిరిధర్ 



12, జులై 2021, సోమవారం

పంచ మహా కావ్యములు


తెలుగు భాషలో పంచ మహా కావ్యాలు 


1. మను చరిత్రము - (అల్లసాని పెద్దన) :

 మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము.

 అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. 

ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. 

 

2. పాండురంగ మాహాత్మ్యము - (తెనాలి రామకృష్ణుడు)

 తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము.

 ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది.

ఇందు ఇతివృత్తము పాండురంగని కథ.

 

3. ఆముక్త మాల్యద - (కృష్ణదేవరాయలు)

  విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. 

ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీశిశువు లభిస్తుంది.  సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మలో భూదేవి.  తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది.  ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది.  తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.

 

4. వసు చరిత్రము - (రామరాజ భూషణుడు.)


   రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు.   వసు చరిత్రము భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది,

   దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

   

5. పారిజాతాపహరణం - (నంది) ముక్కు తిమ్మన.


ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు.

నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం.


సంస్కృత భాషలో పంచ మహా కావ్యాలు 


1.రఘువంశము ( కాళిదాసు రచన):

మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు.


2.కుమారసంభవము ( కాళిదాసు రచన):

పార్వతితో పరమేశ్వరుని వివాహం, అనంతరం కుమారస్వామి జననం తారకాసురుని వధ మొదలయిన విషయాలు మహాకవి కాళిదాసు చాలా చక్కగా వర్ణించాడు.


3.మేఘసందేశము ( కాళిదాసు రచన):

 కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో ఇది ఒకటి.కేవలం 111 శ్లోకాలతో కూడిన ఈ చిన్నకావ్యము కాళిదాసు రచనలలోను, సంస్కృత సాహిత్యంలోను విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. 

 కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు కొలువునుండి ఒక సంవత్సరం పాటు బహిష్కారానికి గురవుతాడు. ఆ యక్షుడు హిమాలయాలలోని కైలాసగిరికి పైన, అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి ఒక మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గసూచకంగా యక్షుడు ఆ మేఘానికి హిమాలయాలకు పోయే దారిలోనున్న పెక్కు దృశ్యాలను వర్ణిస్తాడు.మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, పాత్ర చిత్రణ, శృంగార ప్రస్తావన అద్భుతంగా కనిపిస్తాయి. ఇంకా వివిధ భౌగోళిక అంశాలు చెప్పబడ్డాయి.


4.కిరాతార్జునీయము (భారవి రచన):

ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది.ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు. 

5.శిశుపాలవధ (మాఘుని రచన)


శిశుపాల వధ 7 లేదా 8 వ శతాబ్దంలో మాఘ స్వరపరిచిన శాస్త్రీయ సంస్కృత కవితల రచన. ఇది సుమారు 1800 అత్యంత అలంకరించబడిన చరణాలలో 20 సర్గాలలో ఒక ఇతిహాసం.

1, జులై 2021, గురువారం

అల్లసాని వాని అల్లిక జిగిబిగి

ఈ టపా లో నేను స్కూల్ లో బాగా చెప్పి .....
మా తెలుగు మాస్టారు చేత మెప్పు పొందిన ..
ప్రసిద్ధమైన అల్లసాని పెద్దన గారి పద్యం గురంచి చెపుతాను :

అప్పుడు పద్యం మాత్రమే వచ్చు ... దాని అర్ధం ఇప్పుడు బాగా తెలిసింది .. 


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. 

అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు -
మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". 

మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. 

అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు.

వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? 

ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. 

ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. 

ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. 


ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. 

 అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! 

అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. 

వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ tourist గా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. 

కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. 

యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. 

మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. 

తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. 

ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి,

పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. 

ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. 

సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, 

ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.


ఈ పద్యం లో  అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!

శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! 

దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు.


 ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి.

 ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, 

 "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! 

 ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం,

 హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

 చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!

ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - 

"అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు?

 "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!

"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, 

"సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, 

"ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, 

"అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, 

"నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, 

"పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, 

"కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. 

ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. 

ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. 

నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. 

ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! 

శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.

ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!

ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, 

"కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. 

ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. 

అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.

ఇదే "అల్లసాని వాని అల్లిక జిగిబిగి"!